రుణాలకు వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులా?

రాష్ట్రప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తూర్పారబట్టింది. శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని ఆగ్రహించింది.

Updated : 27 Nov 2021 05:08 IST

బడ్జెట్‌ నిర్వహణ తీరు అస్తవ్యస్తం

వచ్చే 7 ఏళ్లలో రూ.1,10,010 కోట్లు బకాయిలు చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన కాగ్‌ నివేదిక


రాష్ట్ర  వనరులు, చేబదుళ్ల అంచనాలు తప్పుతున్నాయి. కేటాయింపులకు మించి కొన్ని చోట్ల ఖర్చులు చేస్తుంటే, మరికొన్ని చోట్ల కేటాయించినంత మేర నిధులు ఖర్చు చేయడం లేదు. అప్పులు తెచ్చి రెవెన్యూ ఖర్చులకే సింహభాగం వినియోగించడమేంటి?

- ఏపీ ప్రభుత్వంపై కాగ్‌ నిశిత వ్యాఖ్యలు


ఈనాడు, అమరావతి: రాష్ట్రప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తూర్పారబట్టింది. శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని ఆగ్రహించింది. శాసనసభ ఆమోదమే పొందకుండా అనుబంధ పద్దు మొత్తాలు ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని హెచ్చరించింది. బడ్జెట్‌లో చూపకుండా అప్పులు చేసి ఖర్చుచేస్తున్న వ్యవహారాలను తప్పుబట్టింది. పీడీ ఖాతాల నిర్వహణతో అసలు వ్యయం చేయకుండానే చేసినట్లు చూపుతున్న పరిస్థితులను ప్రస్తావించింది. పీడీ ఖాతాల పేరుతో శాఖాధిపతులకు నిధులు బదలాయిస్తున్నా, అసలు వారు ఖర్చు చేసుకునేందుకు ఆ నిధులు అందుబాటులో ఉండట్లేదని, ఇదేం విధానమని ప్రశ్నించింది. ఒకవైపు సగటున 6.31% వడ్డీతో అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రప్రభుత్వం వివిధ కంపెనీలు, కార్పొరేషన్లలో రూ.కోట్ల పెట్టుబడులు పెడుతూ కనీసం 0.04% ప్రతిఫలం కూడా పొందట్లేదని తేల్చిచెప్పింది. ‘ ఏటా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఆదాయంలో వడ్డీకి చెల్లించాల్సిన వాటాయే అధికం. గడిచిన అయిదేళ్లలో కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో 65-81% పాత అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోంది. అప్పు తీసుకుంటే దాంతో ఆస్తులు సృష్టించాలి.  రుణాలు చెల్లించేందుకు సరైన  ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులకు నిధులు ఉండబోవు’ అని కాగ్‌  ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 2020 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆడిట్‌ పూర్తయిన పద్దుల ఆధారంగా కాగ్‌ ఈ విశ్లేషణ చేసింది.  ఆ నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు సమర్పించింది. అందులోని వివరాలు...

* రాబోయే ఏడేళ్లలోనే రూ.1,10,010 కోట్ల అప్పులను ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని 2020 మార్చి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం కాగ్‌ పేర్కొంది.
* బడ్జెట్‌ పద్దుకు సంబంధం లేని అప్పులు రూ.26,096.98 కోట్లు. బడ్జెట్‌లో వీటిని చూపలేదు. ఇది శాసనసభ పర్యవేక్షణను నీరుగార్చడమే.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపుల వాటా 15.90%. ఇది 11.30% దాటకూడదని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించింది.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీడీ ఖాతాలకు రూ.93,122 కోట్లు బదిలీ చేసినట్లు ప్రభుత్వ ఆదేశాలు తెలియజేస్తున్నాయి. ఈ ఖాతాల్లో అందుబాటులో ఉన్న నిధులు రూ.38,599.99 కోట్లే. ఆర్థిక పద్దులు చూస్తే ఈ విషయాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
* ప్రభుత్వరంగ సంస్థలు, అథారిటీలు, అభివృద్ధి సంస్థలు వాటి పద్దులను సమర్పించడం లేదు.
* కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లను వేరే ఇతర ప్రయోజనాలకు మళ్లిస్తున్నారు. దీంతో కేంద్ర పథకాల అమలు లక్ష్యాలు నెరవేరట్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని