గెజిట్‌ అమలు పురోగతి ఎంతవరకు వచ్చింది?

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల అప్పగింత, నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందని కేంద్ర జల్‌శక్తిశాఖ ఆరా తీసింది. శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ గురువారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ) ఛైర్మన్లతో ఆన్‌లైన్‌ వేదికగా సమీక్ష నిర్వహించారు

Published : 28 Jan 2022 03:27 IST

 కృష్ణా, గోదావరి బోర్డులతో కేంద్ర జల్‌శక్తిశాఖ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల అప్పగింత, నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందని కేంద్ర జల్‌శక్తిశాఖ ఆరా తీసింది. శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ గురువారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ) ఛైర్మన్లతో ఆన్‌లైన్‌ వేదికగా సమీక్ష నిర్వహించారు. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌, కార్యదర్శి బీపీ పాండే, జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌, కార్యదర్శి రాయ్‌పురే హైదరాబాద్‌లోని బోర్డుల ప్రధాన కార్యాలయాల నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. గతేడాది జులైలో కృష్ణా, గోదావరి నదులపైఉన్న పలు ప్రాజెక్టులను బోర్డులపరిధిలోకి చేర్చుతూ నోటిఫికేషన్‌ జారీ, దాని అమలు, పురోగతిపై పంకజ్‌కుమార్‌ వివరాలు అడిగినట్లు తెలిసింది. గెజిట్‌లో పేర్కొన్న వాటిలో కొన్నింటికి సంబంధించిన సమాచారాన్నే రెండు రాష్ట్రాలు   అందజేశాయని, ప్రాజెక్టుల స్వాధీనానికి అభ్యంతరాలు లేవనెత్తుతున్న తీరు, సీడ్‌మనీపై ప్రభుత్వాల అభిప్రాయాలను బోర్డుల ఛైర్మన్లు వేర్వేరుగా వివరించినట్లు తెలిసింది.  

శ్రీశైలం.. సాగర్‌లను బోర్డులకు అప్పగించండి
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని, దీనికి సంబంధించిన చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ రెండు రాష్ట్రాలకు సూచించారు. మూడో అపెక్స్‌ కౌన్సిల్‌కు సంబంధించి ఎజెండా రూపకల్పన సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో గత నెల 28న ఈ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే సమావేశపు మినిట్స్‌ను గురువారం కేంద్రం విడుదల చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు సంబంధించి రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాంతాన్ని బోర్డులకు అప్పగించాలని, నిర్వహణకు సీడ్‌ మనీ, వనరులను కేటాయించాలని కూడా ఆయన రాష్ట్రాలకు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ: సుప్రీంకోర్టులో  కేసును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. నదీ జలాల సమస్య పరిష్కారానికి కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2 పరిధిలోకి తేవడమా లేదా కొత్త ట్రైబ్యనల్‌ ఏర్పాటు చేయడమా అనేది పరిశీలించాలి. సీడ్‌ మనీ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటాం. కేడబ్ల్యూడీటీ-1 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేటాయింపులు, నీటి విడుదల లెక్కలను తేల్చాల్సి ఉంది. దీంతోపాటు కృష్ణా బోర్డు రెండురాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకుంటుండగా గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యం కూడా అదే స్థాయిలో ఉండాలి. అనుమతులు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ సీఎం 2021 సెప్టెంబరులోనే కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్‌: అనుమతి పొందని జాబితాలోని ప్రాజెక్టుల విషయాన్ని సమీక్షించాలి. ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వచ్చిన తరువాత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను ఏర్పాటు చేయాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను అందించగానే  అనుమతులిచ్చేలా చూడాలి. ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం,సాగర్‌ల పరిధిలోని కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించడంపై ఏపీ ఇప్పటికే జీవో జారీ చేసింది. తెలంగాణ  చర్యలకు అనుగుణంగా ఇది అమల్లోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని