Heavy rains in telangana: ఊరు.. ఏరైంది
నీరు, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకు పోయాయి. చెరువుల కట్టలు తెగి పోయాయి. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఐదు జిల్లాల్లో బడులకు సెలవు ప్రకటించారు....
ఉత్తర తెలంగాణలో వరద ఉద్ధృతి
పలు జిల్లాల్లో భారీ నష్టం
ఆరుగురి మృతి.. ఇద్దరి గల్లంతు
కోతకు గురైన నిజాంసాగర్ కాల్వ, ఊడిపడిన మాసాని చెరువు గేటు
వేములవాడలో కూలిన మూలవాగు వంతెన సెంట్రింగ్
నీరు, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకు పోయాయి. చెరువుల కట్టలు తెగి పోయాయి. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఐదు జిల్లాల్లో బడులకు సెలవు ప్రకటించారు.
ఈనాడు, ఈనాడు డిజిటల్, న్యూస్టుడే, యంత్రాంగం: నింగి, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకుపోయాయి. చెరువుల కట్టలు తెగిపోయాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. వర్షాలు, వరదలకు ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నిలిచిన రాకపోకలు
వరంగల్- కరీంనగర్ జాతీయ రహదారిపై, వరంగల్-ములుగు జాతీయ రహదారిపై కటాక్షపూర్ చెరువు వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, మున్నేరు, ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి-కరీంనగర్ మార్గంలో కమాన్పూర్ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప తూర్పు రోడ్డుకు గండి పడింది. రామప్ప సరస్సు మత్తడి ఉప్పొంగి నీరు ఉద్ధృతంగా రావడంతో ఈ రహదారి తెగిపోయింది. తాడ్వాయి మండలం జంపన్న వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహించడంతో మేడారంతోపాటు పరిసర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని వాగు ఉప్పొంగడంతో ఆవలి ఒడ్డున ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి వరద 34.5 అడుగులకు చేరింది. దుమ్ముగూడెం వద్ద 15.3 అడుగులకు పెరిగింది.
పట్టణాలను తేరుకోనివ్వని వర్షం
కరీంనగర్, వరంగల్ నగరాల్లో కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్లో హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్, సాయినగర్తోపాటు సుమారు 20 కాలనీలు నీట మునిగాయి. సుమారు 500 మందిని విపత్తు నిర్వహణ దళం పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
* కరీంనగర్లో 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు జలసంద్రాన్ని తలపించాయి. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, నిజామాబాద్లోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. రోడ్లే కాల్వలుగా మారాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు వరదకు కొట్టుకుపోయాయి.
* నిర్మల్ పట్టణంలోని గణేశ్నగర్ కోతి హనుమాన్ ప్రాంతం, వివేకానంద(కుభీరు) చౌరస్తా, వినాయక్నగర్, రాహుల్నగర్, గోకుల్నగర్, తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది.
నష్టం అపారం
* వరంగల్ జిల్లాలో 25 ఇళ్లకు నష్టం వాటిల్లింది. కొన్ని కూలిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 48 విద్యుత్ స్తంభాలు కూలాయి. పలుచోట్ల ఇళ్ల గోడలు కూలినట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లాలో 65 ఇళ్లకు నష్టం వాటిల్లింది.
* సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మూలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన మంగళవారం కూలిపోయింది. రాజన్న దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పాత వంతెనకు ఇరువైపులా రెండు వంతెనలను రూ.28 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పడమటి వైపు వంతెన పూర్తయి వినియోగంలోకి వచ్చినప్పటికీ తూర్పువైపు వంతెన నిర్మాణంలో ఉంది. 2019 సెప్టెంబరులో బీమ్లపై స్లాబ్ వేసే దశలో వర్షాలకు కూలిపోయింది. గత ఏడాది పనులు పునఃప్రారంభించగా గత నెలలో కురిసిన వర్షాలకు మళ్లీ కుంగిపోయింది. మంగళవారం నాటి భారీ వర్షాలకు మూలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెన కూలింది.
* కోనరావుపేట మండలం కొలనూరు చెరువు కట్ట తెగిపోయింది.
* కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం మహ్మద్నగర్ మధ్య రోడ్డు పూర్తిగా తెగిపోయింది. కరీంనగర్ మండలంలో ఎలబోతారం, ముగ్ధుంపూర్ చెక్డ్యామ్ల కరకట్టలు తెగిపోయాయి. కోరుట్ల, మెట్పల్లిల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ వద్ద జగిత్యాల ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
* నిజామాబాద్ నగర శివారుల్లో నిజాంసాగర్ నుంచి మాసాని చెరువుకు వెళ్లే కాల్వ కోతకు గురైంది. ప్రవాహ ఒత్తిడికి మాసాని చెరువు తూము గేటు కొట్టుకుపోయింది.
* సిద్దిపేట జిల్లా చిలప్చెడ్ మండలం జగ్గంపేట ప్రాథమిక పాఠశాలలో తరగతి గది పైకప్పు కూలింది. విద్యార్థులను ఉపాధ్యాయులు పక్కగదిలో కూర్చోబెట్టడంతో ప్రమాదం తప్పింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేయడంతో మెదక్ జిల్లాలోని పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది.
* నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూర్లో కోళ్లఫారంలోని 5 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గుడిపాడు చివారులోని రెండు నాటుకోళ్ల ఫారాలు చిన్నవాగు వరదలో చిక్కుకుని దాదాపు 500 కోళ్లు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు.
* వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సోమవారం 1,88,417 టన్నులకు గాను 92,265 టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధ్యమైంది. మంగళవారం సైతం ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి.
జల దిగ్బంధంలో సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం జలమయమైంది. జిల్లా కేంద్రానికి రాకపోకలు స్తంభించిపోయాయి. పట్టణానికి ఎగువన పెద్దచెరువు, జంగమయ్యకుంట, శుద్ధికుంట, కొత్త చెరువులు అలుగు పారడంతో 25 కాలనీలు నీటమునిగాయి. 146 కుటుంబాలకు అధికారులు పట్టణంలోని సినారె కళామందిరం, నర్సింగ్ కళాశాలలో పునరావాసం కల్పించారు. డీఆర్ఎఫ్ బృందం రెండు పడవలతో వచ్చి సహాయ చర్యలు చేపట్టింది. సమీకృత కలెక్టరేట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
11న మళ్లీ అల్పపీడనం
బంగాళాఖాతంలో ఈ నెల 11న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు నాగరత్న తెలిపారు. రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఛత్తీస్గఢ్ వైపు వెళ్లింది. అది ప్రయాణించిన మార్గంలో 20 సెం.మీ.లకు పైగా కుంభవృష్టి కురిసినట్లు వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. బుధవారం నుంచి 4 రోజుల దాకా రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు చెప్పారు.
తండ్రి, కుమారుడు సహా ఆరుగురి మృతి
వరద ప్రవాహం తండ్రీ కుమారుల ప్రాణాలు తీసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం నందిపల్లికి చెందిన కుడుకల గంగమల్లు(47), కుమారుడు విష్ణువర్ధన్(7)తో కలిసి మంగళవారం ఉదయం మల్లన్నపేట వెళ్లారు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న సమయంలో మల్లన్నపేట-వెంగళాపూర్ రహదారిపై ఉన్న కల్వర్టుపై చిక్కుకున్నారు. వరద తీవ్రత ఎక్కువ కావడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారు.
* రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్కు చెందిన పెరుమాండ్ల దేవయ్య(55) పాతబస్టాండ్ సమీపంలో పైకప్పు లేని మ్యాన్హోల్లో జారిపడి గల్లంతయ్యాడు. పోలీసులతో పాటు సహాయక బృందాలు వెతుకుతున్నాయి.
* కామారెడ్డి జిల్లాలోని గర్గుల్లో ఇంటి గోడ కూలి నిమ్మ నర్సవ్వ అనే వృద్ధురాలు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి, చిన్నమావంది శివారులోని పసుపువాగులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకుపోయింది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ పంచాయతీ పరిధిలోని కన్నయ్యతండాలో పొలానికి వెళ్లిన అష్రద్ అనే రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
* నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం టెంబుర్నిలో గుమ్ముల నరేశ్(30) అనే జాలరి గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.
* సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి-గుడాటిపల్లి గ్రామాల మధ్యన ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించిన రంగు కిష్టస్వామి (45) ప్రాణాలు కోల్పోయాడు. ఇదే జిల్లా మల్లంపల్లిలో ద్విచక్ర వాహనంపై వాగును దాటేందుకు ప్రయత్నించిన కామాద్రి వెంకటయ్య నీటిలో కొట్టుకుపోతుండగా గ్రామస్థులు కాపాడారు.
* కరీంనగర్ జిల్లా జమ్మికుంట కల్వర్టు వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మల్ల రాజయ్య అనే వ్యక్తిని స్థానికులు కాపాడారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గోదావరి నది మధ్యలో దిబ్బపై ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. మేడిపల్లి మండలం పోరుమల్ల సమీపంలో వరదలో కారు చిక్కుకోగా.. అందులోని వ్యక్తిని స్థానికులు కాపాడారు.
* జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాజస్థాన్కు చెందిన ముగ్గురు యువకులు బాబీ, జితే, హామరు పెగ్గెర్ల వద్ద ఉన్న లోతట్టు వంతెన దాటుతున్న క్రమంలో చెరువులో కొట్టుకుపోయి చెట్ల పొదల్లో చిక్కుకున్నారు. స్థానిక యువకులు వారిని కాపాడారు.
ఐదు జిల్లాల్లో బడుల మూత
ఈనాడు, హైదరాబాద్: కుండపోత వర్షాల నేపథ్యంలో మంగళవారం అయిదు జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం బడులు తెరవలేదని విద్యాశాఖ వెల్లడించింది.
దెబ్బతిన్న ఎల్లంపల్లి పైపులు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి శివారులో ఎల్లంపల్లి జలాశయం పైపులైన్లు దెబ్బతిన్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి పైపులైన్ల దిగువన వర్షం నీరు చేరడంతో 200 మీటర్ల మేర పైపులు దాదాపు మీటరున్నర పైకి లేచాయి.
రికార్డు కుంభవృష్టి
ఈనాడు, హైదరాబాద్: కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలకు పాత ‘రికార్డులు’ కొట్టుకుపోతున్నాయి. గత 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం తాజాగా నమోదైంది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ (4 గంటల వ్యవధిలో) అత్యధికంగా హనుమకొండ జిల్లా నడికూడలో 38.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 120 ఏళ్ల వాతావరణ రికార్డులను పరిశీలిస్తే.. 1983 అక్టోబరు 6న నిజామామాద్లో 24 గంటల వ్యవధిలో నమోదైన 35.5 సెం.మీ. వర్షపాతమే అత్యధికం కాగా.. తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. నడికూడలో సరికొత్త రికార్డు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 ప్రాంతాల్లో 20 నుంచి 38.8 సెం.మీ.ల దాకా వర్షం కురవడంతో వరదలా నీరు పోటెత్తింది.
వాహనాలు వరద పాలు
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్