
అర్వింద్కు రైతులు తగిన శాస్తి చేస్తారు: జీవన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ధర్మపురి అర్వింద్కు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ రైతులు తగిన శాస్తి చేస్తారని, పసుపుబోర్డు పేరిట చేస్తున్న మోసాన్ని ఎండగడతారని ప్రభుత్వరంగ సంస్థల శాసనసభా కమిటీ (పీయూసీ) చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘తాను గెలిస్తే ఆరు నెలల్లో పసుపుబోర్డు తెస్తానని నకిలీ బాండ్ పేపర్ను రాసి మోసం చేసి నిజామాబాద్ లోక్సభ ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్పై రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. ఆయనేమో తెరాస వాళ్లు దాడి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. రైతుల నుంచి దృష్టి మళ్లించడానికి సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారు. పంజాబ్, యూపీ మాదిరిగా భాజపాకు సైతం రైతుల నిరసన సెగ తప్పదు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అర్వింద్ బీరాలు పలుకుతున్నారు. ఆర్మూర్లో డిపాజిట్ దక్కకుండా ప్రజలు ఇంటికి పంపిస్తారు’’ అని జీవన్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా తాను పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు.