BJP: కమలదళం కదన వ్యూహం

ఎన్నికలు, పార్టీ విస్తరణ, మోదీ పాలన గురించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం ప్రధానాంశాలుగా భారతీయ జనతాపార్టీ (భాజపా) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. గత రెండు సంవత్సరాలు కరోనాతో కార్యవర్గ సమావేశాలు భారీ స్థాయిలో జరగలేదు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కసరత్తులో

Updated : 02 Jul 2022 07:10 IST

వచ్చే లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై మేధో మథనం
తెలంగాణలో పాగా వేయడంపై ప్రత్యేక దృష్టి
నేటి నుంచే భాజపా కార్యవర్గ సమావేశాలు
ప్రధాని మోదీ, అమిత్‌షా సహా ముఖ్య నాయకులు నేడు రాక
భాగ్యనగరంలో ఎటుచూసినా స్వాగత తోరణాలే
ఈనాడు - హైదరాబాద్‌

న్నికలు, పార్టీ విస్తరణ, మోదీ పాలన గురించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం ప్రధానాంశాలుగా భారతీయ జనతాపార్టీ (భాజపా) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. గత రెండు సంవత్సరాలు కరోనాతో కార్యవర్గ సమావేశాలు భారీ స్థాయిలో జరగలేదు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కసరత్తులో నాయకత్వమంతా బిజీగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్‌లో జరిగే సమావేశాల్లోనే అన్ని అంశాలపైనా సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు  ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు సహా భాజపా అగ్రనాయకులంతా హైదరాబాద్‌ రానున్నారు. గురువారం నుంచే ముఖ్యనాయకులు రావడం ప్రారంభించగా, శుక్రవారం పార్టీ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వచ్చారు.  మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీ తదితరులు శనివారం రానున్నారు. కార్యవర్గ సమావేశాల కోసం  హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ (కాకతీయ) ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.

ఎన్నికలకు సిద్ధం చేసేలా..

గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రెండోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకొన్న భాజపా, ప్రస్తుతం అత్యధిక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కలిగి ఉంది. స్వయంగా అధికారంలోకి వచ్చే మెజార్టీ సాధించకపోయినా ఇతర పార్టీల తరఫున గెలిచిన వారిని చేర్చుకొని అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకొంది.ఈ ఏడాది ఆరంభంలో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను భాజపా తిరిగి దక్కించుకుంది. రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో శివసేనతో విభేదాల కారణంగా అధికారానికి దూరమై ఇప్పుడు అదే శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరో రెండేళ్లలోగానే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఈలోగా పలు రాష్ట్రాల శాసనసభలకు జరిగే  ఎన్నికల్లో విజయం సాధించడం కీలకంగా భావిస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో  గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో.. వచ్చే సంవత్సరం మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాటిలో ఏ ఒక్కటీ కోల్పోకుండా నిలబెట్టుకోవడంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఏం చేయాలనేది ఈ కార్యవర్గ సమావేశాల్లో అత్యంత కీలకం కానుందని పార్టీ ముఖ్యనాయకుడొకరు పేర్కొన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో పాగా వేయడంపై ఈ కార్యవర్గ సమావేశాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశముంది. దక్షిణాదిలో కర్ణాటక, పుదుచ్చేరిలలో భాజపా అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళలలో ఇప్పుడా అవకాశం లేదు కాబట్టి కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తిరిగి గెలవడంతోపాటు తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడం తమలక్ష్యమని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది.

తెలంగాణపై మరింత దృష్టి

తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస భాజపాను గట్టిగా వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఇక్కడ మరింత కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా మాజీ ముఖ్యమంత్రులు,  ఉప ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనాయకులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీకి అనుకూలమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. ఎన్నికలు, పార్టీ విస్తరణ కీలక ఎజెండాగా ఉంటుందని, దేశవ్యాప్తంగా 75 వేల బూత్‌ల స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేయడంతో పాటు కార్యకర్తలను మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించిందని, దీనిపై కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో లోతుగా చర్చించే అవకాశం ఉందని  సంబంధిత వర్గాల సమాచారం. తెలంగాణలో తెరాసకు తామే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయాన్ని కల్పించగలిగామని, ఆదివారం జరిగే భారీ బహిరంగ సభ తర్వాత ప్రజల్లో తమ పట్ల మరింత నమ్మకం పెరుగుతుందన్న ఆశాభావాన్ని తెలంగాణ భాజపా నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

సైన్యంలో కొత్త నియామకాలకు ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్‌ గురించి, దీన్ని ప్రకటించిన తర్వాత  తలెత్తిన పర్యవసానాల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వ పథకాలపైన విస్తృతంగా ప్రచారం చేపట్టడం, ప్రత్యేకించి విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న,చోట కేంద్రం ఇచ్చే సాయం గురించి నేరుగా లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడం తదితర అంశాల గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

అంతా కోలాహలం

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణలో.. ప్రత్యేకించి హైదరాబాద్‌లో కోలాహలం నెలకొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రానికి చెందిన ముఖ్యనాయకులు, జాతీయ నాయకులు సమావేశాలు నిర్వహించి పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. సమావేశాలు జరిగే ప్రాంతంతోపాటు భారీ హోర్డింగులు,  బ్యానర్లు, పోస్టర్లు, జెండాలతో నగరాన్ని కాషాయమయం చేశారు. సభలు, సమావేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల్లో ఉత్సాహాన్ని తెచ్చారు. సుమారు 350 మంది కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్నా, ప్రధాని సహా ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులంతా కదిలిరావడం, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్షనేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కదిలి రావడంతో భాజపాలో ఓ పండగ వాతావరణం నెలకొంది. సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ముఖ్యమంత్రులు, కేంద్ర నాయకులకు రాష్ట్రానికి చెందిన ముఖ్యనాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని