తెలుగు రాష్ట్రాల్లో ఏవై.12 కలకలం

కొవిడ్‌లో మరిన్ని ఉత్పరివర్తనాలు వైద్య రంగానికి సవాలు విసురుతున్నాయి. డెల్టా, డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనాలే ప్రమాదకరం అనుకుంటే.. డెల్టా ప్లస్‌లో ఏవై.12 అనే మరో ఉపరకం మరింత సమస్యాత్మకంగా

Updated : 05 Sep 2021 09:28 IST

 డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనంలో ఇదో ఉపరకం

 మరింత సమస్యాత్మకం అంటున్న నిపుణులు

 ఏపీ, తెలంగాణల్లోనూ కేసులు

ఈనాడు, అమరావతి: కొవిడ్‌లో మరిన్ని ఉత్పరివర్తనాలు వైద్య రంగానికి సవాలు విసురుతున్నాయి. డెల్టా, డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనాలే ప్రమాదకరం అనుకుంటే.. డెల్టా ప్లస్‌లో ఏవై.12 అనే మరో ఉపరకం మరింత సమస్యాత్మకంగా మారింది. ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏవై.12 రకం తొలి కేసు ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 30న వెలుగు చూసింది. వారం రోజుల్లోపే తెలుగు రాష్ట్రాలకూ వ్యాపించింది. ఏవై.12 కేసులు దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 178 నమోదైతే ఏపీలో 18, తెలంగాణలో 15 చొప్పున వచ్చాయి. ఈ కేసుల నమోదులో ఉత్తరాఖండ్‌తో కలిసి ఏపీ మూడో స్థానంలో ఉంది. ఈ వివరాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ తెలియచేస్తూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. 

వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను ర్యాండమ్‌ పద్ధతిలో పరీక్షించినప్పుడు ఏవై.12 కేసులు బయటపడ్డాయి. సాధారణంగా ప్రతి ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ, ఇతర చోట్లకు పంపుతున్నారు. వీటిని పరీక్షించి వైరస్‌ ఉత్పరివర్తనాన్ని గుర్తిస్తున్నారు. కొత్త ఉత్పరివర్తనాలు వచ్చినప్పుడల్లా తమవద్ద ఉన్న నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు. డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనంతో వ్యాప్తి వేగం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల కణాల్లో అది బలంగా అతుక్కుపోతుందని, మోనోక్లోనల్‌ యాంటీబాడీ స్పందనను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జన్యు క్రమ పరీక్షల్లో డెల్టా ప్లస్‌ కేసులు వెలుగులోకి వస్తుండటంతో జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి రాకపోకలు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. విద్య, విహారం, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర దేశాల నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారు క్రమంగా పెరుగుతున్నారు.  దీంతో వ్యాధి సంక్రమణకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ కేసులు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. మరోవంక... మ్యుటేషన్లతో డెల్టా ప్లస్‌లోనూ మరికొన్ని ఉపరకాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఏవై.1, ఏవై.2, ఏవై.3.. పేర్లతో పిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా పంపిన సమాచారంలో ఏవై.12 కేసులు 178 వచ్చినట్లు తెలిపింది. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా (వీఓసీ)’ ప్రకటించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయట పడినందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా లేఖ రాశారు. డెల్టా ఉత్పరివర్తనానికి సాంక్రమికత ఎక్కువని, మనుషుల శరీరంలోని కణజాలానికి (హోస్ట్‌సెల్‌) బలంగా అతుక్కునే లక్షణం దీనికి ఉంటుందని పరిశోధనా సంస్థ ఇన్సాకాగ్‌ పేర్కొన్నట్లు తెలిపారు. ఏవై.12 ఉపరకం తీవ్రత గురించి తెలిసేందుకు ఇంకొంత సమయం పడుతుందని ప్రభుత్వ సీనియర్‌ వైద్యుడు సుధాకర్‌ తెలిపారు.


రాష్ట్రాలవారీగా డెల్టా ప్లస్‌, ఏవై.12 కేసుల నమోదు ఇలా...
డెల్టా ప్లస్‌

తెలంగాణ-52, మహారాష్ట్ర-47, గోవా-45, జమ్ముకశ్మీర్‌-41, ఉత్తరాఖండ్‌-27, ఏపీ-24, పంజాబ్‌-20, బిహార్‌-19, హిమాచల్‌ప్రదేశ్‌-19, చండీగఢ్‌-18, మధ్యప్రదేశ్‌-18, దిల్లీ-10, రాజస్థాన్‌-9, మణిపుర్‌-8, అస్సాం-5, తమిళనాడు-4, కర్ణాటక-4, మేఘాలయ-3, ఉత్తర్‌ప్రదేశ్‌-2, పశ్చిమబెంగాల్‌-2, గుజరాత్‌-2, హరియాణా-2, నాగాలాండ్‌-1, ఒడిశా-1.

ఏవై.12

గోవా-34, మహారాష్ట్ర-20, ఆంధ్రప్రదేశ్‌-18, ఉత్తరాఖండ్‌-18, జమ్ముకశ్మీర్‌-16, తెలంగాణ-15, చండీగఢ్‌-10, పంజాబ్‌-8, రాజస్థాన్‌-8, హిమాచల్‌ప్రదేశ్‌-8, బిహార్‌-6, దిల్లీ-6, మధ్యప్రదేశ్‌-5, మణిపుర్‌-3, మేఘాలయ-3.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని