Bandi Sanjay: రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్‌ తరం కాదు

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్‌ తరం కాదన్నారు. ‘కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన కుంభకోణాల్ని బయటికి

Published : 02 Feb 2022 05:31 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్‌ తరం కాదన్నారు. ‘కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన కుంభకోణాల్ని బయటికి తీయబోతున్నాం. త్వరలో అరెస్ట్‌ ఖాయమని తెలిసి ప్రజల్లో సెంటిమెంట్‌ రగిలించేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌ ఎంపీ బాపురావుతో కలిసి మంగళవారం రాత్రి ఆయన ఆన్‌లైన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు. దళితుడైనందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. దళితుల విషయంలో కుట్రకోణాన్ని ఆయన ఈరోజు ఇలా బహిర్గతం చేశారు. ఇప్పుడైనా దళిత సమాజం స్పందించకుంటే ఆయన ఎంతకైనా తెగిస్తారు.

కేసీఆర్‌ భాష అభ్యంతరకరం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశమంతా చర్చ జరగాలని కేసీఆర్‌ కోరుకోవడం మూర్ఖత్వం కాదా? ప్రధాని మోదీ, మహిళ అయిన కేంద్ర ఆర్థికమంత్రి విషయంలో ఆయన ప్రయోగించిన భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారు. బడ్జెట్‌లో మంచి ఏమీ కనిపించలేదని కేసీఆర్‌ అంటున్నారు. ధాన్యం, గోధుమల కొనుగోలుకే రూ.2లక్షల 37వేల కోట్లను కేటాయించింది. గత ఏడెనిమిది బడ్జెట్‌లపై ఎందుకు మాట్లాడలేదు? మీకు వేల కోట్లు వస్తే మంచి బడ్జెట్‌, లేదంటే కాదా? తెరాస పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ధాన్యం కొననని కేంద్రానికి లేఖ ఇచ్చి రాష్ట్రానికి ద్రోహం చేసింది కేసీఆరే. రారైస్‌ ఎందుకు కొనరో కోతలొచ్చినప్పుడు చెబుతాం.

కేటీఆర్‌ సబర్మతి వెళ్లి బాగుంది అనడం నిజం కాదా?

317జీవో మంచిదైతే పది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? భార్యాభర్తల్ని విడగొట్టిన పాపం కేసీఆర్‌ది. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. వ్యాక్సినేషన్‌కు గ్లోబల్‌ టెండర్లు వేస్తామన్నారు. ఆ డబ్బులు ఏమయ్యాయి? కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఎందుకు కొమ్ముకాశారు? ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌కు వచ్చేవరకు కేసీఆర్‌కు సోయిలేదు. గుజరాత్‌ మోడల్‌ పైన పటారం లోన లొటారం అన్నారు. కేటీఆర్‌ సబర్మతి వెళ్లి బాగుంది అనడం నిజం కాదా? ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులతో ఎన్ని ఇళ్లు కట్టారో లెక్క తేల్చండి. అమృత్‌ పథకం డబ్బుల్ని కేసీఆర్‌ దారి మళ్లించారు. దిల్లీలో మరణించిన రైతులకు ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తెరాసకు 95 సీట్లు వస్తాయంటున్నారు. 9 పక్కన 5 తీసేస్తే సరిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. కానీ వచ్చేది భాజపా ప్రభుత్వమే’’ అని సంజయ్‌ అన్నారు.


దేశ పాతికేళ్ల భవిష్యత్తుకు అద్దం పట్టింది

విప్లవాత్మకంగా ఉంది. దేశ పాతికేళ్ల భవిష్యత్తుకు అద్దం పట్టింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ నరేంద్రమోదీ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించకుండా దేశహితాన్నే దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాల లక్ష్యాలకు ప్రాధాన్యమిచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలపై ఆర్థిక భారం మోపలేదు. అన్ని రంగాలను సమదృష్టితో చూడటం కత్తిమీద సాము లాంటిది. ఆ సవాళ్లను అధిగమిస్తూ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. చిన్నతరహా పరిశ్రమల రంగాలకు రూ.6 లక్షల కోట్ల ప్రోత్సాహకాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని