మరింత సులువుగా విద్యార్థి వీసాలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులందరినీ ప్రత్యక్ష బోధనకు అనుమతించేందుకు యూకేలోని వర్సిటీలు సిద్ధమవుతున్నట్లు బ్రిటిష్‌ కౌన్సిల్‌ దక్షిణ భారత సంచాలకురాలు జనక పుష్పనాథన్‌...

Updated : 30 Nov 2021 05:44 IST

చదువు పూర్తయ్యాక రెండేళ్లు బ్రిటన్‌లో పనిచేసే వెసులుబాటు
పరిశోధక విద్యార్థులకు మూడేళ్లు..
‘ఈనాడు’తో బ్రిటిష్‌ కౌన్సిల్‌ దక్షిణభారత సంచాలకురాలు జనక పుష్పనాథన్‌

జనక పుష్పనాథన్‌

చ్చే విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులందరినీ ప్రత్యక్ష బోధనకు అనుమతించేందుకు యూకేలోని వర్సిటీలు సిద్ధమవుతున్నట్లు బ్రిటిష్‌ కౌన్సిల్‌ దక్షిణ భారత సంచాలకురాలు జనక పుష్పనాథన్‌ పేర్కొన్నారు. కరోనా తర్వాత బ్రిటన్‌కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ఆమె తెలిపారు. వీసా నిబంధనల సడలింపుతో గత రెండేళ్లలో 197 శాతం మంది విద్యార్థులు అధికంగా బ్రిటన్‌కు వచ్చారన్నారు. 2019లో 30,496, 2020లో 45,677 మందికి వీసాలు ఇవ్వగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 90,669 మందికి చేరిందన్నారు. వచ్చే నెల 4న బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో యూకేలో విద్యావకాశాలపై ఆన్‌లైన్‌ మేళా జరగనున్న క్రమంలో ‘ఈనాడు’తో జనక ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు..

* కరోనా తర్వాత యూకే ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి. వర్సిటీల్లో కొవిడ్‌ కేసులు పెరగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాయి. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో విదేశీ విద్యార్థులకు పరీక్షలు, చికిత్స ఉచితంగా చేస్తున్నాయి. ప్రస్తుతం యూకే వర్సిటీలన్నీ ప్రత్యక్ష బోధన చేపట్టాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని స్థాయుల విదేశీ విద్యార్థులనూ ప్రత్యక్ష బోధనకు అనుమతించనున్నాయి.

* కరోనా ముందున్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం వర్సిటీలు హైబ్రిడ్‌ బోధనకు ప్రాధాన్యమిస్తున్నాయి.  కొన్నిచోట్ల ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ తరగతులు రెండూ నడుస్తున్నాయి. గత జులై నుంచి యూకే ప్రభుత్వం ‘గ్రాడ్యుయేట్‌ రూట్‌’ పేరిట కొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. ఫలితంగా విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక అదనంగా మరో రెండేళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసే వీలుంటుంది. పీహెచ్‌డీకి వచ్చినవారికైతే మూడేళ్ల వరకు అనుమతి లభిస్తుంది.

* బ్రిటన్‌ను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనడానికి సంబంధిత వీసాల సంఖ్యే నిదర్శనం. గ్రాడ్యుయేట్‌ రూట్‌ వంటి కార్యక్రమాలు తెచ్చాక ఇక్కడి కోర్సుల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరిగింది. అత్యధికంగా బ్రిటన్‌కు వచ్చే విదేశీ విద్యార్థుల్లో భారత్‌ది రెండో స్థానం.. యూకే అధికారిక గణాంకాల ప్రకారం 56,093 మంది భారతీయ విద్యార్థులకు 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్య వీసాలు ఇచ్చారు.

భారతీయ విద్యార్థులు యూజీ, పీజీ స్థాయుల్లో బిజినెస్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు చేసేందుకు ఎక్కువగా బ్రిటన్‌కు వస్తున్నారు. హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్స్‌, అర్కిటెక్చర్‌ బిల్డింగ్‌ అండ్‌ ప్లానింగ్‌, న్యాయ కోర్సులతో పాటు స్టెమ్‌ కోర్సుల పట్లా ఆసక్తి చూపుతున్నారు.

2018-19 ఏడాదికి 4.67 మిలియన్‌ పౌండ్ల విలువైన 480 స్కాలర్‌షిప్‌లు భారతీయ విద్యార్థులకు అందాయి. ఏడాది వ్యవధిగల స్టెమ్‌ కోర్సులు చేసేందుకు వచ్చే బాలికల్లో గత మూడేళ్లలో 175 మందికి పూర్తి ఉపకార వేతనాలు దక్కాయి. గ్రేట్‌ స్కాలర్‌షిప్‌ కింద 60 మందికి కనిష్ఠంగా పదివేల పౌండ్ల చొప్పున లభిస్తోంది. వివరాలకు www.britishcouncil.org లో చూడవచ్చు.

తాజా గణాంకాల ప్రకారం భారత్‌ నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 96శాతం మందికి వీసాలు లభిస్తున్నాయి. దరఖాస్తు విధానం చాలా సులువుగా మారింది. ప్రాధాన్య, అధిక ప్రాధాన్య విభాగాల కింద గడువులోగా విద్యార్థులకు వీసాలు అందుతున్నాయి.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని