K Keshava Rao: సమాఖ్య స్ఫూర్తికి తూట్లు

భారత్‌ అన్న ఆలోచన (ఐడియా ఆఫ్‌ ఇండియా)కు ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఆర్థికంగా మనం విడిపోయినట్లు బుధవారం ఒక నాయకుడు చెప్పారు. లౌకికంగా, సాంస్కృతికంగానూ దేశంలో విభజన వచ్చింది. మతాల మధ్య విద్వేషాలు సృష్టించడం దేశ మూల సిద్ధాంతానికి వ్యతిరేకం.

Updated : 04 Feb 2022 05:34 IST

దక్షిణాది రాష్ట్రాలపై నిర్లక్ష్యం  

ప్రమాదంలో దేశం
రాష్ట్ర జాబితాలోని అంశాలపై జోక్యం  
 కేసీఆర్‌ ‘కొత్త రాజ్యాంగ’ సూచన అందుకే
రాజ్యసభలో కేంద్రంపై కేకే ధ్వజం  
ఈ ప్రభుత్వానికి మద్దతివ్వబోమని స్పష్టీకరణ


భారత్‌ అన్న ఆలోచన (ఐడియా ఆఫ్‌ ఇండియా)కు ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఆర్థికంగా మనం విడిపోయినట్లు బుధవారం ఒక నాయకుడు చెప్పారు. లౌకికంగా, సాంస్కృతికంగానూ దేశంలో విభజన వచ్చింది. మతాల మధ్య విద్వేషాలు సృష్టించడం దేశ మూల సిద్ధాంతానికి వ్యతిరేకం.


భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకిక భారతీయత, అతివాద హిందుత్వం అన్న అంశాలు పదునెక్కాయి. ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యం ప్రజా పునరేకీకరణకు పునాదిగా మారుతోంది. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగి మన మెదళ్లను కలుషితం చేస్తే రెండు దేశాలను చూడాల్సి వస్తుంది.


ఈనాడు, దిల్లీ: ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మూల సూత్రాలకు తీవ్ర ముప్పు ఏర్పడిందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు పేర్కొన్నారు. విద్వేషపూరిత రాజకీయాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆవేశంగా మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర విస్మరణకు గురవుతున్నాయని ఆరోపించారు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బాగా ఆలోచించి కొత్త రాజ్యాంగం తీసుకురావాలన్న చర్చను దేశం ముందుపెట్టారని ఆయన పేర్కొన్నారు’’. ఈ ఎన్డీయే ప్రభుత్వ హయాంలో విద్వేషపూరిత ప్రసంగాలు 1,333% మేర పెరిగినట్లు టీవీల సర్వేల్లో వెల్లడైంది. హిందీ అంత సరళంగా అర్థంకానందున ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పాలని ఉదయం సభలో ఓ సభ్యుడిని కోరితే.. కార్మికశాఖ మంత్రి మాత్రం తాము హిందీ ఒక్కటే మాట్లాడతామని బదులిచ్చారు. ఇలాంటి వైఖరి పోవాలి. దక్షిణాది రాష్ట్రాల్లో చాలామందికి ఈ భాష అర్థమేకాదు. వారితో కలుపుగోలుకు ప్రయత్నించాలి.  

మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి
ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో చూడాలి. మీరు రాష్ట్రాల అధికారాలు లాగేసుకోవడానికే సమాఖ్యవ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకూ మద్దతిచ్చిన మేం ఇక భవిష్యత్తులో ఆ పని చేయకూడదని నిర్ణయించాం. మాలో అంతటి మార్పు ఎందుకు వచ్చిందో మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. పౌరసత్వ చట్టాన్ని మార్చడం ద్వారా రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కేంద్రం విధ్వంసం చేసింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ బిల్లుల ద్వారా మతతత్వాన్ని పెంచిపోషించాలని చూసింది. త్వరలో తీసుకురాబోయే విద్యుత్తు చట్టసవరణ బిల్లుతో ప్రైవేటు వారు పంపిణీ రంగంలోకి వస్తారు. లాభాలొచ్చే ఏరియాలు వారి చేతుల్లోకి వెళ్తాయి. మారుమూల ప్రాంతాలకు కరెంటు ఇచ్చే బాధ్యత మాత్రం ప్రభుత్వంపై పడుతుంది. మేం రైతులకు 24 గంటలూ ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. ఈ బిల్లు కారణంగా ప్రతి మోటారుకు మీటరు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల రైతుల మెడపై కత్తి వేలాడదీసినట్లవుతుంది.

రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయంలో జోక్యం
వ్యవసాయ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందన్న రాజ్యాంగ సూత్రాన్ని విస్మరించి కేంద్రం ఏకపక్షంగా సాగు చట్టాలు తెచ్చింది. 14 నెలలు ఆందోళన చేసి 700 మందికి పైగా రైతులు చనిపోవడానికి కారణమైంది. రాష్ట్రపతి ప్రసంగంలో దాని గురించి ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెప్పినా చట్టబద్ధతేమీ కల్పించలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ గతంలో చెప్పారు. కానీ సాగు ఖర్చులు రెండింతలయ్యాయి. ప్రస్తుత వ్యవసాయ వృద్ధిరేటు 3.9%. అన్నదాతల ఆదాయం రెట్టింపు కావాలంటే ఇది 12-14% నమోదుకావాలి. దేశం మొత్తం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. మీ హయాంలో రాజ్యాంగ మూల సూత్రాలైన లౌకికతత్వం, గవర్నర్‌ కార్యాలయాలు, రాష్ట్ర పరిధిలోని అంశాలు ప్రమాదంలో పడిపోయాయి. ఇప్పటికే మనం 105 రాజ్యాంగ సవరణలు చేసినా సంతృప్తికరంగా లేదు. అందువల్ల రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనను కేసీఆర్‌ దేశం ముందు చర్చకు పెట్టారు’’ అని కేశవరావు పేర్కొన్నారు.


వనరుల పంపిణీలో దక్షిణాదికి అన్యాయం

ఈ ప్రభుత్వ పాలనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. పన్ను వాటా పంపిణీయే ఉదాహరణ. జనాభా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పాపానికి అధిక కోత పెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.28 వేల కోట్లకు పైగా గ్రాంట్‌ వస్తుందని ఆశిస్తే వచ్చింది రూ.5,155 కోట్లే. కేంద్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ. కానీ ఈ ప్రాంతానికి మీ పాలనలో ఒక్క పెద్ద సంస్థ కూడా రాలేదు. విభజన హామీలనూ పట్టించుకోలేదు.  


కేసీఆర్‌ ప్రతిపాదన భాజపాకు మేలుచేస్తుంది: ఖర్గే

కేసీఆర్‌ చేసిన కొత్త రాజ్యాంగ ప్రతిపాదనను రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు. ఆ విషయాన్ని కేశవరావుకు సభలో స్పష్టంచేశారు. ‘‘మీరు రాజ్యాంగం మార్పు గురించి మాట్లాడితే దాన్ని వ్యతిరేకించేవారిలో మేం ముందుంటాం. మీరు సవరణలు సూచించవచ్చు తప్పితే మార్చాలనడం తప్పు. అధికారంలో ఉన్న వారు ఎప్పటి నుంచో ఆ పని చేయాలనే కోరుకుంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారూ అదే మాట్లాడుతున్నారు. మీ వాదన వారికి మేలు చేకూరుస్తుంది’ అని మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని