Telugu Academy: తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో గోల్‌మాల్‌ జరిగింది. యూబీఐలో తాము డిపాజిట్‌ చేసిన రూ.43 కోట్లు బ్యాంక్‌లో లేవని అకాడమీ

Updated : 29 Sep 2021 09:08 IST

బ్యాంక్‌లో ఉన్న రూ.43 కోట్లలో మాయాజాలం

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో గోల్‌మాల్‌ జరిగింది. యూబీఐలో తాము డిపాజిట్‌ చేసిన రూ.43 కోట్లు బ్యాంక్‌లో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారని యూబీఐ ఉన్నతాధికారులు సోమవారం పోలీసులకు తెలిపారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా..వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయని తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 21న డిపాజిట్‌ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్‌ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అధికారిక పత్రాలు చూశాకే  నగదు ఇచ్చాం: బ్యాంకు అధికారులు

‘‘గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకూ తెలుగు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్‌ చేశారు. అనంతరం ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్‌డ్రా చేసుకుని హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు డిపాజిట్‌ చేశారు. రూ.5.70 కోట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలుగు అకాడమీ ఖాతాకు బదిలీ చేశారు. మిగిలిన రూ.26 కోట్లు తెలుగు అకాడమీ అధికారులు విత్‌డ్రా చేసుకున్నారు. సరైన అధికారిక పత్రాలు చూసిన తర్వాతే నగదు ఇచ్చాం’’ అని బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. ఈ వివాద నేపథ్యంలో బదిలీ అయిన సొమ్ము ఎవరూ విత్‌డ్రా చేయకుండా చూడాలని ఒక సహకార బ్యాంకుకు లేఖ రాయగా.. కేవలం రూ.5 లక్షలే ఉన్నాయని చెప్పారని యూబీఐ అధికారులు పోలీసులకు వివరించారు. బ్యాంకు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం డిపాజిట్‌ సొమ్ము ఆగస్టులోనే వేరే చోటుకు మారింది. అంటే అప్పుడు సమర్పించిన డిపాజిట్‌ పత్రాలు కానీ లేదా సెప్టెంబరు 21న పంపినవి కానీ నకిలీవి అయి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు అధికారులేమో సరైన అధికారిక పత్రాలు చూశాకే డిపాజిట్‌ సొమ్ము చెల్లించామని ఎంతో విస్పష్టంగా చెబుతున్నారు. విత్‌డ్రా చేసింది ఎవరో తేలాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని