Pandora Papers: ‘పాండోరా’ దండోరా

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ మరోసారి రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఐదేళ్ల కిందట ‘పనామా పేపర్ల’ పేరుతో పేలిన బాంబు కన్నా శక్తిమంతంగా ‘పాండోరా పేపర్ల’

Updated : 23 Feb 2024 17:28 IST

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు

జాబితాలో 380 మంది భారతీయులు

వెల్లడించిన ఐసీఐజే

‘పనామా’ను మించిన బాగోతం

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ మరోసారి రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఐదేళ్ల కిందట ‘పనామా పేపర్ల’ పేరుతో పేలిన బాంబు కన్నా శక్తిమంతంగా ‘పాండోరా పేపర్ల’ పేరుతో ఆదివారం రాత్రి ఎంతోమంది ప్రముఖుల బాగోతాలను వెలుగులోకి తెచ్చాయి. తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలు వీటిలో ఉన్నాయి. జాబితాలో 91 దేశాలకు చెందిన వందలమంది ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలు, దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నవారూ కలిపి దాదాపు 380 మంది భారతీయులు..! ‘అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి’ (ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌- ఐసీఐజే) ఈ వివరాలను విడుదల చేసింది. 117 దేశాల్లోని 150కిపైగా వార్తాసంస్థల్లోని 600 మంది విలేకరులు ఈ క్రతువులో భాగస్వాములయ్యారు. ఇది అతిపెద్ద పరిశోధనాత్మక విశ్లేషణగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కూటమి వేర్వేరు దేశాల్లోని దాదాపు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి, గుట్టుమట్లు రట్టు చేసింది. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

గోప్యంగా లావాదేవీలు

భారత్‌, అమెరికా, రష్యా సహా 45 దేశాలకు చెందిన 130 మంది బిలియనీర్లు ఈ జాబితాలో ఉన్నారు. 336 మంది ఉన్నతస్థాయి రాజకీయవేత్తలు, అధికారులకు విదేశాల్లో 956 కంపెనీల పేరిట పెట్టుబడులు ఉన్నట్లు తేలింది. మారుపేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల సాయంతో వీరంతా ఆస్తులను రహస్యంగా కొనుగోలు చేశారు. పనామా, దుబాయ్‌, మొనాకో, స్విట్జర్లాండ్‌, కేమన్‌ ఐలాండ్స్‌ వంటి చోట్ల గోప్యంగా ఆర్థిక లావాదేవీలను సాగించారు.

* బ్రిటన్‌లోని ఒక కోర్టులో దివాలా ప్రకటించిన భారత పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి 18 ‘అసెట్‌ హోల్డింగ్‌ ఆఫ్‌షోర్‌ కంపెనీ’లు ఉన్నాయి.

* పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోదీ భారత్‌ వీడటానికి నెల ముందు ఆయన సోదరి ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.

* బయోకాన్‌ ప్రమోటర్‌ కిరణ్‌ మజుందార్‌ షా భర్త.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అభియోగాలపై సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి ట్రస్టును నెలకొల్పారు.

* 2016లో పనామా పత్రాలు బహిర్గతమయ్యాక ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు జాగ్రత్త పడినట్లు తాజా పత్రాలు చెబుతున్నాయి. అనేక మంది భారతీయులు, ఎన్నారైలూ విదేశాల్లోని తమ సంపదను పునర్‌వ్యవస్థీకరించారు. 2021 ప్రారంభం నాటికి రూ.20వేల కోట్లకుపైగా అప్రకటిత విదేశీ, స్వదేశీ సంపదను పన్ను అధికారులు గుర్తించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌.. పనామా పత్రాలు లీకైన మూడు నెలల తర్వాత బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లోని తన సంస్థను రద్దు చేసుకున్నారు. తెందుల్కర్‌ తరఫు న్యాయవాది దీనిపై స్పందిస్తూ ఆయన పెట్టుబడులన్నీ చట్టబద్ధమైనవేనని, పన్ను సంస్థలకు అన్ని వివరాలూ సమర్పించారని స్పష్టం చేశారు.

గతంలో బయటికొచ్చిన పనామా పేపర్లలో.. పన్ను ఎగవేతే లక్ష్యంగా వ్యక్తులు విదేశాల్లో ఏర్పాటుచేసిన కంపెనీల గురించి ఉంది. కార్పొరేట్‌ సంస్థలు సృష్టించిన దొంగ కంపెనీల బాగోతం పారడైజ్‌ పేపర్లలో బయటపడింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అలాంటి డొల్ల కంపెనీల ఏర్పాటును అడ్డుకునేలా కొన్ని దేశాలు నిబంధనలను కఠినతరం చేశాయి. ట్రస్టుల రూపాల్లో ఎలా పన్ను ఎగవేత జరుగుతోందన్నది పాండోరా పేపర్లతో వెలుగులోకి వచ్చింది.


అంతర్జాతీయ ప్రముఖుల తీరిది..

కరీబియన్‌ దీవుల నుంచి దక్షిణ చైనా సముద్రంలోని పర్షియన్‌ గల్ఫ్‌ వరకు అనేక దేశాలకు చెందినవారి పేర్లు తాజా పరిశోధనలో బయటపడ్డాయి.

* జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2 అమెరికా, బ్రిటన్‌లలో రహస్యంగా సుమారు రూ.741 కోట్ల  విలువైన ఆస్తులు కూడబెట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మాలిబులో సముద్రం ఒడ్డున నిర్మించిన విలాసవంతమైన భవనాలు ఆయనకు ఉన్నాయి.

* బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌, ఆయన సతీమణి.. లండన్‌లో కార్యాలయం కొనుగోలు సమయంలో దొడ్డిదారిన రూ.3.14 కోట్ల (3,12,000 పౌండ్లు) స్టాంపు డ్యూటీ ప్రయోజనం పొందినట్లు ఈ పత్రాలను బట్టి తెలుస్తోంది. 

* పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ కేబినెట్‌లోని మంత్రులు, వారి కుటుంబాలు, ప్రధానికి సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు రహస్యంగా కంపెనీలు, ట్రస్టులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ జాబితాలో ఆర్థికమంత్రి సౌకత్‌ తారిన్‌, ఆయన కుటుంబం, ఇమ్రాన్‌ మాజీ సలహాదారుడు వకార్‌ మసూద్‌ ఖాన్‌ (రెవెన్యూ, ఆర్థికం) కుమారుడు సహా 700 మంది పాకిస్థానీలు ఉన్నారు.

* మొనాకోలోని కొన్ని ఆస్తులతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉన్న సంబంధాలను ఈ పత్రాలు వెల్లడించాయి. అయితే అధ్యక్షుడి పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించలేదు. ఆయన చిన్ననాటి స్నేహితులు, అనధికార మంత్రిగా వ్యవహరించిన ఓ నేత, మాజీ ప్రేయసి వంటి అత్యంత సన్నిహితుల పేర్లను మాత్రం పేర్కొన్నాయి.

* వీరితో పాటు ఉక్రెయిన్‌, కెన్యా, ఈక్వెడార్‌ దేశాల అధ్యక్షులు; చెక్‌ రిపబ్లిక్‌ ప్రధాని ఆండ్రెజ్‌ బేబిస్‌, లెబనాన్‌ ప్రధాని నజీబ్‌ మికటి, ఆ దేశ మాజీ ప్రధాని హసన్‌ డయబ్‌, మాజీ మంత్రి మర్వన్‌ ఖేర్డిన్‌, పాప్‌ గాయని దివా షకీరా, మోడల్‌ క్లాడియా షిఫెర్‌ తదితరుల పేర్లు జాబితాలో కనిపించాయి.

* అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ, అమెరికాలోని అతిపెద్ద న్యాయసేవల సంస్థ మెకెంజీ వంటి సంస్థల లావాదేవీల గురించి దీనిలో ప్రముఖంగా ప్రస్తావించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని