స్కీములే స్కాములు!

మాటలే పెట్టుబడి.. మోసమే వ్యాపారం.. సామాన్యుల ఆశలతో అవకాశవాదులు సాగిస్తున్న మోసాలెన్నో! దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తీరు. ముఖ్యంగా తెలంగాణలో మిగతా నేరాలు తగ్గుముఖం పడుతుండగా చీటింగ్‌ కేసులు మాత్రం పెరుగుతున్నాయి...

Published : 08 Dec 2021 02:24 IST

నిత్యం వెలుగుచూస్తున్న అనేక మోసాలు
సామాన్యుల ఆశే మోసగాళ్లకు పెట్టుబడి..
అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక నేరాలు

ఈనాడు, హైదరాబాద్‌: మాటలే పెట్టుబడి.. మోసమే వ్యాపారం.. సామాన్యుల ఆశలతో అవకాశవాదులు సాగిస్తున్న మోసాలెన్నో! దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తీరు. ముఖ్యంగా తెలంగాణలో మిగతా నేరాలు తగ్గుముఖం పడుతుండగా చీటింగ్‌ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2018లో 10,390 చీటింగ్‌ కేసులు నమోదవగా 2020 నాటికి అవి 12,985కు పెరిగాయి. దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో ప్రతి లక్షమంది జనాభాలో మోసపోతున్న వారి సగటు 34.6గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అస్సాం (28), కేరళ (25) ఉన్నాయి. తెలంగాణలో నూటికి 29 కేసులలో మాత్రమే శిక్ష పడుతోంది. ఒకే తరహా మోసాలు పదేపదే జరుగుతున్నా ప్రతిసారీ కొత్త బాధితులు పుట్టుకొస్తూనే ఉండడం గమనార్హం. ఇలాంటి రకరకాల మోసాలపై ‘ఈనాడు’ అందిస్తున్న వరుస కథనాల్లో ఇది మొదటిది.

1 గొలుసు కట్టు మోసాలు
‘ముందు సభ్యుడిగా చేరు. మరికొందరిని చేర్చు.. సభ్యులు పెరుగుతున్న కొద్దీ నీ లాభం రెట్టింపవుతుంది’.. దశాబ్దాలుగా జరుగుతున్న గొలుసుకట్టు మోసాల స్కీముల్లోని మూలసూత్రమిది. ఎన్ని కుంభకోణాలు బయటపడుతున్నా, ఎంతమంది మోసపోతున్నా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

* దేశవ్యాప్తంగా ఇండస్‌ వివా అనే సంస్థ ఇలాగే 10 లక్షలమంది నుంచి రూ. 1500 కోట్లు, ఈ బిజ్‌ సంస్థ 7 లక్షల మంది నుంచి రూ.వెయ్యి కోట్లు వసూలు చేశాయి.  

2 పెట్టుబడితో బురిడీ
అధిక వడ్డీ ఇస్తామని చెబుతూ కొన్ని సంస్థలు పెద్దఎత్తున డిపాజిట్లు సేకరిస్తున్నాయి. ఆ సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టి లాభాలు జేబులో వేసుకుంటాయి. డిపాజిటర్లకు మాత్రం కుచ్చుటోపీ పెడతాయి.

* స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రజల నుంచి ఇలాగే డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసింది. రూ.లక్ష అంతకంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే నెలకు 9 శాతం వడ్డీ చెల్లిస్తామని, సంవత్సరంలో అసలు తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది. ఈ మాటలకు బోల్తాపడి 950 మంది రూ. 87 కోట్లు కట్టారు.

* సన్‌ పరివార్‌ గ్రూప్‌ రూ.లక్ష కడితే నెలకు రూ.6 వేల చొప్పున 25 నెలలపాటు తిరిగి చెల్లిస్తామని, 26వ నెలలో అసలు (రూ.లక్ష) కూడా ఇచ్చేస్తామని చెప్పింది. రూ.5 లక్షలు మించి డిపాజిట్‌ కట్టిస్తే వారికి 9 నెలలపాటు 3 శాతం కమీషన్‌ ఇస్తామంది. కొత సభ్యుల్ని చేర్పిస్తే 3 శాతం కమీషన్‌ ఇస్తామంటూ రూ. 158 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.

* రూ.300 కడితే 90 రోజుల్లో రూ. 1,350, రూ.3,000 చెల్లిస్తే రూ.13,500, రూ.15,000 చెల్లిస్తే రూ.67,500 తిరిగి చెల్లిస్తామని చెబుతూ సిసిసియో డాట్‌కాం దేశవ్యాప్తంగా 20 వేల మంది నుంచి రూ. 50 కోట్లు వసూలు చేసింది.

3 అనుమతిలేని చిట్‌ఫండ్స్‌తో జాగ్రత్త
ఎలాంటి అనుమతిలేని చిట్‌ఫండ్‌ సంస్థల మోసాలు కొత్తకాదు. వీటికి బలయ్యేది మధ్యతరగతి ప్రజలే. కాలనీల్లో, అపార్ట్‌మెంట్లలో ప్రైవేటుగా చిట్టీల వ్యాపారం నడుస్తుంటుంది. మోసపోతే చట్టపరంగా రక్షణ ఉండదు. నిర్వాహకులు కొందరు చిట్టీల ద్వారా వచ్చిన డబ్బుతో స్థిరాస్తి లాంటి వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతుంటారు. దాంతో పాడుకున్న వారికి డబ్బు ఇవ్వలేక బోర్డు తిప్పేస్తుంటారు.

* రిషబ్‌ చిట్‌ ఫండ్స్‌ రూ.200 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు హైదరాబాద్‌ సీసీఎస్‌లో 2018 డిసెంబరులో కేసు నమోదైంది.

* రూ.10 కోట్లు మోసం చేసినట్లు కేకేఆర్‌ చిట్‌ఫండ్స్‌పై హైదరాబాద్‌ పోలీసులు 2020 డిసెంబరులో కేసు నమోదు చేశారు.

4 షేర్‌ మార్కెట్‌ పేరుతో
ఫలానా సంస్థ షేర్‌ మరో వారంలో రెట్టింపు కాబోతోంది. కాస్త పెట్టుబడి పెట్టండి. వారం రోజుల్లోనే రూ.లక్షలు కళ్ల చూడండి అంటూ షేర్‌మార్కెట్‌ పేరిట జరుగుతున్న మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ముంబయికి చెందిన అనుగ్రహ షేర్‌ ట్రేడింగ్‌ అనే సంస్థ పెట్టుబడులపై 4 శాతం కమిషన్‌ ఇస్తామంటూ ప్రజలను ఆకర్షించి దేశవ్యాప్తంగా రూ. 1500 కోట్లు వసూలు చేసింది. ఆ సంస్థపై ఈ ఏడాది   జనవరిలో కేసు నమోదైంది. వందలమంది మోసపోయారు.


సభ్యుల్ని చేర్చినవారిపైనా కేసు

ముందు కొంతమంది సభ్యులను చేర్పించి, తర్వాత వారి ద్వారా వారి మిత్రులకు ఎర వేయిస్తుంటారు. గొలుసుకట్ట పథకాలు చట్ట విరుద్ధం. ఆశకుపోయి వీటిలో చేరితే ఆర్థికంగా నష్టపోవడమే కాదు నిందితులుగా నిలబడాల్సి ఉంటుంది. సభ్యులకు జరిగే నష్టానికి వారిని చేర్పించిన వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది.


ఫిర్యాదుకు ఆస్కారమేది?

లాంటి సంస్థ ఏదైనా మన వీధిలో కనిపిస్తే.. మోసానికి తెరలేస్తోందని తెలిసినా ఫిర్యాదు చేయడానికి అవకాశం లేకపోవడం విశేషం. ఎందుకంటే.. ఏదైనా మోసం జరిగినప్పుడు మాత్రమే కేసు నమోదుకు వీలు ఉంటుంది. దీంతో ఫిర్యాదు అందేసరికే వందలమంది బాధితులుగా మారి ఉంటారు. అప్పటికే పెద్దమొత్తంలో నిధులు దారి మళ్లి ఉంటాయి. ఇటువంటి సంస్థ ఏదైనా బోర్డు పెట్టగానే పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెళితే తమకు రకరకాల అనుమతులు ఉన్నాయని బుకాయిస్తారు.


జాగ్రత్త పడితేనే మేలు  

* చిన్నచిన్న సంస్థలు ఆశపెట్టే అధిక వడ్దీకి ఆశపడే ముందు పెద్ద బ్యాంకులు ఎందుకంత ఇవ్వలేకపోతున్నాయో గమనించాలి.

* గుర్తింపు పొందిన చిట్‌ఫండ్స్‌లో చేరితే పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదు. కానీ అనధికారిక చిట్స్‌ పరిస్థితి అలా కాదు.  

* లాభాలకు ఆశపడి.. బోగస్‌ సంస్థల ప్రకటనలను నమ్మితే బోల్తా పడడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని