TS News: యాదాద్రీశుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు.

Updated : 24 Sep 2022 17:03 IST

యాదాద్రి, భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కిషన్‌రెడ్డికి ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణలతో అర్చకులు కిషన్‌రెడ్డిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ నూతన నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణాల గురించి ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కిషన్‌రెడ్డికి వివరించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా నిన్న రాత్రి యాదాద్రిలోని హరిత హోటల్‌లో బస చేసిన కిషన్‌రెడ్డి.. యాదాద్రీశుడిని దర్శించుకున్న అనంతరం తిరిగి మూడో రోజు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

దేశంలో పర్యాటక శాఖను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునఃప్రారంభించాలని అనుకుంటున్నామన్నారు. తెలుగు ప్రజల ఆశీస్సులతోనే కేంద్ర మంత్రి అయ్యానని తెలిపారు. తనపై ప్రధాని మోదీ కీలక బాధ్యతలు పెట్టారని చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పర్యాటకం దెబ్బతిందని వివరించారు. దేశంలో పర్యాటక శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. యునెస్కో గుర్తించిన 40 కేంద్రాలు దేశంలో ఉన్నాయని.. వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

‘‘బతుకమ్మ, బోనాల, వినాయకచవితి, మేడారం జాతరలను చిత్రించి దేశ వ్యాప్తంగా చూపించబోతున్నాం. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్ర పండుగలను గుర్తిస్తాం. భువనగిరి కోటకు ప్రత్యేకత ఉంది.  ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రోప్‌ వే ద్వారా పర్యాటకులను ఆకర్షింపజేయాలి. భద్రాచలం, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గత పాలకులు ఈ ఆలయాల అభివృద్ధిని పట్టించుకోలేదు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని