భయం వద్దు.. జాగ్రత్తలు మరవద్దు

కొవిడ్‌ కేసుల పరంగా చూస్తే.. ప్రస్తుతం పడుతున్నవి చిరు జల్లులేనని.. దీన్ని పెనుతుపానుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు, భారతీయ ప్రజారోగ్య ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డి చెప్పారు.

Updated : 25 Jun 2022 05:30 IST

ప్రస్తుతం కొవిడ్‌ చిరు జల్లుల దశ.. పెనుతుపానుగా మారకుండా చూసుకోవాలి
ఆదమరిస్తే నాలుగో దశ ఉద్ధృతికిది ఆరంభం కావచ్చు
మాస్కులు, టీకాలతో రక్షణ
భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనాథరెడ్డితో ‘ఈనాడు’ ముఖాముఖి
ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌ కేసుల పరంగా చూస్తే.. ప్రస్తుతం పడుతున్నవి చిరు జల్లులేనని.. దీన్ని పెనుతుపానుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు, భారతీయ ప్రజారోగ్య ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ‘కరోనా వైరస్‌ మనతో పాటే ఉంటుంది. మధ్యమధ్యలో తలెత్తుతుంది. విదేశాల్లో కొత్త రూపు మార్చుకొని మన దేశంలోకి ఎప్పుడైనా ప్రవేశించొచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. వర్షం వచ్చినప్పుడు గొడుగు, రెయిన్‌ కోటు వినియోగించినట్లే వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో మాస్కులు, వ్యాక్సిన్లతో రక్షణ కల్పించుకోవాలి. కొత్త వేరియంట్లు ఏమి వస్తున్నాయి? దానికి టీకాలు ఎలా పనిచేస్తున్నాయనేది నిపుణులు నిర్ధారిస్తారు’ అని శ్రీనాథరెడ్డి చెప్పారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. మూసి ఉంచిన గదులు, సినిమాహాళ్లు, సమావేశ మందిరాలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి. కొవిడ్‌ టీకాలను రెండు డోసులూ తీసుకోవడం మంచిది. అర్హులైన వారు మూడోడోసు తీసుకుంటే ఇంకా మంచిది. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినా టీకాతో రక్షణ లభిస్తుంది.

తెలంగాణ సహా దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులలో మళ్లీ కొవిడ్‌ విస్తరిస్తోంది. దీన్ని ఎలా విశ్లేషిస్తారు?

ఇది నాలుగో దశ ఉద్ధృతికి ఆరంభంగా భావించొచ్చు. ప్రజల ప్రయాణాలు ఎక్కువవుతుంటే.. ఆ కదలికలకు అనుగుణంగా వైరస్‌ విస్తరిస్తుంది. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సేకరిస్తున్న నమూనాల్లో పాజిటివిటీని పరిశీలిస్తే.. వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు అర్థమవుతోంది. ఎప్పుడైనా ఉద్ధృతి మొదట పెద్ద నగరాల్లో మొదలవుతుంది. తర్వాత జిల్లా కేంద్రాలకు, పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తుంది. అప్పుడు కూడా అరికట్టలేకపోతే పల్లెలకూ పాకుతుంది. ఆ సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీన్ని వెంటనే అరికట్టగలమా? లేదా? అనేది మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.

మూడో డోసు (బూస్టర్‌) టీకాలను ప్రభుత్వపరంగా 18 ఏళ్లు దాటిన వారికి కూడా ఇస్తే తీవ్రతను అరికట్టవచ్చు కదా?

18 ఏళ్లు దాటిన వారికి కూడా ప్రభుత్వ వైద్యంలో బూస్టర్‌ డోసు ఇవ్వడం మేలు. టీకాల వల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకే ముప్పు తగ్గకపోయినా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముక్కు, నోరు, గొంతులోకి వైరస్‌ ప్రవేశించకుండా టీకా ఆపలేదు. కానీ కొవిడ్‌ సోకితే.. ఎదుర్కొనే శక్తి టీకాతో లభిస్తుంది. కొందరు యువతకు వైరస్‌ సోకినా.. వారిలో వేరే కారణాలతో ప్రమాదకరంగా మారొచ్చు. కానీ చాలావరకూ యువతకు ఇది అంత ప్రమాదకరం కాదని తేలింది. అందుకే యువతీయువకులకు బూస్టర్‌ ఇవ్వాల్సిన అత్యావశ్యకత లేదని ప్రభుత్వం భావిస్తోంది. కావాలనుకుంటే వారు సొంతంగా ప్రైవేటులో బూస్టర్‌ డోసు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. వైరస్‌ స్వభావం కూడా మారింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు ఊపిరితిత్తులు, రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే శక్తి తక్కువని తేలింది. అది ఎక్కువగా ముక్కు, గొంతులోనే ఉండి కొన్నాళ్లకు బయటకు వెళ్లిపోతుంది. కానీ ప్రతి వేరియంట్‌ను పరీక్షించి చూడాల్సిన అవసరముంది. డెల్టా మాదిరిగా ప్రమాదకర వేరియంట్‌ ఉద్భవిస్తే.. అప్పుడు అందరికీ బూస్టర్‌ డోసులు ఇవ్వాలి.

నాలుగో దశ ఉద్ధృతి.. డెల్టా మాదిరి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయా?

ప్రస్తుతానికి లేవు. ఇప్పటివరకు జరిపిన పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లే బయటపడుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఎక్కువ ప్రభావం చూపుతున్న బి 4, బి 5 ఇంకా మన దగ్గరికి రాలేదు. అంత ప్రమాదకరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించడం లేదు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్‌ వల్లనే కేసులు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆసుపత్రుల్లో చేరికలు తక్కువ. మరణాలూ అతి స్వల్పమే. ఒక రకంగా ఇది మంచి సంకేతమే.

బడులు తిరిగి ప్రారంభమయ్యాయి. నాలుగోదశ ఉద్ధృతి ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది?

పిల్లలకు చాలావరకు రక్షణ ఉంది. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో పిల్లలపై ఎక్కువగా ప్రభావం లేదు. అయితే కొద్దిమందిలో స్వల్ప ప్రభావం కనిపించవచ్చు. ఆరోగ్యం సరిగా లేనివారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఊబకాయం ఉన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలల్లోనూ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు, అక్కడి సిబ్బందిలో అర్హులందరూ టీకాలు పొందాలి. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలి. తరగతి గదుల్లో గాలి బాగా ఆడేలా చూడాలి. బహిరంగంగా ఉండే క్రీడా మైదానంలో ముప్పు తక్కువ. భోజనశాలల్లో ముప్పు ఎక్కువ. అత్యధికులు ఒకేసారి గుమిగూడకుండా జాగ్రత్తపడాలి. భయం, ఆందోళన మనలో ఒత్తిడిని పెంచి, రోగ నిరోధకశక్తిని తగ్గిస్తాయి. అందువల్ల భయం వద్దు. జాగ్రత్తలు మాత్రం మరవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని