PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!

దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే... కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా... కానీ... హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు...

Updated : 30 Jun 2022 14:29 IST

యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని

ఏరికోరి ఎంపిక చేసిన భాజపా నేతలు

దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే.. కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా... కానీ... హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. నేపథ్యం అతి సాధారణమైనా తెలంగాణ రుచుల తయారీలో మాత్రం అసామాన్యురాలీమె... అందుకే ఏరికోరి ఎంపికచేశారు...

జులై 2 నుంచి జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. దీనికోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు. 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్న యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు. 10వేల మందికి కూడా ఇట్టే వండివార్చేస్తారు యాదమ్మ. మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన సమావేశాల సందర్భంగా వంటలు చేయడంతో మంచి గుర్తింపు వచ్చిందీమెకు. యాదమ్మను బుధవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌ పిలిపించుకున్నారు. కొన్ని వంటలు తయారు చేయించి రుచి చూశారు. ఈ సందర్భంగా యాదమ్మ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ‘మోదీ సారు తెలంగాణ వంటకాల గురించి అడిగారట. బండి సంజయ్‌ సారు మా యాదమ్మ మంచి వంటకాలు చేస్తోందని చెప్పారట. నన్ను బుధవారం పెద్ద హోటల్‌కు పిలిపించుకున్నారు. కూరగాయలతో భోజనం కావాలన్నారు. పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి ఐదారు రకాల వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ వంటి కూరగాయలు వండుతాం. సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పుగారెలు వంటివి కూడా తయారు చేస్తాం. పెద్ద హోటల్‌లో ముఖ్యమైన వాళ్ల కోసం వంట చేయమంటున్నారు. మోదీ సారు నేను చేసే వంట తింటారంటే అంతకంటే ఎక్కువ ఏముంటుంది..అదే నాకు భాగ్యం’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారామె.

- న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని