రూ.19 వేల కోట్ల కోత

తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిని 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ప్రకారం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు బాండ్ల విక్రయం ద్వారా రూ.53,970 కోట్లను రుణంగా

Updated : 06 Jul 2022 06:56 IST

రుణ పరిమితిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.34,970 కోట్లకే ఆమోదం

కార్పొరేషన్‌ల రుణాలూ పరిగణనలోకి..

రూ.57 వేల కోట్లను మూడేళ్లకు విభజించిన కేంద్రం

రాబడి పెంపుపై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు

తాజాగా రూ.3 వేల కోట్ల బాండ్ల విక్రయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిని 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ప్రకారం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు బాండ్ల విక్రయం ద్వారా రూ.53,970 కోట్లను రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర ఆర్థికశాఖ ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్‌ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలనూ ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రం బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రుణాలు ఈ ఏడాది రూ.34,970 కోట్లకు పరిమితం కానున్నాయి. ఇప్పటికే మొదటి త్రైమాసికంలో జూన్‌ ఆఖరు వరకు రూ.7,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించి రుణం తీసుకోగా.. ఈ నెల నుంచి ప్రతి త్రైమాసికంలో రూ.9,000 కోట్ల చొప్పున రూ.27,000 కోట్ల బాండ్లను విక్రయించనుంది. బడ్జెట్‌ వెలుపల రుణాలు తీసుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మార్చి 31న రాష్ట్రాలకు లేఖ రాసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో కాకుండా అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలు భారీగా పెరుగుతుండటం, వాటిని బడ్జెట్‌ల నుంచి చెల్లిస్తుండటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్‌ వెలుపల తీసుకున్న రుణాలను ఈ ఏడాది రాష్ట్రాలు తీసుకునే ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి నుంచి మినహాయించనున్నట్లు పేర్కొంది. దీనిపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతిపాదించిన విధానం వివక్షాపూరితంగా ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకునే కార్పొరేషన్‌ రుణాలనూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే పరిగణించాలని, గడచిన రెండేళ్లలో తీసుకున్న అప్పులను లెక్కలోకి తీసుకోవడం సరికాదని తెలిపింది. ఇందుకు కేంద్రం అంగీకరించలేదు.   గత రెండేళ్లలో తెలంగాణ తీసుకున్న కార్పొరేషన్ల రుణాలు సుమారు రూ.57 వేల కోట్లు. వీటిని కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకు విభజించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బాండ్ల విక్రయం ద్వారా సమీకరించుకునే రుణాల్లో రూ.19 వేల కోట్లు తగ్గించింది.

రెండేళ్లలో తీసుకున్న కార్పొరేషన్ల రుణాలు..

రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు గత రెండేళ్లలో మొత్తం రూ.57,000 కోట్ల రుణాలు తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,489 కోట్లు, 2021-22లో రూ.40,511 కోట్లు తీసుకుంది. గత ఏడాది తీసుకున్న రుణాల్లో అత్యధికంగా రూ.30,922 కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం కాగా.. ఇతర సాగునీటి ప్రాజెక్టులకు రూ.2,315 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.2,832 కోట్లు ఉన్నాయి. ఇవికాకుండా పేదల ఇళ్ల నిర్మాణం, హైదరాబాద్‌ జలమండలి, పురపాలక ప్రాజెక్టులు, ఆర్టీసీ,    రోడ్ల అభివృద్ధికి ఆయా కార్పొరేషన్లు రుణాలు తీసుకున్నాయి.

అదనపు ఆదాయంపై ఆర్థికశాఖ ప్రత్యేక దృష్టి

ఈ ఏడాది తీసుకునే రుణాల పరిమితిని కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించిన నేపథ్యంలో అదనపు నిధుల సమీకరణపై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఆర్థికశాఖతో పాటు రాష్ట్రానికి రాబడులు తెచ్చే శాఖల ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. పన్నులతో పాటు పన్నేతర ఆదాయం, భూముల అమ్మకం ద్వారా అదనపు రాబడి అంచనాల మేరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రూ.3 వేల కోట్ల బాండ్ల విక్రయం

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆర్‌బీఐ ద్వారా రూ.3,000 కోట్ల బాండ్లను విక్రయించి రుణాన్ని సమీకరించుకుంది. రూ.1,000 కోట్ల చొప్పున 21, 22, 23 ఏళ్ల కాలపరిమితితో కూడిన బాండ్లను విక్రయించింది.


మోటార్లకు మీటర్లు పెడితే మరో రూ.6,100 కోట్లు.. వద్దన్న రాష్ట్రం

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల(మోటార్ల)కు మీటర్లను బిగించేందుకు అంగీకరిస్తే రుణ పరిమితిని జీఎస్‌డీపీలో మరో 0.5 శాతం పెంచనున్నట్లు కేంద్రం ప్రతిపాదించింది. దీనికి అంగీకరిస్తే సుమారు రూ.6,100 కోట్లు అదనంగా రుణం పొందేందుకు అవకాశం ఉండగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన రాష్ట్రం అదనపు రుణం తీసుకునేందుకు సుముఖంగా లేనట్లు కేంద్రానికి తేల్చిచెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని