జోన్ల ఏర్పాటులో జోరు.. బాసుల నియామకాల్లో బేజారు!
పోలీస్ శాఖలో కొత్త జోన్ల ఏర్పాటులో కనిపించిన జోరు వాటికి సారథులను నియమించడంలో కానరావడంలేదు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో పోలీస్శాఖ పరంగా మల్టీజోన్-1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి..
పోలీసుశాఖలో డీఐజీలను నియమించడంలో తాత్సారం
కారుణ్య నియామకాలకూ తప్పని నిరీక్షణ
క్షేత్రస్థాయి సమస్యలకు మోక్షమెన్నడో..?
పోలీస్ శాఖలో కొత్త జోన్ల ఏర్పాటులో కనిపించిన జోరు వాటికి సారథులను నియమించడంలో కానరావడంలేదు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో పోలీస్శాఖ పరంగా మల్టీజోన్-1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి.. మల్టీజోన్-2 కింద యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు ఏర్పాటయ్యాయి. అయితే దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఈ జోన్లకు ఇప్పటివరకు బాసులను నియమించలేదు. కొత్త జోన్లలో కానిస్టేబుళ్ల నుంచి ఇన్స్పెక్టర్ల వరకు పోస్టుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి అప్పట్లో కమిషనర్లను తాత్కాలికంగా ఇన్ఛార్జిలుగా నియమించారు. కాళేశ్వరానికి రామగుండం కమిషనర్, బాసరకు నిజామాబాద్, రాజన్నకు కరీంనగర్, భద్రాద్రికి వరంగల్, యాదాద్రికి రాచకొండ కమిషనర్లు, చార్మినార్, జోగులాంబ జోన్లకు హైదరాబాద్ రేంజ్ ఐజీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి జోన్లకు అపాయింట్ అథారిటీలుగా డీఐజీలను నియమించాలి. క్షేత్రస్థాయి సిబ్బందికి సంబంధించి పాలనాపరమైన అంశాల్లో వీరిదే కీలకపాత్ర ఉంటుంది. బదిలీల నుంచి మొదలుకొని పదోన్నతుల ప్రక్రియ వరకు అంతా వీరి పర్యవేక్షణలోనే జరగాలి. కానీ పూర్తిస్థాయి అధికారులు లేని కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అటు ఖాళీలు.. ఇటు నిరీక్షణ
పోలీస్శాఖలో సుమారు 60 వేల పోస్టులుంటే 90 శాతానికిపైగా కానిస్టేబుళ్ల నుంచి ఎస్సైలే. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం వీరికి సంబంధించి ఎలాంటి దస్త్రం కదలాలన్నా డీఐజీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతకుముందున్న హైదరాబాద్, వరంగల్ జోన్లను పునర్వ్యవస్థీకరించి ఏడు జోన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్కు డీఐజీ సారథిగా ఉండాలని రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లో పేర్కొన్నా నియామకాలకు నిరీక్షణ తప్పడంలేదు. ప్రస్తుతం డీఐజీ హోదాలో ఉన్న అధికారుల్లో పలువురు శాంతిభద్రతల విభాగంలో ఉన్నారు. వీరిలో రామగుండం కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, హైదరాబాద్ ఈస్ట్జోన్ ఇన్ఛార్జి డీసీపీ రమేశ్ తదితరులు బదిలీలు ఆశిస్తున్నారు. నాన్ఫోకల్ పోస్టుల్లో ఉన్న కార్తికేయ, సుమతి, రమేశ్నాయుడు, శ్రీనివాసులు, మురళీధర్, నవీన్కుమార్.. తదితరులు జోన్ డీఐజీల పోస్ట్లకు ఆశావహుల జాబితాలో ఉన్నారు. వీరిలో పలువురు ఏళ్ల తరబడి ఒకే స్థానంలో కొనసాగుతూ స్థానచలనం కోసం నిరీక్షిస్తున్నారు.
కారుణ్య నియామకాల్లేవు.. బదిలీలకు తావులేదు..
క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్ల నుంచి ఎస్సైల వరకు బదిలీలు జరగాలన్నా.. పదోన్నతులు కల్పించాలన్నా డీఐజీలదే బాధ్యత. ప్రస్తుతం ఇన్ఛార్జిలుగా ఉన్న కమిషనర్లే ఈ బాధ్యతల్ని అదనంగా చూడాల్సి వస్తోంది. కీలకమైన కమిషనర్ల హోదాలో ఇతరత్రా విధుల్లో బిజీగా ఉంటుండడంతో చాలా పనులు అపరిష్కృతంగానే ఉంటున్నాయని సిబ్బంది చెబుతున్నారు. తప్పనిసరైతే తప్ప వీటికి సంబంధించిన దస్త్రాలను కమిషనర్లు పర్యవేక్షించడం లేదని వాపోతున్నారు.
* విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల విషయంలో జాప్యం నెలకొంటోంది. కొత్త జోన్లు ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్క కారుణ్య నియామకం జరగలేదని తెలుస్తోంది.
* జోన్లలో స్పౌస్, పరస్పర బదిలీలకు సంబంధించిన దస్త్రాల పరిశీలన ఊసే లేదు.
* క్షేత్రస్థాయి సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) దస్త్రాలు ఆమోదానికి నోచుకోవడం లేదు.
* న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులకు సంబంధించి పర్యవేక్షణ కరవైంది.
* సేవాపతకాలకు సంబంధించి అవార్డులు, రివార్డుల వ్యవహారంలో జాప్యం నెలకొంటోంది.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!