YS Vivekananda Reddy: వివేకా హత్య వెనుక పెద్దలు

‘వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు.  ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’

Updated : 14 Nov 2021 05:09 IST

  వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి చెప్పారు

  వివేకాను చంపమన్నది ఆయనే

  హత్య చేస్తే రూ.40 కోట్లు వస్తాయన్నారు.. రూ.5 కోట్లు నాకు ఇస్తానని.. కోటి అడ్వాన్సు ఇచ్చారు

  న్యాయస్థానం, సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి

ఈనాడు, అమరావతి: ‘వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు.  ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’ అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని నిందితుల్లో ఒకరు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించారు. ఆ సమయంలో యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలు కూడా ఉన్నారని తెలిపారు. అలా 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్య కుట్ర రూపొందిందని చెప్పారు. ‘డ్రైవర్‌గా ఏం సంపాదిస్తావ్‌? ఈ హత్య చెయ్యి. నీ జీవితం సెటిలైపోద్ది’ అంటూ గంగిరెడ్డి తనతో చెప్పాడన్నారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్‌ తనకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడని చెప్పారు. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164(1) ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, సీబీఐకి ఆగస్టు 25న ఇచ్చిన వాంగ్మూలాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అందులోని సంచలన విషయాలివీ..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేశారు..

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శంకర్‌రెడ్డి సరిగా మద్దతివ్వని కారణంగానే ఆయన ఓటమిపాలయ్యారు. తర్వాత వివేకా ఓ రోజు హైదరాబాద్‌ నుంచి తిరిగివస్తూ ముద్దనూరు రైల్వేస్టేషన్‌ వద్ద తనను పికప్‌ చేసుకోమని నాతో చెప్పారు. ఆయన్ను తీసుకొస్తుండగా మార్గమధ్యలో గంగిరెడ్డికి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నారు. మేం వివేకా ఇంటికి వెళ్లేసరికి గంగిరెడ్డి అక్కడ ఉన్నారు. తర్వాత ఆయన్ను వెంటబెట్టుకుని వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇంటికి బయల్దేరారు. దారిలో ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను మీరు మోసం చేశారు. నాకు అన్ని విషయాలు తెలిశాయి’ అంటూ గంగిరెడ్డిపై వివేకా మండిపడ్డారు. అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లాక అక్కడున్న డి.శంకర్‌రెడ్డిని ‘నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు. నన్ను నా కుటుంబసభ్యులకు దూరం చేశావు. నీ అంతు చూస్తా’ అని హెచ్చరించారు. తర్వాత అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలను మీ అందరి కథ చెప్తానంటూ కేకలేశారు. కాసేపటి తర్వాత వివేకా.. గంగిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలను తన కార్యాలయానికి పిలిపించుకుని బాగా తిట్టారు. అప్పటి నుంచి పది రోజులపాటు వారిద్దరూ వివేకాతో మాట్లాడలేదు.

సెటిల్‌మెంట్‌ డబ్బుల్లో వాటా అడిగిన గంగిరెడ్డి

కడపకు చెందిన రాధాకృష్ణమూర్తికి సంబంధించిన ఓ భూమి సెటిల్‌మెంట్‌ వ్యవహారం కోసం వివేకానందరెడ్డి, గంగిరెడ్డిలను వారంలో మూడు నాలుగుసార్లు బెంగళూరు తీసుకెళ్లేవాణ్ని. సెటిల్‌మెంట్‌ పూర్తయ్యాక అందులో రావాల్సిన రూ.8 కోట్లు వివేకా చేతికందాయి. తర్వాత ఓరోజు అక్కడ గెస్ట్‌హౌస్‌లో ఉండగా ఎర్ర గంగిరెడ్డి.. వివేకాను ఆ డబ్బుల్లో వాటా అడిగాడు. దీంతో గంగిరెడ్డిపై వివేకాపై కోపంగా అరిచారు. అప్పటి నుంచి వారిద్దరికీ మాటల్లేవు. కొన్నాళ్ల ముందే యాదటి సునీల్‌ యాదవ్‌ను గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వివేకాకు పరిచయం చేశారు. తర్వాత కొన్నాళ్లపాటు వివేకా, గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి కలిసి కారులో బెంగళూరు వెళ్తుండేవారు. ఈ సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో గంగిరెడ్డి తనను బైపాస్‌ చేస్తున్నాడని అప్పుడే వివేకా గుర్తించారు.

