ప్లాస్టిక్‌ భూతం భరతం పడదాం

నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెను సవాలు విసురుతోంది. ‘ఒకసారి వాడి పారేసే’ (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం

Updated : 22 Aug 2021 05:28 IST

రాష్ట్రంలో రోజుకు 1,295 టన్నుల వ్యర్థాల ఉత్పత్తి

  రెండేళ్లలోనే 158 శాతం పెరుగుదల

  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో వెల్లడి

  కొవిడ్‌ ప్రభావమూ కారణమే  

  2022 జులై నుంచి రెండు దశలుగా నిషేధం అమలు

ఈనాడు - హైదరాబాద్‌

నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెను సవాలు విసురుతోంది. ‘ఒకసారి వాడి పారేసే’ (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన వీటిని తిరిగి ఉపయోగించే అవకాశం లేదు. మట్టిలో కలిసిపోవడానికి దశాబ్దాల సమయం పడుతోంది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గతేడాది సగటున రోజుకు 1295 టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ఇందులో నాలుగింట మూడొంతులు జీహెచ్‌ఎంసీ నుంచే వచ్చింది. 2018-19తో పోలిస్తే రాష్ట్రంలో రెండేళ్లలో 158 వ్యర్థాలు శాతం పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వార్షిక నివేదిక వెల్లడించింది. ఇది ఆందోళనకరమైన అంశమే. ఇందుకు కొవిడ్‌ కూడా కారణమని పీసీబీ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. మాస్కులు, పీపీఈ కిట్లలో ఒకసారి వాడి పారేసేవి ఎక్కువగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది.

ఒకసారి వాడి పారేసేవి..

కూరగాయలు, మాంసం తెచ్చేందుకు వినియోగించే ప్లాస్టిక్‌ సంచులు.. కొబ్బరిబోండాలు, పండ్లరసాలు తాగేందుకు వాడే స్ట్రాలు.. అల్పాహారం, భోజనం చేసే ప్లాస్టిక్‌ ప్లేట్లు, టీ తాగే గ్లాసులు.. స్పూన్లు, ఫోర్కులు.. ఇయర్‌ బడ్స్‌.. పాల ప్యాకెట్లు నీళ్ల సీసాలు.. ఇలా ఎన్నో..

ఏడాదికోసారి నివేదిక

జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 141 పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో ఉత్పత్తి అయ్యే ఘన, ప్లాస్టిక్‌ వ్యర్థాల గణాంకాల్ని ప్రతి మూడు నెలలకు ఓసారి సీపీసీబీకి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పంపిస్తోంది. ఏడాదికి ఓసారి సీపీసీబీ వార్షిక నివేదిక విడుదల చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని కూడా లెక్కిస్తే మరింత ఎక్కువ ఉంటుంది.

రాష్ట్రంలో 150కిపైగా పరిశ్రమలు

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను కేంద్ర పర్యావరణ శాఖ నిషేధించడంతో రాష్ట్రంలోని వీటిని తయారు చేసే పరిశ్రమలపై ప్రభావం పడనుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ తయారీ కంపెనీలూ ఏటా పెరుగుతున్నాయి. 2018-19లో 242 ఉండగా.. 2019-20లో 314కు, 2020-21లో 316కు పెరిగాయి. వీటిలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను తయారు చేస్తున్న పరిశ్రమలు 150కి పైగా ఉన్నాయి. కేంద్రం విధించిన నిషేధం 2022 జులై నుంచి రెండు దశలుగా అమల్లోకి రానుంది. దీని ప్రకారం 2022 డిసెంబరు 31 నుంచి 125 మైక్రాన్ల మందం ఉండే క్యారీబ్యాగ్‌లనే వాడాలి. ఈలోగా పరిశ్రమల యజమానులు యంత్రాల్లో మార్పులు చేసుకుని ఎక్కువ మందం ఉండేవి ఉత్పత్తి చేస్తే నిషేధం నుంచి మినహాయింపు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. క్యారీబ్యాగుల్లో 50 మైక్రాన్లలోపు మందం ఉండేవాటిపై ఇప్పటికే నిషేధం ఉంది.


పరిష్కారం ఏంటి?

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు తయారుచేసే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి. వాడి పారేయకుండా రీసైక్లింగ్‌ ద్వారా పునర్వినియోగిస్తే పర్యావరణానికి నష్టం ఉండదు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను ఇంటింటి నుంచి సేకరించి డంపింగ్‌ యార్డులకు చేర్చాలి. శాస్త్రీయంగా శుద్ధిచేయాలి. భూమిలో కలిసిపోయేలా చేయాలి. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటివి మరికొన్ని ఏర్పాటుచేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని