తొలి రోజంతటి ఉత్సాహంతోనే పనిచేయండి

ఐఏఎస్‌ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే ఉత్సాహంతో ప్రతిరోజూ పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ప్రజలతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవాలని,

Updated : 23 Jan 2022 05:20 IST

 జిల్లా కలెక్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అభినందన

ఈనాడు, దిల్లీ: ఐఏఎస్‌ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే ఉత్సాహంతో ప్రతిరోజూ పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ప్రజలతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవాలని, అప్పుడే పరిపాలన ఫలాలు కిందిస్థాయికి చేరుతాయని  అధికారులకు సలహా ఇచ్చారు. 2018లో 112 వెనుకబడిన జిల్లాలతో ఆకాంక్షిత జిల్లాల పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. అభివృద్ధి జిల్లాలతో పోటీపడేలా వీటిని తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. శనివారం ఈ పథక పురోగతిని ప్రధాని సమీక్షించారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెప్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులనుద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రతి ఆకాంక్షిత జిల్లాలో ఏదో విజయగాధ ఉంది. అందుకు అస్సాంలోని దరాంఖ, బిహార్‌లోని షేక్‌పుర, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఒక ఉదాహరణ. ఈ జిల్లాల్లో చూస్తుండగానే పిల్లల్లో పౌష్టికాహారలోపాన్ని తగ్గించారు. ఈమార్పు అధికారుల జీవితకాల శ్రమఫలితమే. ఆకాంక్షిత జిల్లాల్లో జరిగిన పని ప్రపంచంలోని పెద్ద పెద్ద యూనివర్శిటీలకు అధ్యయన అంశం. ప్రతి ఆకాంక్షిత జిల్లాలో జన్‌ధన్‌ ఖాతాలు 4-5 రెట్లు పెరిగాయి. అందరికీ శౌచాలయం, అన్ని ఇళ్లకూ విద్యుత్తు సౌకర్యం లభించింది. దానివల్ల ప్రజలకు భరోసా పెరిగింది. ప్రజలు, పరిపాలనా యంత్రాంగం ఒక్కతాటిపైకి వస్తే జిల్లా అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరు. మన జిల్లాల్లో ప్రతి గ్రామం వరకు రోడ్డు, ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్‌భారత్‌ కార్డు, బ్యాంకు ఖాతా, గ్యాస్‌ కనెక్షన్‌, అర్హులైన వారికి పింఛను, ఇల్లు ఇవ్వడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేయాలి. ప్రతి జిల్లాకు వచ్చే రెండేళ్ల కాలానికి ఒక విజన్‌ తయారుచేసుకొని వాటిని సాకారం చేయడానికి ప్రయత్నించాలి’’ అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని