Azadi Ka Amrit Mahotsav: చికుబుకు చికుబొక్కేశారు

రైల్వేను అతిపెద్ద ఘనతగా, భారత్‌కు తామిచ్చిన బహుమతిగా తెల్లవారు చెప్పుకొంటుంటారు. వ్యాపార ప్రయోజనాల కోసం రైళ్లకు శ్రీకారం చుట్టిన బ్రిటిష్‌ సర్కారు... ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అవినీతితో భారత్‌లో పట్టాలు వేసింది. మన డబ్బుతో... మనదేశంలో రైళ్లు నడుపుతూ..

Updated : 25 May 2022 08:57 IST

రైల్వేను అతిపెద్ద ఘనతగా, భారత్‌కు తామిచ్చిన బహుమతిగా తెల్లవారు చెప్పుకొంటుంటారు. వ్యాపార ప్రయోజనాల కోసం రైళ్లకు శ్రీకారం చుట్టిన బ్రిటిష్‌ సర్కారు... ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అవినీతితో భారత్‌లో పట్టాలు వేసింది. మన డబ్బుతో... మనదేశంలో రైళ్లు నడుపుతూ... మన ప్రజలనే తృతీయశ్రేణి ప్రయాణికులుగా చూస్తూ... కరడుగట్టిన జాత్యహంకారాన్ని ప్రదర్శించింది.

ఈస్టిండియా కంపెనీ పాలన పగ్గాలు చేపట్టిన సమయానికి... చాలా దేశాల్లో మాదిరిగా భారత్‌లోనూ రవాణా వ్యవస్థ గుర్రపు బగ్గీలు, ఎడ్లబండ్లు, వివిధ రకాల జంతువుల ఆధారంగా సాగేది. భారత్‌లోని వనరులు, సంపదను కొల్లగొట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించటానికి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ఈస్టిండియా కంపెనీ భావించింది. పారిశ్రామిక విప్లవం ఫలితంగా వచ్చిన రైల్వేలను భారత్‌లోనూ ప్రవేశపెట్టాలనుకొంది. మద్రాసు రాష్ట్రంలో 1832లో తొలిసారిగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గోదావరి డెల్టాను అన్నపూర్ణగా మార్చిన ఆర్థర్‌ కాటనే భారత్‌లో తొలి రవాణా రైలును ఆవిష్కరించారు. దీని పేరు రెడ్‌హిల్‌ రైల్వే. గ్రానైట్‌ సరఫరా కోసం మద్రాసులోని రెడ్‌హిల్స్‌ నుంచి చింతాద్రిపేట బ్రిడ్‌్్జ దాకా ఇది నడిచింది. అదే విధంగా 1845లో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణానికి బండను సరఫరా చేసే నిమిత్తం గోదావరి డ్యామ్‌ కన్‌స్ట్రక్షన్‌ రైల్వే నడిపారు కాటన్‌. పని పూర్తికాగానే ఈ లైన్లను తొలగించేశారు. భారత్‌లో తొలి ప్రయాణికుల రైలు... బొంబాయిలోని బోరిబందర్‌ నుంచి థానే దాకా... 34 కిలోమీటర్లు నడిచింది. మూడు లోకోమోటివ్‌ స్టీమ్‌ ఇంజిన్లు... 14 బోగీలు, 400 మంది ప్రయాణికులతో సాగింది.

అది మొదలుగా... బ్రిటిష్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని... రైల్వేల విస్తరణ వేగంగా సాగింది. తమ పాలనను బలోపేతం చేసుకోవటం, మిలిటరీ తరలింపు, వస్తు ఉత్పత్తుల రవాణా, ఆంగ్లేయుల వినోదం... ప్రధానోద్దేశాలుగా... అనువైన మార్గాలను ఎంచుకొని రైల్వే లైన్లు విస్తరించాయి. ‘రైల్వేల ద్వారా భారత మార్కెట్‌ మన గుప్పిట్లోకి వస్తుంది’ అని నాటి గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ చేసిన వ్యాఖ్య గమనార్హం. తొలుత రైల్వేల నిర్మాణం ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించినా పెట్టుబడులు బ్రిటన్‌లోని సంపన్నవర్గాలవే. వారికి.... ఆ కాలంలో ఎక్కడా లేనంతగా ఏడాదికి 5శాతం లాభాన్ని గ్యారెంటీగా చెల్లించింది. స్థానికంగా తయారయ్యే ఇనుముకు కొర్రీలు పెట్టి తిరస్కరించి అధిక మొత్తాలకు ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసేవారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం అంతా బ్రిటన్‌ నుంచే. 1850-1910 మధ్య... భారత్‌లో వాడిన లోకోమోటివ్‌ ఇంజిన్లలో 94శాతం బ్రిటన్‌లో తయారైనవే.  అలా భారత్‌లో రైల్వే నిర్మాణం పేరుతో బ్రిటన్‌లో కంపెనీలు బాగుపడ్డాయి. వెరసి ఇక్కడ ఖర్చు తడిసి మోపెడైంది. 1850-60ల మధ్యే ఒక మైలు రైల్వేలైన్‌ నిర్మాణానికి అయ్యే సగటు వ్యయం అమెరికాలో 2వేల డాలర్లయితే... భారత్‌లో అది 18వేల డాలర్లు! నిర్మాణ బాధ్యతలు ప్రభుత్వం చేపట్టాక ఈ ఖర్చు రెట్టింపైంది. ఇదంతా భారతీయులను పీల్చి పిప్పి చేసిన సొమ్ము నుంచే చెల్లించారు. అలా ఆంగ్లేయ సంపన్న పెట్టుబడిదారులు అవినీతిని రైల్వే పట్టాలెక్కించారు. భారతీయులనే కూలీలుగా వాడుకుంటూ... సగటున ఏడాదికి వెయ్యి కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు వేశారు.

భారత్‌లో తయారు చేయకుండా చట్టం...
రైళ్ల నిర్వహణ కోసం... 1862లో బిహార్‌లోని జమాల్‌పుర్‌లో తొలి వర్క్‌షాప్‌ మొదలైంది. కానీ ఇందులో పనిచేసే నిపుణులంతా యూరోపియన్లే! భారతీయులకు సరిగ్గా పని నేర్పించేవారు కాదు. అయినా 1878నాటికి కొంతమంది భారతీయ మెకానిక్‌లు తమదైన డిజైన్లతో సొంతగా లోకోమోటివ్‌ ఇంజిన్‌ను తయారు చేశారు. ఇది బ్రిటన్‌ నుంచి దిగుమతి అయ్యేదానికంటే నాణ్యమైందేగాకుండా.... ఖర్చు కూడా తక్కువ. ఇది ఆంగ్లేయులకు ఆందోళనతో పాటు ఆగ్రహం తెప్పించింది. దీంతో.. బ్రిటన్‌ పార్లమెంటులో భారత్‌లో రైల్వే ఇంజిన్లు తయారు చేయకుండా చట్టం తీసుకొచ్చారు.

కొలువులూ వారికే...
అన్ని రంగాల్లో మాదిరిగానే... రైల్వేలోనూ జాతి వివక్షను ప్రదర్శించారు. ఆంగ్లేయులు ప్రయాణించే అగ్రశ్రేణి బోగీల్లో సకల సదుపాయాలు కల్పించి... భారతీయులకు మూడు, నాలుగో తరగతి బోగీలను... పశువుల కొట్టాల్లా వదిలేశారు. రైల్వేలో మెజార్టీ ఉద్యోగాలను కూడా... ప్రభుత్వ ప్రయోజనాల పేరుతో... భారతీయులకు కాకుండా యూరోపియన్లతో భర్తీ చేశారు. సిగ్నల్‌మెన్‌ నుంచి టికెట్‌ కలెక్టర్‌ దాకా అంతా తెల్లవారే! వీరందరికీ జీతభత్యాలను ఐరోపా స్థాయిలో చెల్లించారు. 1920 తర్వాత భారతీయులను తీసుకోక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు... ఆంగ్లో ఇండియన్లు, పార్శీలకు కొలువుల్లో ప్రాధాన్యమిచ్చారు. తర్వాత భారతీయులను తీసుకున్నారు. ఉద్యోగులను యూరోపియన్లు, యూరో ఆసియన్లు, ఆసియన్లు, భారతీయులుగా విభజించారు. జాతి, కులం ఆధారంగానే జీత భత్యాలు, పదోన్నతులుండేవి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని