TS Exams 2022: వచ్చేసింది గ్రూపు-1

తెలంగాణలో గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోస్టులకు ఇదే

Updated : 27 Apr 2022 05:24 IST

503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

తెలంగాణ వచ్చాక.. తొలి ప్రకటన

 ఇంటర్వ్యూల్లేవు.. రాత పరీక్షలే..

మే 2 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

ప్రిలిమ్స్‌ : వచ్చే జులై లేదా ఆగస్టులో

మెయిన్స్‌ : వచ్చే నవంబరు లేదా డిసెంబరులో

ఈనాడు, హైదరాబాద్‌:తెలంగాణలో గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోస్టులకు ఇదే తొలి ప్రకటన. ఇందులో పది ప్రభుత్వశాఖల్లోని 503 పోస్టులను భర్తీ చేస్తామని కమిషన్‌ వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా, ఇంత భారీసంఖ్యలో గ్రూపు-1 పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. మే నెల రెండో తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వేగవంతంగా పోస్టుల భర్తీ, పారదర్శకత కోసం ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించింది. రాతపరీక్షలతోనే ఎంపిక చేయనున్నారు. తెరాస ప్లీనరీకి ముందే నోటిఫికేషన్‌ జారీ చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు మంగళవారం రాత్రి కమిషన్‌ దీన్ని సిద్ధం చేసింది. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, సభ్యులు ధన్‌సింగ్‌, లింగారెడ్డి, అరుణకుమారి, సుచిత్ర, కారం రవీందర్‌రెడ్డి, చంద్రశేఖరరావు, సత్యనారాయణ, కార్యదర్శి అనితారామచంద్రన్‌లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పరీక్షల విధానం, సిలబస్‌ తదితర సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ www.tspsc.gov.in ను అభ్యర్థులు చూడవచ్చు.

ఇవీ ముఖ్యాంశాలు

* ప్రాథమిక (ప్రిలిమ్స్‌) పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నలతో (ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌) ఓఎంఆర్‌ విధానంలో, ప్రధాన (మెయిన్స్‌) పరీక్ష సంప్రదాయ (కన్వెన్షనల్‌) పద్ధతిలో జరగనున్నాయి. తొలిసారిగా ఉర్దూభాషలోనూ ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు.

* ప్రిలిమ్స్‌ క్వాలిఫయింగ్‌ పరీక్ష మాత్రమే. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ప్రతి బహుళజోన్‌లో ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులను 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. దీనికి కుల రిజర్వేషన్‌, లింగం, ఈడబ్ల్యూఎస్‌, క్రీడలు, దివ్యాంగ కోటాలను పరిగణనలోకి తీసుకుంటారు.

* కొత్త జోనల్‌ విధానాల మేరకు అభ్యర్థులు విధిగా టీఎస్‌పీఎస్‌సీ ఓటీఆర్‌లో నమోదు చేసుకోవాలి.

* ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల తేదీ నాటికి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి. 

* తొలిసారిగా ఈడబ్ల్యూఎస్‌, క్రీడా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

* ప్రధాన పరీక్షకు ముద్రిత ప్రశ్నపత్రానికి బదులు ఎలక్ట్రానిక్‌ ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. కంప్యూటర్‌ తెరపై కనిపించే ఈ-ప్రశ్నపత్రం చూసి, మాన్యువల్‌ (తెల్లకాగితాలపై) విధానంలోపరీక్ష రాయాల్సి ఉంటుంది.

* ఎంపిక ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు వీలుగా డిజిటల్‌ మదింపు (ఎవాల్యుయేషన్‌) విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు.

* గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూపు-1 జాబితాలో ఆరు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారుల పోస్టులున్నాయి. తాజా జాబితాలో వాటికి బదులు పురపాలక గ్రేడ్‌ -2 కమిషనర్‌ పోస్టుల సంఖ్యను మరో ఆరు పెంచారు.

* ఆన్‌లైన్‌లో సమర్పించే దరఖాస్తులకు మే 31వ తేదీ రాత్రి 11.59 వరకు రుసుము చెల్లించవచ్చు.

* ప్రిలిమ్స్‌ నాటికి ప్రభుత్వ శాఖల నుంచి అదనంగా ఖాళీలు వస్తే వాటిని కూడా జాబితాకు కలుపుతారు.

* డీఎస్పీ, ఏఈఎస్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు పురుష అభ్యర్థులైతే 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఛాతీ కొలత 86.3 సెం.మీ. ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు

కలిగి ఉండాలి. హైదరాబాద్‌ సరోజినిదేవి, ఉస్మానియా కంటి ఆసుపత్రుల్లోని ఆఫ్తాల్మిక్‌ సర్జన్‌ ద్వారా దృష్టి పరీక్షల ధ్రువీకరణపత్రం ఉండాలి.

* వయోపరిమితిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల మినహాయింపు ఉంటుంది. ఎన్‌సీసీ, మాజీ సైనికులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.

* మొత్తం 33 జిల్లాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలుంటాయి. మెయిన్స్‌ పరీక్షలు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ( హెచ్‌ఎండీఏ) పరిధిలో నిర్వహిస్తారు.

విద్యార్హతలివే..

డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, సీటీవో, డీపీవో, జిల్లా రిజిస్ట్రార్‌, సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, పురపాలక కమిషనర్లు, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, ఉపాధి అధికారి, ఏవో, ఎంపీడీవో పోస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి.

* ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్‌/ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లేదా అందుకు సమానమైన డిగ్రీ పొంది ఉండాలి. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు కార్మిక సంక్షేమానికి సంబంధించిన సామాజిక సేవ (సోషల్‌ వర్క్‌)లో పీజీ పట్టా కలిగిన వారికి ప్రాధాన్యమిస్తారు.

* సాంఘిక సంక్షేమ ఏడీ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత. సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ పొందిన వారికి ప్రాధాన్యమిస్తారు.

* సహాయ ట్రెజరీ అధికారి పోస్టులకు కామర్స్‌/ఎకనామిక్స్‌/ గణితశాస్త్రం డిగ్రీల్లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని