ఇసుక ఉంది కొంటారా?

హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో పెద్ద లారీ లోడ్‌ తీసుకుంటే దొడ్డు ఇసుక రూ.1,250- రూ.1,300కు, సన్నరకం రూ.1,350-1,400కు దొరుకుతోంది. నవంబరులో 8.33 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక విక్రయాలు జరిగాయి.ఇంటి నిర్మాణ పనులు మొదలైతే యజమానులు ఎక్కువగా ఆందోళన చెందేది ఇసుక గురించే. గతంలో అది దొరకడమే గగనంగా ఉండేది. దళారులు అడిగినంత ధర చెల్లించాల్సి వచ్చేది. కానీఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.

Updated : 02 Dec 2021 05:18 IST

 గతంలో బుకింగ్‌ మొదలైన అరగంటలోపే ఖాళీ

ఇప్పుడు రోజంతా అందుబాటులో

హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో పెద్ద లారీ లోడ్‌ తీసుకుంటే దొడ్డు ఇసుక రూ.1,250- రూ.1,300కు, సన్నరకం రూ.1,350-1,400కు దొరుకుతోంది. నవంబరులో 8.33 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక విక్రయాలు జరిగాయి.

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి నిర్మాణ పనులు మొదలైతే యజమానులు ఎక్కువగా ఆందోళన చెందేది ఇసుక గురించే. గతంలో అది దొరకడమే గగనంగా ఉండేది. దళారులు అడిగినంత ధర చెల్లించాల్సి వచ్చేది. కానీఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇసుక కొనేవారి కోసం అటు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)తో పాటు విక్రయదారులు ఎదురుచూస్తున్నారు. గతంలో ఆన్‌లైన్‌లో పెట్టిన అరగంటలోపే బుకింగ్‌ అయిపోయేది. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో ప్రయత్నం చేసినా దొరుకుతోంది. అయినా 50శాతం వరకు ఇసుక మిగిలిపోతోంది. గత ఏడాది కాలంలో సిమెంటు, స్టీలు ధరలు బాగా పెరగ్గా.. ఇసుక ధరలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట సహా 10 జిల్లాల్లోని స్టాక్‌యార్డుల్లో ఇసుక ఉంది. కొద్ది రోజులుగా రోజుకు 50వేల క్యూబిక్‌మీటర్లకుపైగా ఇసుకను టీఎస్‌ఎండీసీ అందుబాటులో ఉంచుతోంది. ఆన్‌లైన్‌ విక్రయాలు 25-30వేల క్యూబిక్‌మీటర్లలోపే జరుగుతున్నాయి. బుధవారం 26,111 క్యూబిక్‌మీటర్ల ఇసుకను విక్రయించారు.

ఎందుకు తగ్గింది?

గతంలో వర్షాకాలంలో టీఎస్‌ఎండీసీ స్టాక్‌ తక్కువ పెట్టేది. దీంతో ఇసుక లభ్యత తగ్గి బ్లాక్‌ మార్కెటింగ్‌ భారీగా జరిగేది. వానలు తగ్గాక డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగి, ధరలకు రెక్కలువచ్చేవి. స్టాక్‌ ఎంత పెట్టినా నిమిషాల్లోనే బుకింగ్‌ పూర్తయ్యేది. ఈసారి ఇసుక బుకింగ్‌లపై వర్షాకాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించినట్లు టీఎస్‌ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి.

* గోదావరి, మానేరు, మూసీ వంటి నదుల నుంచి వర్షాకాలంలో ఇసుక తీసే పరిస్థితి ఉండదు. స్టాక్‌ యార్డుల్లో నిల్వలు తీసుకెళ్లాలన్నా ఆ మార్గంలో రోడ్లు దెబ్బతింటే సరఫరాపై ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా వానాకాలంలో ఇసుక అమ్మకాలు తక్కువ ఉండేవి. ఆ పరిస్థితి ఈ ఏడాది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 5,06,458 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను టీఎస్‌ఎండీసీ అమ్మితే, ఈసారి అదే మూడు నెలల్లో 16,45,498 క్యూబిక్‌ మీటర్ల ఇసుక విక్రయించారు. ఫలితంగా నవంబరు నుంచి ఇసుక డిమాండ్‌ తగ్గినట్లు భావిస్తున్నారు. 

వర్షాకాల ప్రభావాన్ని తగ్గించాం

భవన నిర్మాణాలకు సంబంధించి ధర పెరగనిది ఒక్క ఇసుకకే. వానాకాలంలో ఎక్కువ కాలం విక్రయాలు ఆగకుండా చూశాం. సంవత్సరం అంతా ఇసుక అందుబాటులో ఉండడంతో వర్షాకాల అనంతర డిమాండ్‌ తగ్గింది. ఆన్‌లైన్‌లో పెట్టే స్టాక్‌లో దాదాపు సగం మిగిలిపోతోంది. త్వరలో మరికొన్ని కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

- మల్సూర్‌, వీసీ ఎండీ, టీఎస్‌ఎండీసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని