Telangana News: కుండపోత

ఆకాశానికి చిల్లుపడిందా... కారుమబ్బులన్నీ ధారపోస్తున్నాయా.. అన్నట్లు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 9 గంటల వ్యవధిలో నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో రికార్డుస్థాయిలో

Updated : 10 Jul 2022 06:43 IST

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు... ముథోల్‌లో 9 గంటల్లో 20.3 సెం.మీ. నమోదు

గత పదేళ్లలో జులై నెలలో ఇదే రికార్డు

ఒకరోజులో అత్యధిక వర్షపాతం నమోదు

పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం

నేడూ, రేపూ అతి భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆకాశానికి చిల్లుపడిందా... కారుమబ్బులన్నీ ధారపోస్తున్నాయా.. అన్నట్లు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 9 గంటల వ్యవధిలో నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో రికార్డుస్థాయిలో 20.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  రాష్ట్రంలో గత పదేళ్ల జులై నెల ఒకరోజు(24 గంటల)లో నమోదైన అత్యధిక వర్షపాతమిదే. ఇంతకుముందు ఒకరోజు అత్యధిక వర్షపాతం 2013 జులై 19న రామగుండంలో 17.7 సెం.మీ.లు అని వాతావరణశాఖ తెలిపింది. అయితే శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకూ ఇదే జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌లో 17.8, నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం సీహెచ్‌ కొండూరులో 20, నవీపేటలో 17.8 సెం.మీ. వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

గత రెండు రోజుల్లో ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయి మరింత ఎక్కువ వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 860 ప్రాంతాల్లో వర్షాలు కురవగా అందులో 34 ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆది, సోమవారాల్లో సైతం రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

జిల్లాల్లో ఉద్ధృతి

* నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, వరంగల్‌ తదితర జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

* నిర్మల్‌తో పాటు భైంసా పట్టణంలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో పోలీసులు కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భైంసాలోని రవీంద్రాపూర్‌లోని కాలనీలో వరదనీరు రావడంతో 35 మందిని తెప్పల సహాయంతో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భైంసా మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగి భైంసా-బాసరల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

* ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మూడుచోట్ల పంచాయతీరాజ్‌ రోడ్లు కోతకు గురయ్యాయి. ఒక ఇల్లు పూర్తిగా.. 11 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌ గ్రామీణ మండలం లింగితండా శివారులోని నెమ్లికుంట అలుగు ఉద్ధృతిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు.

* ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మామిడపల్లికి చెందిన రవి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు.

పొలాల్లో నీరు నిలవకుండా చూడాలి

మొక్కల దశలో ఉన్న పంటలు వర్షాలకు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు పొలంలో నుంచి బయటికి వెళ్లిపోయేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ రైతులకు సూచించింది. పత్తి, సోయా, మొక్కజొన్న వంటి పైర్లలో నీళ్లు నిలబడకుండా చూడాలంది.

శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్తు డిమాండు 5696 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది ఇదేరోజు ఇదే సమయంలో 7160 మెగావాట్ల డిమాండు ఉంది.


ఎందుకీ అధిక వర్షాలు?

తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఉత్తర భారతమంతా వ్యాపించింది. మరోవైపు ఒడిశాపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటివల్ల తెలంగాణలో రుతుపవనాల గాలులు తక్కువ ఎత్తులోకి వచ్చాయని, వీటి ప్రభావంతో కుంభవృష్టి వర్షాలు కొద్దిగంటల్లోనే కురుస్తున్నట్లు నాగరత్న వివరించారు. సోమ, మంగళవారాల్లోనే వీటి ప్రభావం ఉంటుందన్నారు. మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, అదే జరిగితే భారీ వర్షాలు తరువాత కూడా కొనసాగుతాయని వివరించారు. దానిపై ఒకట్రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుందన్నారు.


ఉప్పొంగుతున్న వాగులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగుల్లో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాల్లో మధ్యతరహా ప్రాజెక్టులకు వరద వస్తోంది. కొన్ని జిల్లాల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయంలో శుక్ర-శనివారాల మధ్య 24 గంటల్లో 6 టీఎంసీల మేర నిల్వ పెరిగింది. తుంగభద్ర డ్యాంలో 8 టీఎంసీల నిల్వ పెరిగింది. శ్రీరామసాగర్‌లోకి శుక్రవారం 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. శనివారానికి 1.25 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 39.20 టీఎంసీల నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 70 వేల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 4 గేట్లు తెరిచి 10,515 క్యూసెక్కులను, పార్వతి (సుందిళ్ల) బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రాణహిత, గోదావరి నుంచి లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి 3,85,100 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 57 గేట్లు ఎత్తి 4,27,930 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌; నల్గొండ, భద్రాద్రి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

గోదావరికి భారీ వరద సూచన

రానున్న అయిదు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు నదిలో లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని