నమ్ముకున్న పంటను అమ్ముకోలేక..

చేను విరగ్గాసి పంట చేతికి రాగానే కొండంత సంబరపడి.. దోసిట్లో బిడ్డను పట్టినట్లు అపురూపంగా పట్టుకుని బస్తాలకెత్తిన రైతన్న.. చంటిబిడ్డను సాకినట్లు మబ్బులు ఉరమగానే ఒకచోటి కుప్పను మరోచోటికి, అక్కడ తడిస్తే ఇంకోచోటికి మారుస్తూనే ఉన్నాడు. కొనుగోళ్లు మాత్రం ముమ్మరం కాలేదు.

Updated : 01 Dec 2021 03:01 IST

నెలల తరబడి రైతులకు పడిగాపులే
తరుగు పెంచితేనే కొంటున్న మిల్లర్లు
నల్గొండ, భువనగిరి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి  

తుక్కాపురం వద్ద కల్లంలోనే మొలకలు వచ్చిన ధాన్యం

చేను విరగ్గాసి పంట చేతికి రాగానే కొండంత సంబరపడి.. దోసిట్లో బిడ్డను పట్టినట్లు అపురూపంగా పట్టుకుని బస్తాలకెత్తిన రైతన్న.. చంటిబిడ్డను సాకినట్లు మబ్బులు ఉరమగానే ఒకచోటి కుప్పను మరోచోటికి, అక్కడ తడిస్తే ఇంకోచోటికి మారుస్తూనే ఉన్నాడు. కొనుగోళ్లు మాత్రం ముమ్మరం కాలేదు.

కల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యపురాశులే. వానకు తడుస్తున్నాయి. ఎండకు ఎండుతున్నాయి. దాదాపు నెలన్నర నుంచి రైతుల ఎదురుచూపులు. రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుల గోస ఇది. అసలే దిగుబడి తగ్గి ఆవేదనలో ఉన్న రైతులపై టార్పాలిన్లు, తూర్పార యంత్రాల భారమే తడిసి మోపడు అవుతోంది. చాలా కొనుగోలు కేంద్రాల్లో అధికారులు టార్పాలిన్లు ఇవ్వకపోవటంతో ధాన్యం తడవకుండా రైతులే వాటిని అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ధాన్యంలో తాలు తొలగించేందుకు తూర్పార యంత్రాల (ప్యాడీ క్లీనింగ్‌ మిషన్స్‌)ను ప్రభుత్వమే సమకూర్చాలి. యంత్రాలు అందుబాటులో లేక, ఉన్నవీ పనిచేయక రైతులు అద్దెకు తెచ్చుకోవడం చాలా జిల్లాల్లో ‘ఈనాడు’ దృష్టికి వచ్చింది. అకాలవర్షాలు, అదనపు భారంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సీజనులో ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువే కొన్నట్లు పౌరసరఫరాలశాఖ రికార్డులు చెబుతున్నా ధాన్యపు రాశులు మాత్రం తరగటం లేదు. అధికారులు పట్టించుకోరు.. వ్యాపారులది ఇష్టారాజ్యం. వెరసి రైతులది దయనీయ పరిస్థితి. వ్యాపారి చెప్పిన ధరకు ఒప్పుకొంటే.. అడిగినంత తరుగు ఇస్తే మాత్రమే ధాన్యం కాంటా మీదకు చేరుతుంది. లేదంటే ఎక్కడి బస్తాలు అక్కడే. వర్షం కురిస్తే తడిసి మొలకలు రావటం పరిపాటి అయింది.  పోచంపల్లి కొనుగోలు కేంద్రంలో 360 మంది రైతులు దాదాపు లక్ష బస్తాల ధాన్యం తెచ్చి అక్టోబరు 7 నుంచి ఎదురుచూస్తున్నారు. మూడుసార్లు అకాల వర్షాలతో అవస్థలు పడ్డారు. తడిసిన ప్రతిసారీ సరకును మరో ప్రాంతానికి మార్చటం, ఆరబెట్టటం అధికారుల కోసం ఎదురుచూడడం మామూలైపోయింది. అధికారులు, మిల్లర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బేరాలు ఆడిన వారే తప్ప కొన్నది 20, 25 మంది ధాన్యమే. తరలింపునకు రవాణాదారులు బస్తాకు రూపాయన్నారు. ఇప్పుడు రూపాయిన్నర డిమాండు చేస్తున్నారు. 40 కిలోలకు 3, 4 కిలోలు తరుగు రూపంలో అదనంగా ఇస్తేనే కొంటామని మిల్లర్లు.. ఇలా రైతులను దోచుకునేందుకే చూస్తున్నారు. ఇది అన్యాయమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తూర్పారయంత్రానికి రైతులు చెల్లిస్తున్న అద్దె గంటకు రూ. 200

ఆ భారమూ రైతుపైనే..
కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు (పట్టాలు) ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదే. కానీ ఆ భారాన్ని రైతుల నెత్తినే రుద్దారు. రోజుకు ఒక్కో పట్టాకు రూ. 20 చెల్లించాలి. ఒక్కో ధాన్యపు కుప్పకు కనీసం 8 నుంచి 10 పట్టాలు అవసరం. ఇన్ని రోజులుగా రైతులపై ఎంత భారం పడిందో అర్థంచేసుకోవచ్చు. ధాన్యంలో తాలు, తప్ప లేకుండా ఉండేందుకు వాటిని తూర్పారబట్టాలి. ఆ యంత్రాలను అందజేయాల్సిందీ అధికారులే. ఇక్కడా చేతులెత్తేశారు. పెద్ద యంత్రమైతే గంటకు రూ. ఆరొందలు, చిన్న యంత్రమైతే గంటకు రూ. రెండొందలు చొప్పున రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఒక ఎకరా ధాన్యం తూర్పారబట్టటానికే రూ. వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి.


ప్రభుత్వ విత్తనాలు వేసినా కోతలేనా?

ప్రభుత్వం ఇచ్చిన విత్తులే వేశాం. ఇప్పుడేమో తేమ అంతుంది, ఇంతుంది అంటున్నారు. గత ఏడాది ఈ సమస్య రాలేదు. బస్తాకు మూడు, నాలుగు కిలోలు తరుగు తీస్తే మేమేం కావాలి? కుప్పలు పోసి రెండు నెలలైంది. పలుకుబడి ఉన్నోళ్లది తీసుకుంటున్నారు. మాలాంటి చిన్నోళ్లను పట్టించుకోవటం లేదు. వాళ్లకు లేని తరుగు మాకెందుకు వస్తోంది?  

- రాసాల మహేష్‌, యాదాద్రి జిల్లా తుక్కాపురం


ఓపిక నశించింది...
- బొక్కా బాలిరెడ్డి, యాదాద్రి జిల్లా పోచంపల్లి

అయ్యా... ధాన్యం కొనండని ఎమ్మార్వో నుంచి కలెక్టరు ఆఫీసు దాకా తిరుగుతూనే ఉన్నాం. మిల్లర్లు తీసుకెళ్లిన ధాన్యాన్ని చిన్న యంత్రంలో వేస్తున్నారు. వారికి కావాల్సినంత వేగం పెట్టుకుంటున్నారు. నూకలు ఎక్కువ వస్తున్నాయంటూ తరుగు బేరమాడుతున్నారు. అడిగినంత ఇస్తేనే ధాన్యం దించుకుంటున్నారు. ఇదేంది సారూ అని అధికారులను అడిగితే సమాధానం ఉండదు. ఇవే అమ్ముడు పోలేదు. యాసంగి సంగతి యాదికి కూడా రావటం లేదు. పనులు చేయటానికి పైసలూలేవు. అప్పు ఇచ్చే వారూలేరు.ఓపిక పోయింది. భార్యా పిల్లలతో కలిసి రోడ్డెక్కుడే మిగిలింది.


ఇదేమి అన్యాయం?
- మేకల శివశంకర్‌, యాదాద్రి జిల్లా తుక్కాపురం

ఉన్న 12 ఎకరాల్లో వరి పండించాం. ధాన్యం తెచ్చి రెండు నెలలవుతోంది. పట్టించుకున్నోడు లేడు. తూర్పార యంత్రం అద్దె గంటకు రూ. 600. మనిషికి రూ.100. ధాన్యం తూర్పార పట్టేందుకే వేలు ఖర్చవుతోంది. ఈ మిషన్లు ఇయ్యాల్సింది ప్రభుత్వం. పట్టాలూ ప్రభుత్వమే ఇవ్వాలి. ఏదీ ఇవ్వలేదు. పట్టాలకూ వేలు కడుతున్నాం. యంత్రాలెందుకివ్వరంటే చెడిపోయాయంటున్నారు. ప్రభుత్వం ఏమి చేస్తుందో అర్థమైతలేదు. నేను ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేసిన. ఉద్యోగం లేదు. వ్యవసాయం వల్ల నేనే కుటుంబానికి భారమైతున్నాను. ఏ కూలీయో చేసుకోవాలేమో. యాసంగిలో మినుములు, పల్లీలు వేస్తాం సరే.. కొంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందా?



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని