Ukraine Crisis: రష్యాకు ఇప్పటికీ గగనమే!
ఆధునిక యుద్ధంలో శత్రు గగనతలాన్ని త్వరగా నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా కీలకం. లేకుంటే పైచేయి సాధించడం కష్టం. గగనతల దాడుల విషయంలో రష్యా వ్యూహం అనుకున్న స్థాయిలో సఫలం
ఉక్రెయిన్ నింగిపై పట్టు సాధించలేక ఆపసోపాలు
యుద్ధ మందగమనానికి ఇదే కారణం?
ఆధునిక యుద్ధంలో శత్రు గగనతలాన్ని త్వరగా నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా కీలకం. లేకుంటే పైచేయి సాధించడం కష్టం. గగనతల దాడుల విషయంలో రష్యా వ్యూహం అనుకున్న స్థాయిలో సఫలం కాలేదని, ఉక్రెయిన్పై వైమానిక దాడుల్లో ఊహించినంత పురోగతి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒక దేశంపైకి దండెత్తే సైన్యం.. మొదట అక్కడి వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. దీనివల్ల శత్రు గగనతలంపై వారికి పూర్తి పట్టువస్తుంది. భూతల బలగాలు మరింత సమర్థంగా పోరాటం సాగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలుకాగానే రష్యా తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సైబర్ యుద్ధ సామర్థ్యాన్ని ప్రయోగించి ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ, సైనిక కమ్యూనికేషన్లను నిర్వీర్యం చేస్తుందని అమెరికా సైనికాధికారులు భావించారు. కానీ, అది జరగలేదు.
ఎందుకు?
ఉక్రెయిన్ సైన్యం త్వరగా చేతులెత్తేస్తుందని, రాజధాని కీవ్ వేగంగా తమ వశమవుతుందని, అదే ఊపుతో తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలను మట్టి కరిపించొచ్చని పుతిన్ భావించి ఉంటారని సైనిక నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ప్రత్యర్థి గగనతలంపై ఆధిపత్యం సాధించాల్సిన అవసరం ఉండదని ఆయన లెక్కలు కట్టినట్లు వారు విశ్లేషిస్తున్నారు. ఈ అంచనాలతోనే ఆయన యుద్ధ వ్యూహాన్ని రచించినట్లు చెబుతున్నారు. అయితే ఆచరణలో అది విఫలమైంది. రష్యా సైనిక చర్య మొదలై ఆరు రోజులు గడిచింది. అయినా ఉక్రెయిన్లో ఒక్క ప్రధాన నగరాన్ని కూడా పుతిన్ సేన స్వాధీనం చేసుకోలేకపోయింది.
ఉక్రెయిన్ యుక్తి
ఉక్రెయిన్ ఆక్రమణకు పుతిన్ ఆదేశాలివ్వగానే క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో రష్యా సైన్యం విరుచుకుపడింది. అనేక రాడార్లు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్-300 పి వంటి వ్యవస్థలనూ నాశనం చేసింది. అయితే ఉక్రెయిన్ తెలివిగా వ్యవహరిస్తూ తన వైమానిక శక్తిని, క్షిపణి రక్షణ వ్యవస్థలను రక్షించుకుంది. ఫలితంగా అలాగే ఆ దేశ యుద్ధవిమానాలు, హెలికాప్టర్లలో అనేకం ఇప్పటికీ వినియోగ స్థితిలోనే ఉన్నాయి.
ఆధునిక యుద్ధవిమానాలెక్కడ?
ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై తొలుత క్షిపణులతో దాడి చేసిన రష్యా.. ఆ తర్వాత సుఖోయ్-34 వంటి ఆధునిక యుద్ధవిమానాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించుతుందని అందరూ అంచనావేశారు. అవి ప్రత్యర్థి వాయుసేనకు మరింత నష్టం కలిగించి,
అక్కడి గగనతలంపై పుతిన్ సేనకు పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించిపెడతాయని భావించారు. కానీ అలా జరగలేదు.
రష్యా వద్ద దాదాపు 300 వరకూ అత్యాధునిక యుద్ధవిమానాలు ఉన్నాయి. అవి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరువలోనే మోహరించి ఉన్నాయి. అయితే వాటిని పుతిన్ రంగంలోకి దించలేదు.
ఫలితమిదీ..
* ఉక్రెయిన్ గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోవడం రష్యాకు ప్రతికూలంగా మారింది. ఫలితంగా ఉక్రెయిన్ యుద్ధవిమానాలు స్వేచ్ఛగా ప్రతిదాడులకు దిగుతున్నాయి. తక్కువ ఎత్తులో ఎగురుతూ రష్యా పోరాట హెలికాప్టర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ సైన్యం కూడా వాటిని స్టింగర్ క్షిపణులతో నేలకూలుస్తోంది. భూతలంపై పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుల నైతిక స్థయిర్యాన్ని ఇది పెంచుతోంది.
* గగనతలం నుంచి సరైన రక్షణ కల్పించకుండానే ట్యాంకు దళాలను యుద్ధరంగంలోకి రష్యా పంపుతోంది. శత్రు యుద్ధవిమానాలను కూల్చే క్షిపణి వ్యవస్థలను కొన్నిసార్లు రంగంలోకి దించుతున్నప్పటికీ సమన్వయ లేమి వల్ల అవి సైనిక ట్రాఫిక్లో చిక్కుకుపోయి, అవసరమైన సాయాన్ని అందించలేకపోతున్నాయి.
* దీంతో ఉక్రెయిన్కు చెందిన ‘బేరక్తియార్ టిబి62’ వంటి సాయుధ డ్రోన్లు రంగంలోకి దిగి రష్యా ట్యాంకులకు గణనీయ స్థాయిలో నష్టం కలిగిస్తున్నాయి.
చాలినన్ని బాంబులు లేవా?
రష్యా తన అధునాతన యుద్ధవిమానాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించకపోవడానికి పలు అంశాలు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
* యుద్ధవిమానాల ద్వారా జారవిడిచే ‘ప్రిసిషన్ గైడెడ్ మ్యునిషన్’ (పీజీఎం) బాంబులు సరిపడా లేకపోవడం. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించడంలో వీటికి తిరుగులేదు. వీటితోపాటు సాధారణ బాంబులు, రాకెట్లుకూ కొరత తలెత్తి ఉండొచ్చు.
* ఉక్రెయిన్లో పెద్ద సంఖ్యలో రష్యా బలగాలు విమాన విధ్వంసక క్షిపణులతో రంగంలోకి దిగిన నేపథ్యంలో వాటి నుంచి సొంత యుద్ధవిమానాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. దీన్ని నివారించాలంటే రెండు విభాగాల మధ్య గరిష్ఠ స్థాయిలో సమన్వయం ఉండాలి. అలాంటి యంత్రాంగం రష్యా సైనిక బలగాల్లో అంతంతమాత్రంగానే ఉంది.
* పశ్చిమ దేశాలతో పోలిస్తే రష్యా యుద్ధవిమాన పైలట్ల శిక్షణ స్థాయి తక్కువగా ఉంది. రష్యా పైలట్ల సరాసరి గగనవిహార సమయం ఏడాదికి 100 గంటల మేర ఉంటోంది. అమెరికా పైలట్ల విషయంలో అది 180 నుంచి 240 గంటలుగా ఉంది.
ఇక మరింత ముమ్మర దాడులు?
గగనతలంపై పట్టు సాధించలేపోవడంపై రష్యా కమాండర్లు అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు కీవ్పై మరింత దురుసుగా దాడులు చేయడంతోపాటు ఉక్రెయిన్లో మిగిలిన గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇందుకోసం మరిన్ని యుద్ధవిమానాలు, బాంబర్లను రంగంలోకి దించొచ్చు. మరోవైపు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాల నుంచి స్టింగర్ క్షిపణులు, ఇతర గగనతల రక్షణ ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పోరు తీవ్రం కావొచ్చని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం