దేశంపై భాజపా కిరోసిన్ చల్లింది
దేశమంతా భారతీయ జనతా పార్టీ కిరోసిన్ చిలకరించిందని, ఇప్పుడు సంక్షోభం తలెత్తడానికి ఓ చిన్న నిప్పురవ్వ చాలని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో
లండన్ వేదికగా రాహుల్ నిప్పులు
పాకిస్థాన్ తరహా పాలనంటూ ఆగ్రహం
భారత్.. దేశం కాదు, రాష్ట్రాల సమాఖ్య
ప్రాంతీయ పార్టీల కంటే మేం గొప్పేమీ కాదు
పెద్దన్న పాత్ర పోషించాలనుకోవడం లేదు
భారత్దీ ‘ఉక్రెయిన్’ పరిస్థితే..
మన భూభాగంలో చైనా తిష్ఠ వేసిందని మండిపాటు
లండన్: దేశమంతా భారతీయ జనతా పార్టీ కిరోసిన్ చిలకరించిందని, ఇప్పుడు సంక్షోభం తలెత్తడానికి ఓ చిన్న నిప్పురవ్వ చాలని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రాహుల్, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సమ్మేళనంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భాజపా, ఆరెస్సెస్లపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ తరహా పాలన భారత్లో సాగుతోందని విమర్శించారు. అక్కడిలానే ఈడీ, సీబీఐ లాంటి సంస్థలే దేశాన్ని నియంత్రిస్తున్నాయని ఆక్షేపించారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)పై నిప్పులు చెరిగారు. ఆ సంస్థ.. దేశంలోని వ్యవస్థలను కబ్జా చేసిందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలపై దాడి జరుగుతోందని, భారత్లో ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడిందని, ఇది అంతర్జాతీయ సమాజానికి ఏమాత్రం క్షేమకరం కాదని రాహుల్ హెచ్చరించారు. భారత్ ‘ఆత్మ’ పెనుప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రాలపై అణచివేత
రాజ్యాంగం ప్రకారం.. భారత్ ఓ దేశం కాదని, రాష్ట్రాల సమాఖ్య అని, ఈ విషయాన్ని కేంద్రం గుర్తించకపోవడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాలపై తీవ్ర అణచివేత సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వ్యవస్థలన్నీ రాష్ట్రాల మధ్య చర్చలు, సంవాదంతోనే ఏర్పడ్డాయని, ఇప్పుడు ఆ సంవాదమే ఆగిపోయిందని, వ్యవస్థలను ఓ సంస్థ కబ్జా చేసిందని అన్నారు. దీంతో రాష్ట్రాలు మాట్లాడలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
భారతదేశాన్ని ఓ భౌగోళిక ప్రాంతంగా, బంగారు చిలకగా భాజపా భావిస్తోందని రాహుల్ అన్నారు. బంగారు చిలక ప్రయోజనాలను అందరికీ సమానంగా పంచకుండా కొందరికే అధికంగా దోచిపెడుతోందని ఆరోపించారు.
తప్పుగా అర్థం చేసుకున్నారు
ప్రాంతీయ పార్టీలకు భాజపాతో పోరాడే భావజాలం లేదని ఉదయ్పుర్లో జరిగిన చింతన శిబిరంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ వివరణిచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీలకంటే కాంగ్రెస్ గొప్పేమీ కాదని, భాజపాపై పోరాటంలో తమ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య జాతీయస్థాయిలో భావజాల పోరాటం సాగుతోందని తెలిపారు.
రష్యాలానే.. చైనా కూడా
భారత్ పరిస్థితిని ఉక్రెయిన్తో పోల్చారు రాహుల్. ఉక్రెయిన్లోని ప్రాంతాల్లో రష్యా ఎలా తిష్ఠ వేసిందో, చైనా కూడా లద్ధాఖ్, డోక్లాంలో గుడారాలు వేసుకుందని, అయినా మోదీ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోందని ఎద్దేవా చేశారు. పాంగాంగ్ సరస్సుపై ఇటీవల చైనా వంతెన నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు. సరిహద్దుల్లో సమస్య ఉందని గుర్తించడానికే కేంద్రం ఇష్టపడటం లేదని, దీనిపై చర్చకు ముందుకు రావడం లేదని అన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీసు పూర్తిగా మారిపోయిందని.. అందులోని అధికారులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తనకు కొంతమంది అధికారులు చెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విపక్ష నాయకులు సీతారాం ఏచూరి (సీపీఎం), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు