కన్నీరే పరిహారం

వర్షాలు, వడగళ్లు, అనావృష్టి వంటి విపత్తులొచ్చి పంటలు దెబ్బతింటే రైతులకు ఏ విధంగానూ సాయం అందడం లేదు. వరసగా మూడో ఏడాది అకాల వర్షాలు, వడగళ్లతో రైతులు పెద్దయెత్తున నష్టపోయారు. రాష్ట్ర ఖజానా నుంచి నిధులిస్తేనే ఇప్పుడు వారికి సాయం అందే పరిస్థితులున్నాయి.

Published : 20 Jan 2022 05:28 IST

వరసగా మూడో ఏడాదీ పంటలకు చేటు
రైతులకు దక్కని పెట్టుబడి రాయితీ
విపత్తుల వేళ స్పందించని ప్రభుత్వ యంత్రాంగం
నష్టాల వివరాలు కేంద్రానికి పంపడంలోనూ తాత్సారం

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలు, వడగళ్లు, అనావృష్టి వంటి విపత్తులొచ్చి పంటలు దెబ్బతింటే రైతులకు ఏ విధంగానూ సాయం అందడం లేదు. వరసగా మూడో ఏడాది అకాల వర్షాలు, వడగళ్లతో రైతులు పెద్దయెత్తున నష్టపోయారు. రాష్ట్ర ఖజానా నుంచి నిధులిస్తేనే ఇప్పుడు వారికి సాయం అందే పరిస్థితులున్నాయి. గత ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ అధిక వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. అప్పుడు రైతువారీగా నష్టం వివరాలను కేంద్రానికి వ్యవసాయశాఖ పంపలేదు. ఈ నెలలో వడగళ్ల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఇప్పుడూ ఇంతవరకూ కేంద్రానికి నష్టాల వివరాలేమీ ఇవ్వలేదు. ఇలా పంపితే కనీసం కేంద్ర బృందాలు వచ్చి నష్టాలను అంచనా వేసి, రైతులకు సాయం అందజేయాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసే వీలుంటుంది. వాటి ఆధారంగా కేంద్రం పెట్టుబడి రాయితీ కింద సాయం అందించే అవకాశం ఉంటుంది.ఆ దిశగా చొరవ లేదు. ఫలితంగా గత మూడేళ్లుగా ఏటా వానాకాలం, యాసంగిలో వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతింటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి  రైతులకేమీ సాయం అందలేదు.

హైకోర్టు ఆదేశాలు ఇచ్చి మూణ్నెల్లు...

2020 వానాకాలంలో అధిక వర్షాల వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కానీ రైతులకు సాయం ఏమీ అందలేదు. దీనిపై రైతు స్వరాజ్య వేదిక సంస్థ హైకోర్టులో కేసు వేయడంతో విచారణ జరిపి 4 నెలల్లోగా రైతులకు సాయం అందించాలని 2021 సెప్టెంబరులో హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు విపత్తు నిర్వహణ చట్టం కింద సాయం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కూడా హైకోర్టు పేర్కొంది. హైకోర్టు చెప్పి 3 నెలలు దాటినా ఇంకా ప్రభుత్వం స్పందించలేదని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి విస్సా కిరణ్‌కుమార్‌ తెలిపారు. అంతకుముందు 2019 వానాకాలంలో కూడా అధిక వర్షాల వల్ల 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ఎలాంటి సాయం చేయలేదు.

వందల శాతం అదనంగా వర్షం కురిసినా...

వాతావరణశాఖ లెక్కల ప్రకారం సాధారణంకన్నా 50 శాతానికి మించి వర్షం కురిస్తే అక్కడ వరదలు, నష్టాలున్నట్లు గుర్తిస్తారు. ఉదాహరణకు ఈ నెల 1 నుంచి 19 వరకూ మహబూబాబాద్‌ జిల్లాలో సాధారణ వర్షపాతం కేవలం 4 మిల్లీమీటర్లు(మి.మీ.) అయితే ఏకంగా 92.3 మి.మీ.లు కురిసింది. అంటే 2,307 శాతం అధికంగా వర్షం కురిసిందని వాతావరణశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. నాగర్‌కర్నూల్‌లో 1,829, జయశంకర్‌ భూపాలపల్లిలో 1,024, వరంగల్‌లో 822, హన్మకొండలో 818 శాతం అదనపు వర్షం కురిసింది. ఇలా వందలశాతం అదనంగా కురిసినా ఎందరు రైతులు, ఏమేం పంటలు నష్టపోయారనే వివరాలను వ్యవసాయశాఖ ఇంతవరకూ ఎక్కడా వెల్లడించలేదు.

నష్టాలు అపారం...

రాష్ట్రంలో విపత్తుల వల్ల పంట నష్టాలు అపారంగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది రాష్ట్రంలో 47 లక్షల ఎకరాల్లో పత్తి సాగయినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి గతంలో తెలిపింది. గత అక్టోబరు నుంచి కొత్త పత్తి కేవలం 68 లక్షల క్వింటాళ్లే వచ్చింది. అంటే సగటున ఎకరానికి కనీసం క్వింటాన్నర పత్తి పంట కూడా పండలేదని మార్కెట్ల అమ్మకాలు చెబుతున్నాయి. ఇప్పుడు పత్తికి చాలా ఎక్కువగా ధర పలుకుతోంది. రైతుల వద్ద పంట ఉంటే ఈసరికే మార్కెట్లకు తెచ్చేవారని, వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో పెద్దగా రాలేదని సీనియర్‌ మార్కెటింగ్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు. ఎకరా పత్తి సాగుకు కౌలుతో కలిపి రూ.35 వేల నుంచి 50 వేల దాకా పెట్టుబడి పెట్టారు. క్వింటా పత్తి రూ.7 వేలకు అమ్మినా ఎకరానికి కనీసం రూ.14 వేలకు మించి రాని రైతులు అనేకమంది ఉన్నారు. ఇలాగే మినుము, పెసర, మొక్కజొన్న, సోయాచిక్కుడు, వరి పంటలు వానాకాలంలో దెబ్బతిన్నాయి. మొక్కజొన్న మినహా మిగిలిన పంటలను మద్దతుధరకు కొనేందుకు కేంద్రం రాష్ట్రానికి అనుమతిచ్చింది. అయినా దిగుబడులు లేక మార్కెట్లకు సరిగా పంట రానందునే కొనలేకపోయినట్లు రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య కేంద్రానికి తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని