92 శాతం కేసులు ఒమిక్రాన్‌వే

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం ఈ వేరియంట్‌వేనని తేటతెల్లమైంది. ఈ నెల 3, 4 తేదీల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 90

Published : 18 Jan 2022 04:31 IST

జీహెచ్‌ఎంసీ నమూనాల్లో వెల్లడి
రాష్ట్రంలో కొత్తగా 2,447 కొవిడ్‌ కేసులు
ఎర్రగడ్డ ఆసుపత్రిలో 57 మంది మానసిక రోగులకు పాజిటివ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం ఈ వేరియంట్‌వేనని తేటతెల్లమైంది. ఈ నెల 3, 4 తేదీల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 90 నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా.. వాటిలో 7(7.7%) మాత్రమే డెల్టా వేరియంట్‌ కేసులు కాగా 83(92.3%) పాజిటివ్‌లు ఒమిక్రాన్‌కు సంబంధించినవని నిర్ధారణ అయింది. ఒమిక్రాన్‌లోనూ ‘బిఎ1’కు చెందినవి 15, ‘బిఎ2’కు చెందినవి 64, ‘బి.1.1.529’కు చెందినవి 4గా వెల్లడైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ‘బిఎ2’ రకం ఒమ్రికాన్‌ వేరియంట్‌ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్లు అర్థమవుతోందని వైద్యవర్గాలు తెలిపాయి.

కొవిడ్‌ కోరల్లో వైద్య సిబ్బంది

ఒమిక్రాన్‌ దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌ బారినపడుతున్నారు. ఇప్పటి వరకూ గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్‌సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడగా ఉస్మానియాలో 71 మంది పీజీ వైద్యవిద్యార్థులతో పాటు 90 మంది సిబ్బంది, నిమ్స్‌లోనూ 70 మందికి పైగా వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 9 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వైద్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియాలో పాజిటివ్‌ వచ్చిన వైద్య సిబ్బందికి గతంలో 15 రోజుల సెలవులు ఇవ్వగా.. ప్రస్తుతం వారానికి కుదిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.బి.నాగేందర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

22 వేలు దాటిన క్రియాశీల కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2,447 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 7,11,656కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 3 మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ 4,060 మంది కన్నుమూశారు.వైరస్‌ బారిన పడి చికిత్స పొందిన అనంతరం తాజాగా 2,295 మంది కోలుకోగా మొత్తంగా 6,85,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 80,138 నమూనాలను పరీక్షించగా మొత్తం పరీక్షల సంఖ్య 3,07,09,658కి పెరిగింది. మరో 10,732 నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,112 పాజిటివ్‌లుండగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డిలో 183, హనుమకొండలో 80, సంగారెడ్డిలో 73, మంచిర్యాలలో 68, ఖమ్మంలో 63, నిజామాబాద్‌లో 55 ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ సంఖ్యలో పాజిటివ్‌లు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 2,68,897 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు. ఇందులో 69,900 మంది తొలి డోసును, 1,80,065 మంది రెండో డోసును, 18,932 మంది ముందస్తు నివారణ డోసును స్వీకరించారు.


ఆసుపత్రిలో చేరిన భట్టి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కరోనా బారినపడి స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు, పార్టీ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందవద్దని పార్టీ శాసనసభాపక్షం కోరింది. మరో వైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.


సింగరేణిలో 913 మందికి కొవిడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి వ్యాప్తంగా సోమవారం నాటికి 913 మంది కరోనా పాజిటివ్‌ రోగులున్నారని, వీరిలో 382 మంది ఉద్యోగులని సంస్థ సంచాలకులు బలరాం, చంద్రశేఖర్‌ సోమవారం వెల్లడించారు. మిగిలిన వారిలో 415 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులు, మరో 116 మంది పొరుగు సేవల సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబీకులకు టీకాలు పూర్తయినందున బాధితుల్లో వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉందని వెల్లడించారు.

భద్రాద్రి జిల్లాలో 23 మంది పోలీసులకు..

భద్రాచలం రామాలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం సబ్‌ డివిజన్‌కు చెందిన 150 మంది పోలీసులు బందోబస్తు విధులకు హాజరయ్యారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఒక శిక్షణ ఎస్సై సహా మొత్తం 23 మంది కరోనా బారిన పడ్డారు.


ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కరోనా కలకలం

అమీర్‌పేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయాన్ని కరోనా కమ్మేస్తోంది. ఆసుపత్రిలోని మేల్‌ క్లోజ్డ్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న 57 మంది రోగులకు కరోనా నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు మరో 9 మంది పీజీ వైద్య విద్యార్థులు కూడా కరోనా బారిన పడ్డారు. అప్రమత్తమైన ఆసుపత్రి వైద్యాధికారులు మొత్తం రోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నారు. స్వల్పంగా లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో మొత్తం 297 మంది రోగులు ఇన్‌ పేషెంట్లుగా ఉన్నారు. 170 మంది వరకు అన్ని స్థాయిల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. మంగళవారం ఫిమేల్‌ క్లోజ్డ్‌ వార్డుల్లో రోగులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ఉమాశంకర్‌ మాట్లాడుతూ.. పాజిటివ్‌గా తేలినవారిలో 10 మందికే స్వల్ప లక్షణాలున్నాయని, మిగిలిన వారికి ఎలాంటి లక్షణాలూ లేవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని