పత్తి రైతుకు దుఃఖం

రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి నిరాశాజనకంగా ఉంది. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నా.. వర్షాలు, తెగుళ్లు రైతులను దెబ్బతీశాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేలకు పైగా ఉంది. కానీ దిగుబడి లేక రైతులు దిగాలుగా

Published : 03 Dec 2021 04:33 IST

ధర బావున్నా.. పడిపోయిన దిగుబడి
తెగుళ్లు, వర్షాలే కారణం


ఖమ్మం మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పత్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి నిరాశాజనకంగా ఉంది. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నా.. వర్షాలు, తెగుళ్లు రైతులను దెబ్బతీశాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేలకు పైగా ఉంది. కానీ దిగుబడి లేక రైతులు దిగాలుగా ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 46.50 లక్షల ఎకరాల్లో పంట సాగైతే దిగుబడి 31 లక్షల టన్నులొస్తుందని అర్ధ, గణాంక, మార్కెటింగ్‌ శాఖ తొలుత అంచనా వేసింది. ఇప్పటివరకూ అందులో 10 శాతం అంటే 3.10 లక్షల టన్నులు మాత్రమే మార్కెట్లకు వచ్చింది. గతేడాది ఈ సమయానికి 5.69 లక్షల టన్నుల పత్తి పంట మార్కెట్లకు వస్తే ఈ ఏడాది అందులో 55 శాతంలోపే మార్కెట్లకు రావడం గమనార్హం.


దెబ్బతీసిన వాతావరణం

రాష్ట్రంలో పత్తి పంటకు ప్రస్తుత వాతావరణం శాపంగా మారింది. జూన్‌ 5న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా.. పలు ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున పత్తి విత్తనాలు నాటారు. అదే నెలలో వర్షాలు మొదలై ఆగస్టు రెండోవారం వరకు ఏకధాటిగా కురిశాయి. అధిక తేమ కారణంగా పత్తి మొక్కలు చనిపోయాయి. మళ్లీ రైతులు విత్తనాలు నాటారు. తొలకరి ముందుగా రావడంతో పత్తి సాగు విస్తీర్ణం 75 లక్షల ఎకరాలకు చేరుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసినా.. అధిక వర్షాలతో 46.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. తెలంగాణలో దిగుబడి 30 లక్షల బేళ్లకు మించి రాకపోవచ్చని.. గతేడాది 44 లక్షల బేళ్లు వచ్చిందని రాష్ట్ర జిన్నింగ్‌ మిల్లుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.రమేశ్‌ ‘ఈనాడు’కు చెప్పారు. వర్షాలు రైతులను బాగా దెబ్బతీశాయని మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర సంచాలకురాలు లక్ష్మీబాయి చెప్పారు. రాష్ట్రంలో పెద్దదైన ఖమ్మం మార్కెట్‌కు గతేడాది ఈ సమయానికి 2,02,358 క్వింటాళ్ల పత్తిని రైతులు తీసుకురాగా.., ఈసారి ఇప్పటికి 1,35,770 క్వింటాళ్లే వచ్చిందని ఖమ్మం మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి మల్లేశం తెలిపారు.


సాగు ఖర్చులు కూడా రాలేదు

యన పేరు సీతారాం. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం మల్కాపూర్‌ గ్రామం. పదెకరాల్లో పత్తి సాగుచేశారు. వర్షాలు, తెగుళ్ల కారణంగా ఎకరానికి 2 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. రూ.15 వేల నుంచి 20 వేలు మాత్రమే ఆదాయం వచ్చింది. ప్రైవేటు అప్పులు తెచ్చి పంట సాగుకు పెట్టుబడులు పెడితే చివరికి పంట ఖర్చులు కూడా తిరిగి రాలేదు.


పంటను దున్నేస్తున్నారు

త్తి పంటను దున్నేస్తున్న రైతు పేరు ఎం.డి.ఖాజా. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామం. ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. అధిక వర్షాలతో 10 క్వింటాళ్లకు.. 2 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. ప్రస్తుతం గులాబీ పురుగు ఉద్ధృతంగా ఉండడంతో పంటపై ఆశలు వదులుకొని పంట తొలగించారు. ఎకరాకు రూ.26 వేలు పెట్టుబడి కాగా.. పత్తిని మార్కెట్లో   విక్రయిస్తే రూ.14 వేలు మాత్రమే వచ్చింది.


దేశంలో పరిస్థితి ఇదీ...

ఏడాది దేశంలో 3.60 కోట్ల బేళ్ల పత్తి దిగుబడి వస్తుందని భారత పత్తి వ్యాపారుల సంఘం అంచనా. గతేడాది వచ్చిన 3.53 కోట్ల బేళ్లకన్నా ఈసారి మరో 7 లక్షల బేళ్లు అదనం. (170 కిలోల దూదిని బేలు అంటారు). గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలలో పత్తి పంట బాగుందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 16 లక్షల బేళ్లు రాగా.. ఈ ఏడాది 14 లక్షల బేళ్లు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని