Health: ముప్పు ‘మద్య’ ఉన్నట్టే

మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని మరోసారి వెల్లడైంది. మద్యపానంతో కాలేయమే కాదు.. నోరు, పెదవులు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల బారినపడే ప్రమాదం కూడా ఉందని తాజాగా ‘ఆక్స్‌ఫర్డ్‌’ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం

Updated : 11 Feb 2022 06:05 IST

  మద్యంతో కాలేయంతో పాటు ఇతర అవయవాలకూ క్యాన్సర్‌ సోకే ప్రమాదం

  ధూమపానం కూడా తోడైతే మరింత హెచ్చు

  ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని మరోసారి వెల్లడైంది. మద్యపానంతో కాలేయమే కాదు.. నోరు, పెదవులు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల బారినపడే ప్రమాదం కూడా ఉందని తాజాగా ‘ఆక్స్‌ఫర్డ్‌’ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. దీనికి ధూమపానం వంటి దురలవాట్లు, జీవనశైలి అవలక్షణాలు కూడా జతకూడితే ముప్పు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా మద్యం కారణంగా ఏటా 30 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు ‘ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్‌’ అధ్యయనం తెలిపింది. ఇందులో 4 లక్షలు క్యాన్సర్‌ కారణంగా జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. 1.50 లక్షలమంది చైనీయులపై ఈ అధ్యయనం చేశారు. ఇందులో 60 వేల మంది పురుషులు, 90 వేలమంది మహిళలు ఉన్నారు. 11 ఏళ్ల పాటు వీరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఈ అధ్యయన ఫలితాలు ఇటీవలే ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌’లో ప్రచురితమయ్యాయి. పాశ్చాత్య దేశాలతో పోల్చితే.. ఆసియా ఖండంలోని జనాభాలో జన్యుపరమైన మార్పులున్నాయనీ, అందుకే ఆసియన్లలో మద్యం కారక ముప్పు ఎక్కువేనని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్‌ కోరల్లో చిక్కుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ఏటా 1000కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశవ్యాప్తంగా 1,18,044 క్యాన్సర్‌ కేసులు నమోదు కాగా.. 64,620 మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్లలో.. పురుషుల్లో 6 శాతం.. మహిళల్లో 0.5-1 శాతం వరకూ మద్యం కారణంగా సంభవిస్తున్నవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


ఎలా ప్రమాదకరంగా మారుతోంది?

ద్యం శరీరం లోనికి వెళ్లగానే.. జీవక్రియలో భాగంగా అది విచ్ఛినమై, ‘ఎసిటేల్‌ డీహైడ్‌’గా ఉత్పరివర్తనం చెందుతుంది. తద్వారా అతి ప్రమాదకర ‘కార్సినోజెనిక్‌’ రసాయనాలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా అనేక రకాల అవయవాలపై దాని ప్రభావం పడి నేరుగా క్యాన్సర్‌కు దారితీస్తుంది. పైగా మద్యపాన ప్రియుల్లో అత్యధికుల్లో అనుబంధంగా జీవనశైలి దురలవాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ధూమపానం, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం తదితరాలు. ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యకరమైన పోషక విలువలను శరీరం గ్రహించే తత్వం కోల్పోతుంది. దీనివల్ల కూడా క్యాన్సర్‌ త్వరగా రావడానికి అవకాశాలెక్కువ ఉంటాయి.


తక్కువ తీసుకున్నా ముప్పు ఎక్కువే

మద్యం వల్ల క్యాన్సర్‌ వస్తుందని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. చాలామందిలో మద్యం ఎంత తీసుకుంటే మంచిది? అనే సందేహం ఉంటుంది. నిజానికి కొద్ది మోతాదులో తీసుకున్నా ముప్పే.  తీసుకోకపోవడమే మంచిది. మద్యం ఎక్కువగా తీసుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా రొమ్ము క్యాన్సర్‌కు దారితీస్తుంది.

- డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప, ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు, బసవ తారకం క్యాన్సర్‌ ఆసుపత్రి


ఆసియన్లకు మద్యాన్ని తట్టుకునే శక్తి తక్కువ

పాశ్చాత్యదేశాలతో పోల్చితే ఆసియన్లకు మద్యాన్ని తట్టుకునే శక్తి తక్కువ అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. భారత్‌లో గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే క్యాన్సర్లు ఇప్పుడు 30 ఏళ్లలోనే కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల కంటే తక్కువ మోతాదులోనే మద్యాన్ని తీసుకున్నా భారత్‌లో క్యాన్సర్ల బారినపడే వారి సంఖ్య ఎక్కువ. ఇందుకు జన్యుపరమైన కారణాలున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. మద్యం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పన్నమై, మన డీఎన్‌ఏపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. హెపటైటిస్‌ బి, సి వైరస్‌ వ్యాధులతో బాధపడుతున్నవారు మద్యం తీసుకుంటే చాలా త్వరగా కాలేయ క్యాన్సర్‌ బారినపడే ప్రమాదముంది.

- డాక్టర్‌ రాజేశ్‌గుప్తా, సీనియర్‌ హెపటాలజిస్ట్‌, ఏఐజీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని