Bathukamma on Burj Khalifa: ఎడారిలో విరబూసిన తంగేడు పూలు

ఎడారి దేశంలో తంగేడువనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక వైభవం ఖండాంతరాలను దాటింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా సౌధం తెరపై

Updated : 03 Jan 2024 16:01 IST

దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా తెరపై బతుకమ్మ

రెండు దఫాలుగా మూడు నిమిషాల వీడియో ప్రదర్శన

ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వీక్షణ

ఇదో చారిత్రక ఘట్టం: ఎమ్మెల్సీ కవిత

ఈనాడు, హైదరాబాద్‌: ఎడారి దేశంలో తంగేడువనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక వైభవం ఖండాంతరాలను దాటింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా సౌధం తెరపై బతుకమ్మ ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి పూలపండగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 9.40 గంటలకు, మళ్లీ 10.40 గంటలకు రెండు దఫాలుగా 3నిమిషాల నిడివి గల వీడియోను బుర్జ్‌ ఖలీఫా తెరపై ప్రదర్శించగా... ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వీక్షించారు. తెలంగాణ పటం, సీఎం కేసీఆర్‌ చిత్రపటం, జైహింద్‌, జై తెలంగాణ, జై కేసీఆర్‌ అనే నినాదాలను సైతం ప్రదర్శించారు. ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో రూపొందించిన  పాటతో పాటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్‌ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రవాసులు భావోద్వేగాలకు గురయ్యారు. జై తెలంగాణ, జై కేసీఆర్‌ నినాదాలతో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత, పలువురు ప్రవాస తెలంగాణ మహిళలతో కలిసి బుర్జ్‌ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడారు.

చరిత్రలో నిలిచిపోతుంది: కవిత

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బతుకమ్మను బుర్జ్‌ ఖలీఫా తెరపై ప్రదర్శించడం తెలంగాణతో పాటు దేశానికి సైతం గర్వకారణమన్నారు. బతుకమ్మ ప్రస్థానంలో ఇదొక చారిత్రక ఘట్టమని, ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించదగిన విషయమని అన్నారు. దీనికి సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండగను గత పుష్కర కాలంగా ఏటా దేశవిదేశాల్లో పెద్ద ఎత్తున జరుపుతున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ జాగృతిని ప్రారంభించి.. బతుకమ్మ పండగ ద్వారా ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేశాం. బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు బుర్జ్‌ ఖలీఫాను ఎంచుకున్నాం. ఇకపై ఏటా సరికొత్తగా బతుకమ్మ పండగ నిర్వహిస్తాం. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతంలో, ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది చిత్రీకరించిన బతుకమ్మ పాట అందరినీ అలరించింది. దాన్ని ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంతో సంబురాలు మిన్నుముట్టాయి’ అని కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు షకీల్‌ అహ్మద్‌, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్‌, సంజయ్‌, బిగాల గణేశ్‌ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్‌ సాగర్‌, దాస్యం విజయ్‌ భాస్కర్‌ తదితరులు తెలంగాణ నుంచి హాజరయ్యారు. అంతకుముందు కవితకు దుబాయ్‌ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. బతుకమ్మ సంబురాలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆమె చేస్తున్న కృషిని అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని