పాజిటివిటీ 10% దాటితే మినీ లాక్‌డౌన్‌లు

కరోనా వైరస్‌ విశృంఖల వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు పదును పెట్టింది. గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటిన; ఆక్సిజన్‌, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ

Updated : 26 Apr 2021 07:09 IST

  కొవిడ్‌ కట్టడికి కఠిన ఆంక్షలు
  14 రోజులపాటు వీటిని కొనసాగించాలి
  రాష్ట్రాలకు కేంద్రం తాజా ఉత్తర్వులు

ఈనాడు, దిల్లీ: కరోనా వైరస్‌ విశృంఖల వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు పదును పెట్టింది. గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటిన; ఆక్సిజన్‌, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్‌ తరహాలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ప్రాంతాలను పట్టణాలు, నగరాలు, జిల్లాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు, మున్సిపల్‌ వార్డులు, పంచాయతీ ప్రాంతాలుగా వర్గీకరించి కఠిన నిబంధనలతో స్థానికంగా కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయాప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు, అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది.

ఇవీ మార్గదర్శకాలు

* అత్యవసరం కాని కార్యకలాపాలను రాత్రిపూట పూర్తిగా నిషేధించాలి.
* సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత, ఉత్సవ సంబంధమైన సమూహాలు, సమావేశాలను నిషేధించాలి. అన్ని రకాల షాపింగ్‌ కాంప్లెక్సులు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా సముదాయాలు, జిమ్‌లు, స్పాలు, ఈత కొలనులు, మతపరమైన స్థలాలు పూర్తిగా మూసేయాలి.
* వివాహాలకు 50 మంది వరకు, అంత్యక్రియలు/కర్మకాండలకు 20 మంది వరకు మాత్రమే అనుమతివ్వాలి.
* ప్రజా రవాణా (రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, క్యాబ్‌లు) గరిష్ఠంగా 50% సామర్థ్యంతోనే నడవాలి. రాష్ట్రాల్లో అంతర్గతంగా లేదా రాష్ట్రాల మధ్య రాకపోకలపైనా.. అత్యవసర సరకుల రవాణాపైనా ఆంక్షలొద్దు.
* వైద్య, పోలీసు, అగ్నిమాపక సేవలు, బ్యాంకులు, విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్య సేవలు కొనసాగడానికి అవకాశం కల్పించాలి.
* ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ గరిష్ఠంగా 50% సామర్థ్యంతో పనిచేయాలి. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారికి ఎప్పటికప్పుడు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలు 10% పాజిటివిటీ మించిన ప్రాంతాలన్నింటినీ ఇందులోకి తీసుకొచ్చి కట్టడి చర్యలు చేపట్టాలి. ఈ ఆంక్షలను 14 రోజులపాటు కొనసాగించాలి. ఏదైనా ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ ప్రాంతంగా ప్రకటించే ముందు బహిరంగంగా వెల్లడించాలి. కొవిడ్‌ నిబంధనలు (మాస్క్‌, చేతుల శుభ్రత, భౌతికదూరం) అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలి.

కట్టడిలో సమాజ సేవలు ఉపయోగించుకోవాలి
కట్టడి చర్యల అమలుకు మాజీ సైనికోద్యోగులు, నెహ్రూ యువకేంద్ర, ఎన్‌ఎస్‌ఎస్‌ కేంద్రాలకు చెందిన సభ్యుల సేవలను ఉపయోగించుకోవాలి.
* ఎక్కువ కేసులున్న ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరిశీలించడంతోపాటు, తగిన సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలి. అనుమానం ఉన్నవారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించాలి. లక్షణాలున్నప్పటికీ ఇందులో నెగెటివ్‌ వచ్చిన వారికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలి.
* ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రైల్వే కోచ్‌లు, తాత్కాలిక ఆసుపత్రులన్నింటినీ ఉపయోగించుకోవాలి.
* చికిత్స ప్రొటోకాల్‌ పరిధిలో ఉన్నవారిని మాత్రమే హోం ఐసొలేషన్‌లో ఉండేందుకు అనుమతివ్వాలి. వారికోసం ప్రత్యేకంగా ఒక కిట్‌, నిబంధనలను రూపొందించి అమలు చేయాలి.
అధిక ముప్పు ఉన్నవారిపై ప్రత్యేక పర్యవేక్షణ
హైరిస్క్‌ కేసుల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ పెట్టి చర్యలు చేపట్టాలి.
* కొవిడ్‌ ఆసుపత్రుల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్‌ జిల్లా అధికారులకు అప్పగించాలి. అవసరమైన సంఖ్యలో ఆంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. బాధితులకు ఆక్సిజన్‌ అందించేటప్పుడు కేంద్ర మార్గదర్శకాలను అనుసరించాలి. నిబంధనలకు అనుగుణంగానే రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌ లాంటి మందులు ఇవ్వాలి.
* ఆసుపత్రులవారీగా మరణాలను రోజువారీగా ఇన్సిడెంట్‌ కమాండర్‌/జిల్లా కలెక్టర్‌/ మున్సిపల్‌ కమిషనర్లు విశ్లేషించాలి. అర్హులైన వారందరికీ 100% వ్యాక్సినేషన్‌ అమలుకు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
* కఠిన ఆంక్షలపై ప్రజలను అప్రమత్తం చేయాలి. కంటెయిన్‌మెంట్‌ను పెద్దస్థాయిలో ప్రకటించే ముందు ప్రజలు నిత్యావసరాలు సమకూర్చుకొనేందుకు తగిన సమయం ఇవ్వాలి. వైరస్‌ సోకిన వారు స్వయంగా వెల్లడించేలా విస్తృత ప్రచారం, హెచ్చరిక సంకేతాలు ఇవ్వండి.
పరీక్షలు, సౌకర్యాలపై విస్తృత ప్రచారం
పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి? వైద్య సౌకర్యాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? అంబులెన్స్‌ల సమాచారంపై విస్తృత ప్రచారం చేయాలి. వేగంగా సమాచారం అందించడానికి వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలి. అవసరమైన వారికి వైద్యసేవలు అందించడంలో జాప్యం లేకుండా చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని