Huzurabad By Election: కమలంలో కొత్త జోష్‌

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ సాధించిన విజయం పార్టీ నాయకులు, క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఈటల రాజేందర్‌ వ్యక్తిగత ప్రతిష్ఠ, ఓటర్ల సానుభూతితో పాటు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్‌లో మకాం వేయడం, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలూ పార్టీకి కలిసివచ్చాయి.

Updated : 24 Sep 2022 15:10 IST

ఫలించిన వ్యూహాలు.. వరించిన విజయం
నాలుగు నెలలు జనంతో మమేకమైన ఈటల
ఈనాడు - హైదరాబాద్‌

సంబరాల్లో భాగంగా విజయ సంకేతం చూపుతున్న బండి సంజయ్‌, డి.కె. అరుణ, పార్టీ శ్రేణులు

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ సాధించిన విజయం పార్టీ నాయకులు, క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఈటల రాజేందర్‌ వ్యక్తిగత ప్రతిష్ఠ, ఓటర్ల సానుభూతితో పాటు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్‌లో మకాం వేయడం, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలూ పార్టీకి కలిసివచ్చాయి.

ఈటలను పార్టీలో చేర్చుకోవడం దగ్గరి నుంచి ఎన్నికల ప్రచారం వరకు భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆయన జూన్‌ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. 14న కాషాయకండువా కప్పుకొన్నారు. ఆ తర్వాత నియోజకవర్గానికి వెళ్లి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మోకాలి శస్త్రచికిత్సతో కొద్దిరోజులు విరామం తీసుకున్నారు. జూన్‌ మూడో వారం నుంచి దాదాపు నాలుగు నెలలకుగాపైగా ప్రజల్లోనే ఉన్నారు. మరోవైపు నియోజకవర్గానికి, మండలాలకు ఇన్‌ఛార్జులను నియమించిన భాజపా.. పోలింగ్‌ బూత్‌లు, శక్తికేంద్రాల వారీగా పార్టీ శ్రేణుల్ని మోహరించింది. దాదాపు 1,200 మంది కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల పార్టీలో చేరిన కొద్ది రోజులకే పాత, కొత్త క్యాడర్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన బండి సంజయ్‌ వారి మధ్య సమన్వయం చేశారు.

బలమైన నేత..భావోద్వేగాల కలబోత
తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పోలిస్తే ఈటల బలమైన నేత. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. తన వెంట ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్ని తెరాస ఆకర్షించినా ధైర్యం కోల్పోలేదు. ‘కేసీఆర్‌ అహంకారానికి, హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం’, ‘నేను మీ బిడ్డను.. చంపుకుంటారో, సాదుకుంటారో.. మీ ఇష్టం’ అంటూ ఓటర్లపై భావోద్వేగ అస్త్రాన్ని సంధించారు. పార్టీ అధ్యక్షుడు  సంజయ్‌, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈటల సతీమణి జమున మహిళల మద్దతు కూడగట్టేందుకు ఊరూరూ తిరిగారు. ఇవన్నీ ఆయన విజయానికి బాటలు వేశాయి.

భాజపాకు కలిసొచ్చిన ఉప ఎన్నికలు
శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం గెలిచిన కమలదళానికి ఉప ఎన్నికలు కలిసివచ్చాయి. గతేడాది దుబ్బాకలో, ఇప్పుడు హుజూరాబాద్‌లో విజయంతో అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ స్థానంలో రాజాసింగ్‌ ఒక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎంపీలు విజయం సాధించారు. నాటినుంచి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్‌, తెరాస, తెదేపాల నుంచి పలువురు నేతల్ని చేర్చుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు విజయం సాధించగా.. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో సీట్లను భాజపా గెలుచుకుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ పట్టభద్రుల సిట్టింగ్‌ సీటును కోల్పోగా.. నల్గొండలో నాలుగో స్థానానికి పరిమితమైంది. నాగార్జునసాగర్‌ ఉపపోరు, పురపాలక ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఈ తరుణంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రూపంలో వచ్చిన అవకాశాన్ని కమలదళం అందిపుచ్చుకుంది. ఈటల రాజేందర్‌ విజయంతో వచ్చిన ఉత్సాహంతో 2023 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తోంది.

మిన్నంటిన సంబురాలు
హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ విజయం సాధించడంతో హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. నృత్యాలతో హోరెత్తించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం అన్ని మండల కేంద్రాల్లో విజయోత్సవాలు జరపాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.


బెదిరింపులకు లొంగని ప్రజలకు వందనం: కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: హుజూరాబాద్‌ ప్రజలు చరిత్ర తిరగరాశారని.. నీతికి, నిజాయతీకి, న్యాయానికి మద్దతుగా నిలిచారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘హుజూరాబాద్‌లో భాజపా గెలుపు ప్రజల విజయం. హుజూరాబాద్‌ హీరోలు ప్రజలు, ఈటల రాజేందరే. వ్యక్తిత్వం కూడా ఈటల గెలుపునకు తోడైంది. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచిపోతాయి. 40 ఏళ్లలో ఇలాంటి ఎన్నికలను చూడలేదు. ఉప ఎన్నిక కోసం పాలక పార్టీ రూ.వేల కోట్ల పథకాలు పెట్టినా.. డబ్బు, పథకాలు, బెదిరింపులకు లొంగకుండా ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నందుకు హుజూరాబాద్‌ ప్రజలకు వందనం(సెల్యూట్‌) చేస్తున్నా. అహంకారం, అవినీతిని వారు వ్యతిరేకించారు’’ అని అన్నారు.


అమిత్‌షా హర్షం
హుజూరాబాద్‌లో విజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సంతోషం వ్యక్తంచేశారు. రౌండ్ల వారీగా వస్తున్న ఆధిక్యం వివరాల్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, అమిత్‌షాకు బండి సంజయ్‌ ఎప్పటికప్పుడు పంపించారు. సంజయ్‌కు ఉదయం ఫోన్‌ చేసిన అమిత్‌షా ఫలితాల సరళిపై ఆరా తీశారు. ఆ తర్వాత మరోసారి ఫోన్‌ చేసి అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని