Padma Awards: పద్మాభిషేకం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి దేశ అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన మాజీ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌లు సహా నలుగురికి

Published : 26 Jan 2022 05:41 IST

జనరల్‌ బిపిన్‌ రావత్‌, కల్యాణ్‌సింగ్‌లకు పద్మవిభూషణ్‌
కృష్ణ ఎల్ల- సుచిత్ర ఎల్ల దంపతులకు పద్మభూషణ్‌
సైరస్‌ పూనావాలా, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌లకూ పద్మభూషణ్‌
గులాం నబీ ఆజాద్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్యలకూ...
తెలంగాణ నుంచి ముగ్గురికి, ఏపీ నుంచి ముగ్గురికి పద్మశ్రీ

ఈనాడు, దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి దేశ అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన మాజీ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌లు సహా నలుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించింది. కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ రూపకర్తలైన భారత్‌ బయోటెక్‌ అధినేతలు కృష్ణ ఎల్ల-సుచిత్ర ఎల్ల దంపతులకూ... కొవిషీల్డ్‌ తయారీదారైన సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా, టెక్‌ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లకు నేతృత్వం వహిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, రాజకీయ కురువృద్ధులు గులాం నబీ ఆజాద్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్యలతో పాటు మొత్తం 17 మందికి పద్మభూషణ్‌ను ప్రకటించింది. 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మొత్తం 128 పద్మ పురస్కారాల్లో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 3 దక్కాయి.

గరికపాటి, మొగులయ్యలకు పద్మశ్రీ...

పద్మశ్రీకి ఎంపికైనవారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు, భద్రాచల సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్‌ హుస్సేన్‌ (మరణానంతరం) ఉన్నారు. తెలంగాణ నుంచి భీమ్లానాయక్‌ సినిమా పాట ద్వారా విశేష జనాదరణ పొందిన నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన గాయకుడు రామచంద్రయ్య, కాకతీయ నృత్యకళకు పునరుజ్జీవం పోస్తున్న కూచిపూడి నృత్యకారిణి, గురువు పద్మజారెడ్డి ఉన్నారు.ప్రముఖ సినీనటి షావుకారు జానకికి తమిళనాడు కోటాలో పద్మశ్రీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణలు అభినందనలు తెలిపారు.

34 మంది మహిళలకు...

మొత్తం పద్మ అవార్డుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు 13, మహారాష్ట్రకు 10 దక్కడం గమనార్హం. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో విడతలవారీగా జరిగే కార్యక్రమంలో విజేతలకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పౌరపురస్కారాలకు ఎంపికైన వారిలో 34 మంది మహిళలు, 10 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 13 మందికి మరణానంతరం వీటిని ప్రకటించారు.


పద్మవిభూషణులు

* ప్రభా ఆత్రే: ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు (మహారాష్ట్ర)

* రాధేశ్యాం ఖేమ్కా: గీతా ప్రెస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)

* జనరల్‌ బిపిన్‌ రావత్‌: సివిల్‌ సర్వీస్‌ (ఉత్తరాఖండ్‌)

* కల్యాణ్‌సింగ్‌: ప్రజా వ్యవహారాలు (ఉత్తర్‌ప్రదేశ్‌)

ప్రభా ఆత్రే మినహా మిగతా ముగ్గురూ మరణానంతరం ఈ గౌరవం పొందారు.


1) జనరల్‌ బిపిన్‌ రావత్‌: ఉత్తరాఖండ్‌లో 1958, మార్చి 16న జన్మించారు. 1978లో దేహ్రాదూన్‌లోని భారత సైనిక శిక్షణ కేంద్రంలో 11వ గూర్ఖా రైఫిల్స్‌ విభాగంలోని అయిదో రెజిమెంటల్‌లో చేరారు. 2020లో భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా నియమితులయ్యారు. గత డిసెంబరు 8న హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.

2) కల్యాణ్‌సింగ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో 1932, జనవరి 5న జన్మించారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. భారతీయ జన్‌సంఘ్‌, జనతా పార్టీ, భాజపాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. యూపీ ముఖ్యమంత్రిగా, రాజస్థాన్‌ గవర్నర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌ అదనపు బాధ్యతలు)గా సేవలు అందించారు. ఆయన సీఎంగా ఉండగానే బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన చోటుచేసుకొంది. ఈయనగత ఏడాది ఆగస్టులో మృతిచెందారు.

3) ప్రభా ఆత్రే: మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు. శాస్త్రీయ సంగీత రీతుల్లో పేరొందిన కిరానా ఘరానా రీతిలో...సంగీత ప్రపంచాన్ని ఓలలాడించారు. 1990లో పద్మశ్రీ, 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2002లో పద్మభూషణ్‌ వరించాయి. 1932లో పుణెలో జన్మించారు.

4) రాధేశ్యాం ఖేమ్కా: 1935లో బిహార్‌లోని ముంగేర్‌ జిల్లాలో సంపన్న మార్వాడీ కుటుంబంలో జన్మించారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో సంరక్షణకు కృషిచేసిన కుటుంబం ఆయనది. అత్యంత అరుదైన సనాతన సాహిత్యాన్ని, మహా పురాణాలను సామాన్యులకు అందించడంలో ఖేమ్కా విశేష కృషి చేశారు.


పద్మభూషణ్‌ గౌరవం పొందిన మరికొందరు...

విక్టర్‌ బెనర్జీ: జాతీయ అవార్డులు పొందిన బెంగాలీ సినీనటుడు (పశ్చిమ బెంగాల్‌)

గుర్‌మీత్‌ బావా: జానపద కళాకారుడు (పంజాబ్‌)

మాధుర్‌ జాఫ్రీ: ప్రపంచ ప్రఖ్యాత షెఫ్‌, ఫుడ్‌ జర్నలిస్ట్‌ (అమెరికా)

దేవేంద్ర ఝఝారియా: పారా ఒలింపిక్‌ జావెలిన్‌త్రో అథ్లెట్‌ (రాజస్థాన్‌)

రషీద్‌ ఖాన్‌: హిందూస్థానీ సంగీత కళాకారుడు (ఉత్తర్‌ప్రదేశ్‌)

సంజయ రాజారాం: ప్రఖ్యాత గోధుమ వంగడ శాస్త్రవేత్త (మెక్సికో)

ప్రతిభా రే: అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఒడియా రచయిత. క్వీన్‌ ఆఫ్‌ ఒడియా లిటరేచర్‌గా ఖ్యాతి (ఒడిశా)

స్వామి సచ్చిదానంద: రచయిత, తాత్వికుడు, సంఘ సంస్కర్త, వైపరీత్యాల సమయంలో బాధితులను ఆదుకోవడంలో ప్రసిద్ధి (గుజరాత్‌)

వశిష్ట్‌ త్రిపాఠి: ప్రముఖ న్యాయకోవిదుడు (ఉత్తర్‌ప్రదేశ్‌)

రాజీవ్‌ మహర్షి: కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్‌ (రాజస్థాన్‌)


అగ్రరాజ్యంలో తెలుగు తేజం సత్య నాదెళ్ల

ప్రపంచంలోనే అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో 1992లో చేరిన మన తెలుగు తేజం సత్యనాదెళ్ల 2014లో ఆ సంస్థ సీఈఓగా ఎంపికయ్యారు. సంస్థ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. బిల్‌ గేట్స్‌, స్టీవ్‌ బామర్‌ తర్వాత మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టే గొప్ప అవకాశం సత్య నాదెళ్లకే లభించింది. ఆ సంస్థ మార్కెట్‌ విలువను 2 లక్షల కోట్ల డాలర్లకు, తదుపరి 3 లక్షల కోట్ల డాలర్లకు చేర్చిన ఘనత సత్య నాదెళ్ల సొంతం. క్రికెట్‌ అంటే బాగా ఇష్టపడే సత్య నాదెళ్ల పూర్తిపేరు నాదెళ్ల సత్యనారాయణ చౌదరి. స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. గతంలో భారత ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగాను, ప్రణాళికా సంఘం సభ్యుడిగా, ఇతర హోదాల్లో పనిచేసి జాతీయస్థాయిలో పేరు గడించిన మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ కుమారుడే సత్య. ఈయన మాజీ ఐఏఎస్‌ అధికారి కేఆర్‌ వేణుగోపాల్‌ అల్లుడు కూడా.


ప్రపంచ గురువు గూగుల్‌కు మార్గదర్శి.. సుందర్‌ పిచాయ్‌

ప్రపంచ అగ్రగామి సెర్చ్‌ ఇంజిన్‌ అయిన గూగుల్‌, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సీఈఓ అయిన సుందర్‌ పిచాయ్‌ చెన్నైలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన పిచాయ్‌ 2004లో గూగుల్‌లో ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యక్షుడిగా చేరారు. 2015 ఆగస్టులో గూగుల్‌ బాధ్యతలు చేపట్టారు. అత్యంత విజయవంతమైన గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌తో పాటు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆండ్రాయిడ్‌, యాప్స్‌ ఆవిష్కరణ బృందాలకు నేతృత్వం వహించారు.


టీకాల కుబేరుడు సైరస్‌ ఎస్‌ పూనావాలా

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థల్లో ఒకటైన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించిన సైరస్‌ పూనావాలా, సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 150 కోట్ల డోసుల టీకాలను ఈ సంస్థ తయారు చేసి, అంతర్జాతీయంగా సరఫరా చేస్తోంది. తట్టు, పోలియో, ఫ్లూ, బీసీజీ సహా పలు వ్యాధులకు టీకాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రపంచంలోని పిల్లల్లో 65 శాతం మందికి కనీసం ఒక్కడోసు టీకా అయినా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో తయారైంది చేసిఉంటారని అంచనా. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ ఉత్పత్తితో సైరస్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫార్చ్యూన్‌ భారత కుబేరుల జాబితాలో రూ.1.45 లక్షల కోట్ల సంపదతో ఆయన 5వ స్థానంలో ఉన్నారు. 2005లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించగా.. తాజాగా పద్మభూషణ్‌ అవార్డును ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. సైరస్‌ తనయుడు అదర్‌ పూనావాలా  సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.


కార్పొరేట్‌ పరుగుల వీరుడు.. ఎన్‌.చంద్రశేఖరన్‌  

దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ సామ్రాజ్యాల్లో ఒకటైన టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి పార్శీయేతర వ్యక్తి చంద్రశేఖరన్‌. సైరస్‌ మిస్త్రీ స్థానంలో వచ్చిన ఆయన.. గ్రూప్‌ను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. 1987లో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా టీసీఎస్‌లో చంద్రశేఖరన్‌ చేరారు. 2007 సెప్టెంబరులో టీసీఎస్‌ బోర్డులోకి వచ్చారు. సీఓఓగా పదోన్నతి సాధించి కంపెనీ వ్యూహాత్మక కొనుగోళ్లను పక్కాగా పూర్తిచేశారు. 2009లో 46 ఏళ్ల వయసులోనే టీసీఎస్‌ సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. టాటా గ్రూప్‌ అతిపిన్న సీఈఓల్లో ఒకరుగా ఈయన చరిత్ర సృష్టించారు. ఈయన సారథ్యంలో ఏటా 24 శాతం ఆదాయ వృద్ధితో టీసీఎస్‌ దూసుకెళ్లింది. మారథాన్‌ రన్నర్‌ కూడా అయిన చంద్రకు ఎక్కువ దూరాలు పరుగెత్తడం అంటే చాలా ఆసక్తి.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం

తెలంగాణ వారికి పద్మ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. పురస్కారాలకు ఎంపికైన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, మొగులయ్య, రామచంద్రయ్య, పద్మజారెడ్డిలను అభినందించారు. మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌ తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు అభినందనలు తెలిపారు.


కృష్ణ ఎల్లకు అవార్డుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం

భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు పద్మభూషణ్‌ పురస్కారం లభించడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఈసారి ఏడు పద్మ అవార్డులు వరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


చంద్రబాబు శుభాకాంక్షలు

తెలంగాణ, ఏపీ వారికి పద్మ అవార్డులు రావడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవమని తెదేపా అధినేత చంద్రబాబు హర్షం ప్రకటించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని