దేశానికి కేసీఆర్‌ వంటి నేత అవసరం

అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. విశాల భారత పరిరక్షణ, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జరిగే పోరాటమిదని చెప్పారు. దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని..

Updated : 03 Jul 2022 07:08 IST

ఆయన అడిగిన ప్రశ్నలకు మోదీ వద్ద సమాధానాలే లేవు  
విశాల భారత పరిరక్షణ కోసమే మా పోరాటం
ప్రధానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు
కేసీఆర్‌ ఉన్నంత వరకు ప్రజాస్వామ్యానికి ఢోకా లేదు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

ఈనాడు, హైదరాబాద్‌: అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. విశాల భారత పరిరక్షణ, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జరిగే పోరాటమిదని చెప్పారు. దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేవలం ఒక్క వ్యక్తి చెబితే 135 కోట్ల మంది వింటూ కూర్చోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్‌ లాంటి నేత అవసరమని అభిప్రాయపడ్డారు. అసాధ్యమనుకున్న తెలంగాణను కేసీఆర్‌ సాధించారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి... ఇప్పుడు దేశాభ్యున్నతి కోసం ముందుకొస్తున్నారని కొనియాడారు. ఆయనతో కలిసి తానూ పోరాటంలో పాల్గొంటానని.. త్వరలోనే తాము మళ్లీ కలుస్తామన్నారు. ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం లేదని, అడ్డదారుల్లో పయనిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను రాజకీయాల కోసం వాడుకోవడం దారుణమని దుయ్యబట్టారు. కేసీఆర్‌ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెరాస, కేసీఆర్‌ ఉన్నంత వరకు దేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో యశ్వంత్‌కు మద్దతుగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. హైదరాబాద్‌లో పలికిన అద్భుత స్వాగతం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. మోదీ పాలన ప్రజాస్వామ్యయుతంగా లేదు. చర్చలు, సంప్రదింపులు, ఉమ్మడి నిర్ణయాలుండవు. తనకు తోచిందే చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వాజ్‌పేయీ హయాంలో అయిదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్నా. ఆ సమయంలో ఏ రోజూ ఐటీ, ఈడీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థల అధిపతులను పిలిచి మాట్లాడలేదు. రాజకీయంగా దెబ్బతీసేందుకు ఒక వ్యక్తిపై దాడులకు ఉసిగొల్పలేదు. ఇప్పుడంతా అదే జరుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కేంద్రాన్ని ఇలా ప్రశ్నించారో లేదో అలా నోటీసులిచ్చారు. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను గతంలో ఎవరూ ఇంతలా దుర్వినియోగం చేయలేదు.

ఫోన్‌ చేస్తే స్పందన లేదు..

రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేశాక ప్రధానమంత్రికి ఫోన్‌ చేశాను. తాను అందుబాటులో లేనని సిబ్బందితో చెప్పించారు. ఇప్పటి వరకు మళ్లీ ఫోన్‌ చేయలేదు. రాష్ట్రపతి అభ్యర్థికి కనీస గౌరవం ఇవ్వని వ్యక్తి ప్రధానిగా ఉండడం మన దౌర్భాగ్యం. అమెరికా అధ్యక్షుడు బడి పిల్లలనూ కలుస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మన ప్రధాని మాత్రం ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు.

తెలంగాణ ప్రభుత్వం ప్రధాని మోదీకి ఎన్నో ప్రశ్నలు సంధించింది. కానీ, అందులో ఒక్క ప్రశ్నకు సైతం జవాబు రాలేదు. ఎందుకంటే  మోదీ వద్ద సమాధానాలు లేవు. ఎవరైనా చర్చలకు రాకపోతే, స్పందించకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి. కేంద్రంపై పోరాటానికి కేసీఆర్‌ లాంటి నేతలు అవసరం. దేశంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత సైతం మోదీ విధానాలపై దేశం మొత్తం పోరాటం కొనసాగిస్తాం. సీఎం కేసీఆర్‌తో మరోసారి భేటీ అయి మా పోరాటంపై చర్చిస్తాం. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యాక కేసీఆర్‌ మద్దతునిచ్చారు. కేటీఆర్‌ స్వయంగా దిల్లీకి రావడం నాకు స్థైర్యాన్ని ఇచ్చింది. అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు.


కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు గళం విప్పిన వ్యక్తి కేసీఆర్‌. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఆయనదే. కొత్త రాష్ట్రమైనప్పటికీ తక్కువ కాలంలో గొప్పగా అభివృద్ధి చేశారు. ఇలాంటి విధానాలనే దేశవ్యాప్తంగా అనుసరిస్తే ప్రయోజనం ఉంటుంది. నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ చెప్పినట్లుగా.. పోరాటం అనేది ఎప్పుడూ మన కోసం కాకుండా.. భావి తరాల కోసం, దేశం కోసం ఉండాలి. ఇప్పుడు మేం మొదలుపెట్టిన పోరాటం అలాంటిదే. రాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగం విలువలను కాపాడతాను.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని