ఏపీలో ఉద్యోగుల పోరుబాట

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు పోరుబాట పట్టారు. పీఆర్‌సీ సహా మొత్తం 71 ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిరసనకు

Published : 08 Dec 2021 04:45 IST

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు కలెక్టరేట్లు, కార్యాలయాల ఎదుట నిరసన

ఉద్యమానికి విశాఖలో సంఘీభావం ప్రకటిస్తున్న ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, సహాయ ఛైర్మన్‌ ఫణి పేర్రాజు తదితరులు

ఈనాడు- అమరావతి, యంత్రాంగం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు పోరుబాట పట్టారు. పీఆర్‌సీ సహా మొత్తం 71 ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిరసనకు దిగారు. తొలిదశ ఉద్యమంలో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పలు సంఘాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మండల, తాలూకా, డివిజన్‌, జిల్లా స్థాయి కార్యాలయాలు మొదలు రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల వరకూ అన్నిచోట్లా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు. కార్యాలయాల వెలుపల ఉద్యోగుల ఐక్యవేదిక జెండాలు, బ్యానర్లు ప్రదర్శించి నినాదాలు చేశారు. వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలని, సీపీఎస్‌ రద్దుచేయాలని, పెండింగ్‌లో ఉన్న ఏడు డీఏలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండు చేశారు. విధులకు హాజరయ్యే ముందు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కాసేపు నిలుచున్నారు.

విశాఖ, కాకినాడల్లో బండి... కర్నూలులో బొప్పరాజు
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో ఉద్యమస్ఫూర్తి నింపేందుకు విశాఖపట్నం, కాకినాడల్లో జరిగిన కార్యక్రమాల్లో ఏపీ ఐకాస ఛైర్మన్‌, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, నాయకులు ఫణి పేర్రాజు, ఈశ్వరరావు, కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన కార్యక్రమంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నాయకులు హృదయరాజు, శివారెడ్డి, బీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులకు నల్లబ్యాడ్జీలు అందించి నిరసన కార్యక్రమాల్ని ప్రారంభించారు. 210 సంఘాలకు చెందిన దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారని వారు వెల్లడించారు. మండల, తాలూకా, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నెల 10వ తేదీ వరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా నల్లబ్యాడ్జీలతో విధులకు వెళ్లనున్నారు.

వారంలో పీఆర్‌సీ ప్రకటిస్తారని వెల్లడి
సీఎం జగన్‌ వారం రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దీని అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ప్రస్తుతం ఆ ప్రక్రియ నడుస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని