Corona: కొవిడ్‌ టీకాకు వెళ్తే.. ‘రేబిస్‌’ ఇచ్చారు!

కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటు వ్యాక్సిన్‌ ఇచ్చిన ఘటన నల్గొండ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో

Updated : 30 Jun 2021 12:18 IST

నల్గొండ జిల్లా కట్టంగూరు పీహెచ్‌సీలో ఘటన

కట్టంగూరు, న్యూస్‌టుడే: కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటు వ్యాక్సిన్‌ ఇచ్చిన ఘటన నల్గొండ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకుని ఆమె మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లారు. పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్‌ భవనంలో కొవిడ్‌ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పీహెచ్‌సీకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు నర్సు యాంటి రేబిస్‌ వ్యాక్సిన్‌ను వేసిందని.. కొవిడ్‌ టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకూ అదే సిరంజీతో యాంటి రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిందని ఆమె ఆరోపించారు. ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా ‘బాధితురాలు కరోనా టీకా బ్లాక్‌లోకి కాకుండా, యాంటిరేబిస్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయలేదు. టీటీ ఇంజక్షన్‌ ఇచ్చాం. దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని