‘సర్వరోగ నివారిణి’కే... తెగులు

ఆయుర్వేదంలో వేపచెట్టుకు ‘సర్వరోగ నివారిణి’ అనే పేరుంది. కానీ ఇప్పుడు ఆ చెట్లే తెగుళ్లు సోకి నిలువుగా ఎండిపోతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ అడవుల్లో ప్రారంభమైన తెగుళ్లు గత వానాకాలం నుంచి కొద్దిరోజుల్లోనే దేశమంతా విస్తరించినట్లు

Published : 15 Jan 2022 03:23 IST

ఎండిపోతున్న వేపచెట్లు
దేహ్రాదూన్‌ నుంచి తెగుళ్ల వ్యాప్తి
మైసూర్‌, తెలంగాణ వ్యవసాయ వర్సిటీల అధ్యయనం

యుర్వేదంలో వేపచెట్టుకు ‘సర్వరోగ నివారిణి’ అనే పేరుంది. కానీ ఇప్పుడు ఆ చెట్లే తెగుళ్లు సోకి నిలువుగా ఎండిపోతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ అడవుల్లో ప్రారంభమైన తెగుళ్లు గత వానాకాలం నుంచి కొద్దిరోజుల్లోనే దేశమంతా విస్తరించినట్లు కర్ణాటకలోని మైసూర్‌, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనల్లో గుర్తించారు. తెగుళ్ల వ్యాప్తిపై ఈ రెండు వర్సిటీల శాస్త్రవేత్తలు పరిశోధన పత్రాలను తాజాగా విడుదల చేశారు.

ఏమిటీ తెగులు...

దేశవ్యాప్తంగా ఆరునెలలుగా వేపచెట్లకు ‘పోమోప్సిస్‌’ శిలీంధ్రంతో పాటు టి మస్కిటో బగ్‌ అనే పురుగులు సోకి ఆకులు, పూలు, కొమ్మలు ఎర్రబారి ఎండిపోయి పూర్తిగా రాలిపోతున్నాయి. ఈ తెగులు సోకిన చెట్టు పూర్తిగా ఎండిపోతోంది.

తొలుత ఈ శిలీంధ్రాలు సోకి కొంత ఎండిన వేపచెట్టుకు రోగనిరోధకశక్తి తగ్గడంతో ఇంకా 16 రకాల శిలీంధ్రాలు, పురుగులు వేగంగా సోకి త్వరగా నాశనం చేస్తున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు.

రెండేళ్లుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తున్నందున తేమతో శిలీంధ్రాలు అధికంగా సోకుతున్నాయి. వేపకు ఔషధగుణాలున్నా దాని పూత, చిగురును తినేసే శిలీంధ్రం తొలుత హిమాలయ ప్రాంత అడవుల నుంచి పుట్టుకొచ్చింది.


దేశవ్యాప్తంగా 2 కోట్ల వేపచెట్లు

ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 కోట్ల వేపచెట్లు ఉన్నాయి. మరో 3 కోట్ల చెట్లు పెంచితేనే వేపనూనె డిమాండు తీరుతుంది.

వందకిలోల వేపగింజలను గానుగాడితే 40 కిలోల వేపనూనె వస్తుంది. ఇందులో అనేక రకాల ఔషధగుణాలున్నాయి. క్వింటా వేపగింజలను రూ.1500 చొప్పున ఎరువుల కంపెనీలు కొంటున్నాయి.

వేపచెట్టు పూలు, పండ్లు, గింజలు, నూనె, నూనెతీసిన తరవాత వ్యర్థంగా మిగిలే చెక్క, కాండంబెరడు, దాని నుంచి వచ్చే జిగురు, వేర్లు...ఇలా ప్రతీ భాగం ఏదో ఒక ఔషధగుణం కలిగి ఉంటుంది.

వేపపుల్లలతో పళ్లు తోముకుంటే ఎలాంటి క్రిములు ఉండవని, ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న పేస్టులకన్నా అది అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

కుష్టు వ్యాధి, ఎముకలు, కీళ్ల జబ్బులు, అల్సర్లు, చర్మవ్యాధులకు వేపనూనెను వినియోగిస్తారు.

ఈ భూమ్మీద మొత్తం 2400 రకాల మొక్కలకు ఉండే ఔషధగుణాల వల్ల వాటిని తెగుళ్లు, పురుగుల నియంత్రణకు జీవ పురుగుమందుల్లో వినియోగిస్తారు. వీటన్నింటిలో వేపచెట్టుకే అగ్రతాంబూలమని మైసూర్‌ వర్సిటీ స్పష్టం చేసింది.

195 రకాల పురుగులను చంపే శక్తి వేప ఉత్పత్తులకు ఉంది. అందుకే ఈ చెట్టును ‘గ్రామ ఔషధ దుకాణం’ లేదా ‘డాక్టర్‌ చెట్టు’ అని పిలుస్తారు.


వేపతో అనేక ప్రయోజనాలు...

ప్రపంచంలో తెగుళ్ల, పురుగుల నివారణకు ఏకైక పరిష్కారం వేపచెట్టు అని అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో గల జాతీయ ప్రెస్‌ అకాడమీ 1992లో ‘ఏ ట్రీ ఫర్‌ సాల్వింగ్‌ గ్లోబల్‌ ప్రాబ్లమ్స్‌’ అనే పేరుతో ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని విడుదల చేసింది.

వేపచెట్లు-పర్యావరణం (నీమ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ టెక్నాలజీ) అనే పేరుతో 1996లో ఆక్స్‌ఫర్డ్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రత్యేకంగా ప్రచురించిన మరో పుస్తకంలో వేపచెట్టు గొప్పతనం గురించి శాస్త్రవేత్తలు వివరించారు. ఇలా జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికి 38 పరిశోధన పుస్తకాల్లో ప్రత్యేకంగా వేపచెట్టు గొప్పతనం గురించి వివరిస్తూ పర్యావరణానికి అది చేసే మేలు, దానిలో ఉండే ఔషధగుణాలు, అందులోని ప్రతీభాగం వినియోగంతో ప్రయోజనాలను వివరించారు.

మనదేశంలో ఏటా 2.50 కోట్ల టన్నుల యూరియాలో 26 వేల టన్నుల వేపనూనెను కలుపుతున్నారు. ఈ వేపనూనె కొరత వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.


మందులు చల్లాలి

-డాక్టర్‌ జగదీశ్వర్‌, పరిశోధన సంచాలకుడు, జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ

చెట్టు ఎండుముఖం పట్టినట్లు గుర్తించగానే ‘ప్రొఫెనోప్‌స్‌’ అనే రసాయనాన్ని లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి చల్లాలి. కార్బండిజం, మ్యాంకోజెబ్‌ అనే రసాయన మిశ్రమాన్ని లీటరు నీటిలో 2.5 గ్రాముల చొప్పున కలిపి వేపచెట్టుపైన, బెరడు, మొదలుపై చల్లాలి. లీటరు నీటికి గ్రాము కార్బండిజం చొప్పున కలిపి చెట్టు మొదలులో వేర్లకు వెళ్లేలా పోయాలి. ఈ మందులు చల్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న నీటిలో, గాలిలో కలిసేలా చల్లకూడదు. నీటిలో కలిస్తే అవి తాగిన వారికి ప్రమాదం.

ఈ తెగుళ్ల వల్ల రాష్ట్రంలో 12 శాతం వరకూ చెట్లు పూర్తిగా చనిపోయే అవకాశముంది.  ఎండిపోయిన చెట్లు చలి తగ్గిన తరవాత తిరిగి చిగురిస్తాయి.

రసాయనాలను చల్లితే ఈ తెగుళ్లను అరికట్టవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని