
ఏపీలో కదం తొక్కిన ఉపాధ్యాయులు
నిర్బంధాలను ఛేదించి కలెక్టరేట్ల ముట్టడి
పీఆర్సీ ఉత్తర్వులకు నిరసన
ఏలూరులోని కలెక్టరేట్ ముట్టడికి తరలి వచ్చిన ఉపాధ్యాయులు
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ... ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దఎత్తున రోడ్డెక్కారు. పోలీసులు నోటీసులిచ్చినా, ప్రయాణ సమయంలో ఎక్కడికక్కడ దిగ్బంధించినా, ముళ్ల కంచెలు, బారికేడ్లతో నిలువరించినా... లెక్క చేయకుండా వేలాదిగా కదం తొక్కుతూ గురువారం ఉదయానికే కలెక్టరేట్లకు తరలివచ్చారు. జిల్లాల పాలనా కార్యాలయాలను స్తంభింపజేశారు. మాటతప్పిన, మడమ తిప్పిన సీఎం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రివర్స్ పీఆర్సీని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించారు. నిరసనల్లో మహిళా ఉపాధ్యాయులు ముందు భాగాన నిలిచి పాటలతో గళమెత్తారు. ఫ్యాప్టో (ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ఉపాధ్యాయులు ముట్టడించారు. బుధవారం రాత్రి నుంచే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ సంఘ నేతల ఇళ్లకు వెళ్లి ఆందోళనల్లో పాల్గొనవద్దని నోటీసులిచ్చారు. రైళ్లు, బస్సుల్లో వస్తున్న వారిని తనిఖీ చేసి మధ్యలోనే దించేశారు. అయినా నిర్బంధాలను ఛేదించుకుంటూ భారీ ఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు లాగి వాహనాల్లో పడేయడంతో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కడపలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని పోలీసులు లాక్కెళ్లడంతో స్పృహతప్పి పడిపోయారు. చొక్కా చిరిగిపోయింది.
గుంటూరు కలెక్టరేట్ దిగ్బంధం
భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు గుంటూరు కలెక్టరేట్ను ముట్టడించి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దిగ్బంధించారు. పోలీసులు ముందే అడ్డుకుంటారనే ఆలోచనతో... ప్రణాళిక ప్రకారం రెవెన్యూ కల్యాణ మండపం, ఎన్జీవో కల్యాణ మండపం, జడ్పీ ప్రాంగణానికి విడివిడిగా చేరుకునేలా వ్యూహం రచించారు. మూకుమ్మడిగా తరలివచ్చి కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
* ఉపాధ్యాయుల ఆందోళనతో కర్నూలు కలెక్టరేట్ ప్రాంతం కిక్కిరిసింది. ఉదయం 9 గంటలకే జిల్లా కేంద్రానికి చేరుకున్న ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కొందరు ప్రధాన ద్వారం ఎక్కి లోపలకు దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
విశాఖపట్నంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులను, ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు
అన్ని దారులు మూసేసినా...
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్కు వచ్చే రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసేసినా, ఉపాధ్యాయులు లక్ష్మీటాకీస్ సెంటరు వరకు దూసుకువచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. వాగ్వాదం, తోపులాటలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
* కడపలో వేలాది మంది ఉపాధ్యాయుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుని వెళ్లే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.
* ప్రకాశం జిల్లా ఒంగోలు చర్చిసెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
* చిత్తూరులో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లను తొలగించి కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు.
* అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.
* విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎద]ుట పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య పెనుగులాట జరిగి, కొందరు కిందపడ్డారు.
ఉపాధ్యాయ సంద్రంగా ఏలూరు
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు సమీపంలోని జడ్పీ కార్యాలయం రహదారి వరకు అన్ని ప్రాంతాలు ఉదయం 9గంటలకే కిక్కిరిశాయి. ప్రధానవీధుల్లో ఎటు చూసినా ఉపాధ్యాయ సమూహాలే కన్పించాయి. పోలీసులు ఎక్కడికక్కడ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.
కిటకిటలాడిన కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ వేలాది మంది ఉపాధ్యాయులతో కిటకిటలాడింది. ఓ ఉపాధ్యాయుడ[ు తల కిందికి కాళ్లు పైకి పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గీతాలు ఆలపిస్తూ.. నినాదాలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.