వివేకా ఇంటి తలుపులు తీసింది గంగిరెడ్డే

సునీల్‌ ఆదేశాల మేరకు నేను కదిరి వెళ్లి హత్యకు గొడ్డలి తెచ్చాను. వివేకా ఇంట్లో ఎవరూ లేరని గంగిరెడ్డి చెప్పాడని, అక్కడికి వెళ్దామని సునీల్‌ చెప్పాడు. దీంతో నేను, సునీల్‌ వివేకా ఇంటి దగ్గరకు వెళ్లి మద్యం తాగాం. హత్య జరిగిన రోజు రాత్రి 11.40 గంటలకు వివేకా కారులో ఇంటి లోపలికి వెళ్తుండటం చూశాం. ఉమాశంకర్‌రెడ్డి.. గంగిరెడ్డిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి వివేకా ఇంటి వద్ద దించారు. తర్వాత మా దగ్గరకు వచ్చాడు. ముగ్గురం అర్ధరాత్రి 1.30 గంట వరకూ మద్యం తాగి, బైక్‌పై వివేకా ఇంటి వెనుకకు వెళ్లాం.  ప్రహరీ దూకి లోపలికి వెళ్లాం. అక్కడ వాచ్‌మెన్‌ రంగన్న నిద్రపోతున్నాడు. పక్క వాకిలి తలుపుతట్టగా గంగిరెడ్డి తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి పిలిచారు. ఆ సమయంలో వివేకా మమ్మల్ని చూసి.. ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని గంగిరెడ్డిని ప్రశ్నించాడు. డబ్బుల విషయం మాట్లాడేందుకు వచ్చారంటూ సమాధానమిచ్చాడు.

గొడ్డలితో దాడి చేసింది ఉమాశంకర్‌రెడ్డే

ఆ తర్వాత వివేకా హాల్‌ నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. గంగిరెడ్డి బెంగళూరు భూ సెటిల్‌మెంట్‌ డబ్బుల్లో తనకూ వాటా ఇవ్వాలని ఆయన్ను అడిగాడు. ‘సెటిల్‌మెంట్‌ చేసింది నేనైతే... నీకు వాటా ఎలా ఇస్తాను?’ అని వివేకా ప్రశ్నించారు. ఉమాశంకర్‌రెడ్డి కలగజేసుకుని తమకేమీ సాయం చేయనందున సెటిల్‌మెంట్‌ డబ్బులో వాటా ఇవ్వాలని అడిగాడు. దీంతో వివేకా.. గంగిరెడ్డిపైకి వచ్చి నన్ను సెటిల్‌మెంట్‌ డబ్బులు ఎందుకు అడుగుతున్నావని ప్రశ్నించారు. ఇంతలో సునీల్‌ వివేకాను అసభ్యంగా తిడుతూ ముఖంపై కొట్టాడు. ఆయన వెనక్కిపడిపోయారు. ఉమాశంకర్‌రెడ్డి నా దగ్గరున్న గొడ్డలి తీసుకుని వివేకా తలపై కొట్టడంతో రక్తం వచ్చింది. సునీల్‌ వివేకా ఛాతీపై ఏడెనిమిదిసార్లు బలంగా కొట్టాడు. గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతుకుతుండటంతో వివేకా వారిపై గట్టిగా అరిచాడు. దీంతో నేను ఆయన కుడి అరచేతిపై గొడ్డలితో కొట్టి, గాయపరిచాను. కాసేపటికి వారికి కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. మేం తప్పించుకునేందుకు.. డ్రైవర్‌ ప్రసాదే తనను చంపి పారిపోయాడని, అతణ్ని వదలొద్దంటూ వివేకాతోనే బలవంతంగా ఓ లేఖ రాయించి సంతకం పెట్టించాం. తర్వాత బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి వివేకాను చంపుదామని గంగిరెడ్డి చెప్పటంతో ఆయన్ను తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశాం. ఉమాశంకర్‌రెడ్డి వివేకా తలపై అయిదారుసార్లు గొడ్డలితో దాడి చేయడంతో ఆయన చనిపోయారు. తర్వాత గంగిరెడ్డి మెయిన్‌రోడ్డు వైపు వెళ్తుండగా రంగన్న లేచి ఎవరూ అని అరిచాడు. నేను, సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి ప్రహరీ దూకి బయటపడ్డాం. గొడ్డలిని సునీల్‌కు ఇచ్చేసి ఇంటికొచ్చేశాను. ఉదయం 5గంటలకు సునీల్‌, నేను గంగిరెడ్డి ఇంటికి వెళ్లాం. ‘మీరేం భయపడొద్దు. నేను శంకర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిలతో మాట్లాడాను. వాళ్లు అంతా చూసుకుంటామన్నారు. మీకివ్వాల్సిన మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తా’ అని గంగిరెడ్డి చెప్పాడు. 2019 మార్చి 15న పోలీసులు మమ్మల్ని విచారణకు పిలిపించారు. అప్పుడూ గంగిరెడ్డి నాతో ‘మీరేం భయపడొద్దు. హత్య జరిగిన ప్రదేశాన్ని తుడిపించేశాను. ఆధారాలు లేకుండా చేశాను’ అని చెప్పారు.

సీబీఐకి చెప్పొద్దని ప్రలోభపెట్టారు

ఈ ఏడాది మార్చి 3న సీబీఐ నన్ను దిల్లీకి పిలిపించింది. ఆ సమయంలో శంకర్‌రెడ్డి, అతని సన్నిహితులు భయపురెడ్డి, విద్యారెడ్డి వారి గురించి సీబీఐకి ఏమీ చెప్పొద్దని డబ్బులిస్తామని, జీవితంలో స్థిరపడేలా చేస్తామని నాకు చెప్పారు. దిల్లీలో నా దగ్గరికి భరత్‌యాదవ్‌ను పంపించారు. అతను జరిగే విషయాలన్నీ శంకర్‌రెడ్డికి తెలియజేసేవాడు. దిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను, భరత్‌యాదవ్‌ భయపురెడ్డిని కలిశాం. సునీల్‌ యాదవ్‌.. వివేకాను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఆయన మర్మాంగాలపై దాడి చేశాడని అంతకు ముందు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్నాడు.


వివేకాను చంపేయమని గంగిరెడ్డే చెప్పారు

‘‘2018 డిసెంబరులో వివేకా వద్ద డ్రైవర్‌గా పనిమానేశాను. తర్వాత కూడా సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిని తరచూ కలిసేవాణ్ని. 2019 ఫిబ్రవరి 10న సునీల్‌.. నన్ను, ఉమాశంకర్‌రెడ్డిని గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఓ నల్ల రంగు బొలెరో వాహనం నిలిపి ఉంది. మేం లోపలికి వెళ్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారు. తర్వాత గంగిరెడ్డి నాతో మాట్లాడుతూ..‘బెంగళూరు భూ సెటిల్‌మెంట్‌లో వివేకానందరెడ్డి నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. ఆయన్ను నువ్వు చంపెయ్‌’ అని అన్నారు. ఆయన దగ్గర పనిచేశా, హత్య చేయనన్నాను. ‘నువ్వొక్కడివే కాదు. మేమూ ఉంటాం. దీని వెనుక పెద్దవాళ్లు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డిలు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తా’ అని గంగిరెడ్డి చెప్పాడు. నాలుగు రోజుల తర్వాత హెలిప్యాడ్‌ వద్దకు పిలిపించి సునీల్‌ నాకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడు. మళ్లీ ఇస్తానంటూ రూ.25 లక్షలు అతనే తీసుకున్నాడు. మిగిలిన 75 లక్షలు నా స్నేహితుడు మున్నా వద్ద ఉంచాను. డబ్బులు ఉంచినందుకు రూ.5, 6 లక్షలు కమీషన్‌ ఇస్తానన్నాను.’’

- వాంగ్మూలంలో దస్తగిరి 


ఎవరు ఏంటి?

* ఎర్ర గంగిరెడ్డి: 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు. ఆయనతో పాటే ఉండేవారు.

* గజ్జల ఉమాశంకర్‌రెడ్డి: వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డికి సోదరుడు. పాలడెయిరీ నిర్వహిస్తుంటారు.

* యాదటి సునీల్‌ యాదవ్‌: పులివెందుల మండలం మెట్నంతలపల్లె. జగదీశ్వరరెడ్డి ద్వారా వివేకాకు పరిచయమయ్యారు.

* దస్తగిరి: వివేకా వద్ద 2017, 2018 సంవత్సరాల్లో డ్రైవర్‌గా పనిచేశారు.

* డి.శంకర్‌రెడ్డి: వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అనుచరుడు

* వైఎస్‌ అవినాష్‌రెడ్డి: కడప ఎంపీ

* వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి: వైఎస్‌ కుటుంబీకులు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని