జంట హత్యల దర్యాప్తు స్థానికంగానే

సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును స్థానిక పోలీసులే పూర్తిచేయనున్నారు. వీలైనంత త్వరగా అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్న

Published : 22 Feb 2021 04:16 IST

సిట్‌ ఏర్పాటు లేనట్లే
త్వరలోనే అభియోగపత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును స్థానిక పోలీసులే పూర్తిచేయనున్నారు. వీలైనంత త్వరగా అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్న అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపిన ఈ జంట హత్యల కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేయాలని న్యాయవాదులు, రాజకీయ పక్షాలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హత్యల్లో రాజకీయ నాయకుల ప్రమేయంతో పాటు పోలీసుల పాత్రపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జంట హత్యల కేసును స్థానిక పోలీసులకు కాకుండా సీబీఐకి అప్పగించాలని, లేదంటే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయాలని పలువురు డిమాండు చేశారు. ఉన్నతాధికారులు మాత్రం ఈ కేసు దర్యాప్తునకు స్థానిక పోలీసులు సరిపోతారని భావిస్తున్నారు. సాధారణంగా జంట హత్యల కేసు దర్యాప్తు సీఐ స్థాయి అధికారి చూస్తారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేసు కావడంతో ఇక్కడ డీఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించామని, ఆయనపై మరో పర్యవేక్షణాధికారి ఉంటారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.  కేసు కోణంలో చూస్తే అంతా స్పష్టంగానే ఉందని, హత్యలకు పాల్పడ్డవారు, వారికి సహకరించిన వారు దొరికిపోయారని,  వీడియో సహిత ఆధారాలు లభించాయని, చనిపోయే ముందు వామన్‌రావు వెల్లడించిన వివరాలు సైతం అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఇంకా దీని వెనుక ఎవరైనా ఉంటే తప్పక పట్టుబడతారని, కేసు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరం కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, త్వరలోనే అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా విమర్శలకు చెక్‌ పెట్టవచ్చని, వీలైతే ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానంలో విచారణ జరిపించాలని భావిస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరును హైదరాబాద్‌ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వామన్‌రావు శరీరంపై 14 గాయాలు?
పెద్దపల్లి, న్యూస్‌టుడే: న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలకమైన శవ పరీక్ష నివేదిక సోమవారం పోలీసుల చేతికి అందనుంది. ఇది విచారణను వేగవంతం చేయడానికి దోహదపడనుంది. ఘటన ఎప్పుడు జరిగింది.. ఎంతసేపటికి అంబులెన్స్‌ అక్కడికి చేరుకుంది.. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది.. దంపతులు ఘటనా స్థలంలోనే మృతి చెందారా.. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంమధ్యలో ప్రాణాలు వదిలారా.. వంటి సందేహాలకు తెరపడే అవకాశముంది. మృతదేహాలకు గురువారం ఉదయం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు వైద్యులు సుమారు మూడు గంటలకుపైగా శ్రమించారు. సాధారణంగా ఈ ప్రక్రియకు అర గంట నుంచి గంట వరకు పడుతుంది. కాని ఈ కేసులో వైద్యులు ఎక్కువ సమయం తీసుకున్నారు. అవసరమైన భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. పదునైన ఆయుధాలను వినియోగించడంతో శరీరంలోని అంతర్గత అవయవాల్లో లోతైన గాయాలైనట్లు తెలిసింది. నాగమణి శరీరంపై 6, వామన్‌రావు శరీరంపై 14 గాయాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికతో గాయాల తీవ్రత తెలియడంతో పాటు ఘటన తర్వాత ఎంత సమయానికి న్యాయవాదులు మృతి చెందారు? సకాలంలో వైద్య సాయం అందించగలిగితే బతికేవా రా? తదితర అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. 


న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలి
‘చలో గుంజపడుగు’లో లాయర్ల డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: రాష్ట్రంలో పట్టపగలే న్యాయవాద దంపతులను అతి కిరాతకంగా హత్య చేయడం దారుణమని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. వామన్‌రావు దంపతుల హత్యను నిరసిస్తూ భాజపా రాష్ట్ర లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం వివిధ జిల్లాల బార్‌ అసోసియేషన్ల సభ్యులు, న్యాయవాదులు ‘చలో గుంజపడుగు’ పేరిట బస్సు యాత్ర నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాష్ట్రంలో పాలన ఫాంహౌస్‌కే పరిమితమైందని, దీంతో గూండాలు దారుణాలకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడికి ఈ ఘటన నిదర్శనమని భాజపా లీగల్‌ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ రవీందర్‌ విశ్వనాథ్‌ ఆరోపించారు. ఈ హత్యల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్‌ ద్వారా న్యాయవాద రక్షణ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో నిందితుల తరఫున న్యాయవాదులు ఎవరూ వకాలత్‌ పుచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే నిజాలు బయటకు వస్తాయని, ఈ హత్యల వెనుక ఉన్న అధికార పార్టీ నేతలు, అధికారుల పాత్ర వెల్లడవుతుందన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కల్వచర్ల వద్ద సంఘటన స్థలాన్ని సందర్శించారు. గుంజపడుగులో వామన్‌రావు తల్లిదండ్రులను పరామర్శించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని