ఉచిత హామీలు తీవ్ర సమస్యే!

ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలుచేస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాంటి పార్టీల ఎన్నికల గుర్తును

Published : 26 Jan 2022 03:22 IST

వాగ్దానాల వ్యయం అసలు బడ్జెట్‌ను మించిపోతోంది
రాజకీయ పార్టీలను నియంత్రించడం ఎలా?
కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
ప్రతిస్పందనకు నాలుగు వారాల గడువు

దిల్లీ: ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలుచేస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాంటి పార్టీల ఎన్నికల గుర్తును నిలిపివేయడం లేదా ఆ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ధర్మాసనంలో జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీ సభ్యులు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉచిత హామీల బడ్జెట్‌ సాధారణ బడ్జెట్ను మించిపోతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతూ ఉచిత హామీలు ఇస్తున్నాయి. నిస్సందేహంగా ఇది తీవ్రమైన అంశమే. అయితే, దీనిని నియంత్రించడం ఎలా? ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తోంది. ఈ అంశంలో కోర్టు పరిధి పరిమితమే. కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాలని గతంలోనే ఎన్నికల సంఘాని(ఈసీ)కి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. కోర్టు తీర్పు తర్వాత ఉచిత హామీల అంశంపై ఈసీ ఒకే ఒక సమావేశం నిర్వహించిందని, మార్గదర్శకాలు రూపొందించినా వాటిలో పసలేదని పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ తరఫు న్యాయవాది వికాస్‌ సింగ్‌ తెలిపారు. ‘అధికారాన్ని నిలుపుకోడానికి ఎన్నికల ముందు ప్రజాధనంతో అనుచిత ఉచిత హామీల అమలుకు యత్నించే పార్టీల గుర్తింపును రద్దు లేదా ఎన్నికల గుర్తుల నిలిపివేత, అవసరమైతే ఈ రెండు చర్యలు కలిపి తీసుకునేందుకు కేంద్రం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘కొంత సమయం వేచిచూద్దాం. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా కేంద్రం, ఈసీకి నోటీసులు ఇస్తున్నాం’ అని తెలిపింది. ఎన్నికల్లో పోటీపడి హామీలిస్తున్న పార్టీలనూ ఈ వ్యాజ్యంలో కక్షిదారులుగా చేర్చాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్‌ లేవనెత్తాలనుకున్న విషయం తీవ్రమైనది కాబట్టి కేంద్రానికి, ఈసీకి నోటీసు జారీచేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

పిటిషన్‌లో ఏముంది?

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ వేర్వేరు పార్టీలు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ భాజపా నేత, న్యాయవాది అశ్వనీ కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ...18ఏళ్ల వయసు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామంటే.. ప్రతి మహిళకు రూ.2వేలు ఇవ్వనున్నట్లు శిరోమణి అకాలీదళ్‌ వాగ్దానం చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో గృహిణికి నెలకు రూ.2 వేలు, ఏడాదికి 8 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కళాశాలకు వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీ, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.20 వేలు, 10వ తరగతి పాసయ్యాక రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ కోసం ప్రత్యేకంగా.. 12వ తరగతి చదివే అమ్మాయిలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తామని కాంగ్రెస్‌ హామీలు గుప్పించిందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచిత, నిర్హేతుక వాగ్దానాలు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనగా ప్రకటించాలని అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ కోరారు. ఒక్కో పౌరుడిపై సుమారు రూ.3 లక్షలు రుణ భారం ఉన్న రాష్ట్రాలూ ఉన్నాయని.. అయినా ఇంకా ఉచితాలను అందిస్తున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని