Huzurabad By Election: హు‘జోరు’ పోలింగ్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటు చైతన్యం వెల్లువెత్తింది. యువత సహా 90 ఏళ్ల వృద్ధుల వరకు ఓటుకు జైకొట్టారు. విదేశాల నుంచి వచ్చి కూడా పలువురు ఓటేశారు. పోలింగ్‌ ఉదయం మందకొడిగా సాగగా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నుంచి సాయంత్రం వరకు

Updated : 09 Aug 2022 12:35 IST

 ఉపఎన్నికలో 86.57 శాతం నమోదు
2018 కంటే 2.5 శాతం పెరిగిన ఓటింగ్‌
అక్కడక్కడా దాడులు, వాగ్వాదాలతో ఉద్రిక్తత
ఫలితం తేలేది 2న..

హుజూరాబాద్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద గుర్తింపు కార్డులను చూపుతున్న ఓటర్లు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌; ఈనాడు, హైదరాబాద్‌, వరంగల్‌; కమలాపూర్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటు చైతన్యం వెల్లువెత్తింది. యువత సహా 90 ఏళ్ల వృద్ధుల వరకు ఓటుకు జైకొట్టారు. విదేశాల నుంచి వచ్చి కూడా పలువురు ఓటేశారు. పోలింగ్‌ ఉదయం మందకొడిగా సాగగా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ఎక్కువగా కదలివచ్చారు. కమలాపూర్‌ మండలం బీంపల్లిలో కొవిడ్‌ సోకిన ఒక మహిళ పీపీఈ కిట్‌ ధరించి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు మినహా శనివారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. హోరాహోరీ పోరులో  ఈవీఎంలలో ఓటర్లు తమ తీర్పుని నిక్షిప్తం చేశారు. ఎవరికి వారే పార్టీ శ్రేణుల ఎదుట విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 84  శాతం పైగా పోలింగ్‌ నమోదవగా ఈ సారి అది 86.57 శాతంగా ఉంది. 2.5 శాతం పైగా పెరుగుదల నమోదైంది. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఆర్‌.డిగ్రీ కళాశాలలో ఓట్ల  లెక్కింపు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ చెప్పారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోను, అంతక్రితం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి కమలాపూర్‌లోనూ విలేకరులతో మాట్లాడారు. డబ్బు పంపకాలు, ప్రలోభాలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 85 ఫిర్యాదులు వచ్చాయని, చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జమ్మికుంటలో తెరాస, భాజపా నేతల బాహాబాహీ

పరస్పరం దాడులు..
పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తెరాస, భాజపా శ్రేణుల వాగ్వాదాలతో ఉద్రిక్తతలు తలెత్తాయి. వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో నాయకులు, కార్యకర్తలు పరస్పరం భౌతిక దాడులకు దిగారు. భాజపా నాయకురాలు, కరీంనగర్‌ జిల్లా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ వాహనాన్ని తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. స్థానికురాలు కాని ఆమె ఎందుకొచ్చారని వాహనంపై దాడికి ప్రయత్నించాయి. భాజపా నాయకులు ప్రతిఘటించారు. పోలీసుల చొరవతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే మండలంలోని గన్ముకుల పోలింగ్‌ బూత్‌లోకి వెళ్తున్న తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని భాజపా నాయకులు అడ్డుకుని ఘెరావ్‌ చేశారు. వెళ్లిపోయేవరకు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి వచ్చిన తెరాస నాయకుడు, గజ్వేల్‌ ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ భర్త మాదాసు శ్రీనివాస్‌ వాహనాన్ని స్థానిక భాజపా నాయకులు అడ్డుకొని పంపించారు. వీణవంక మండలం కోర్కల్‌లో తెరాస నాయకులు బూత్‌లో ప్రచారం చేస్తున్నారని భాజపా నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

డబ్బుల పంపిణీపై ఆందోళనలు
జమ్మికుంటలోని ఓ వార్డు కౌన్సిలర్‌ ఇంట్లో డబ్బులు దాచిపెట్టారని, స్థానికేతరుడైన ఓ ఎమ్మెల్యే ఇక్కడే మకాం వేశారని ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు స్థానికేతరులైన కింది స్థాయి నాయకులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్‌ పట్టణంలోని గాంధీనగర్‌, ప్రతాపవాడ, కిందివాడలో కొంతమంది ఓటర్లు డబ్బులు తమకు రాలేదని.. వచ్చాకే ఓటేస్తామని భీష్మించుకు కూర్చున్నారు. సాయంత్రం వేళ వారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో కొందరు డబ్బులు పంపిణీ చేస్తుండగా ఎదుటి పార్టీ వాళ్లు పట్టుకున్నారు. హుజూరాబాద్‌ మండలం ఇప్పల నర్సింగాపూర్‌లో డబ్బులు పంపిణీ చేస్తున్న సిద్దిపేటకు చెందిన నాయకులను అడ్డుకుని వారిని గ్రామం నుంచి పంపించేశారు. కమలాపూర్‌ మండలంలోని గూనిపర్తి గ్రామంలో స్థానికేతరుడైన ప్రజాప్రతినిధి భర్త డబ్బులు పంచుతుండగా ప్రత్యర్థి పార్టీ నాయకులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. పట్టుబడిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలుచోట్ల స్వల్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి.


కమలాపూర్‌లో ఈటల.. హిమ్మత్‌నగర్‌లో గెల్లు ఓటు

 కమలాపూర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న ఈటల దంపతులు  

కమలాపూర్‌లో సతీసమేతంగా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తన సతీమణితో కలిసి వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఓటు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కమలాపూర్‌ మండలంలో ఈటల వెంట ఉన్న వాహన శ్రేణిలో రెండింటికి అనుమతి లేదని గుర్తించిన పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలను కరీంనగర్‌లోని ఎస్సార్‌ డిగ్రీ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు.  

వీణవంకలో ఓటేసి వస్తున్న తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌


గొప్ప విజయం సాధించబోతున్నాం: హరీశ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటర్లు చైతన్యాన్ని చాటారని... కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం శనివారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగు నెలలుగా పార్టీ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని వివరిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ మార్గదర్శకంతో...హుజూరాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించబోతున్నామని పేర్కొన్నారు. 


మేమే గెలవబోతున్నాం: సంజయ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అధికార తెరాస మభ్యపెట్టేందుకు ఎంతగా ప్రయత్నించినా ఓటర్లు చైతన్యవంతంగా ఆలోచించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. న్యాయం, భాజపా వైపు, ఈటల రాజేందర్‌ పక్షాన నిలిచారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల సమాచారం ప్రకారం తమ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందన్నారు. ‘‘కేసీఆర్‌ అహంకారానికి, హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు సదాలోచనతో భాజపాను ఆదరించారు. తెరాస అప్రజాస్వామికంగా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించింది. అధికారపక్షం ఎంత డబ్బు ఖర్చుపెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు ధర్మంవైపు నిలిచారు’’ అని వ్యాఖ్యానించారు. 


కేసీఆర్‌ కుట్రలు ఇక్కడ చెల్లలేదు: ఈటల 

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ప్రజలు అధికారపార్టీ ప్రలోభాలకు లొంగకుండా చరిత్రను తిరగరాశారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలో రూ.వందల కోట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. ‘నా ముఖం అసెంబ్లీలో కనిపించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక రకాలుగా కుట్రలు చేసినా ఆయన పంతం నెరవేరలేద’ని అన్నారు. 


పెరిగిన పోలింగ్‌ ఎవరికి లాభం? 

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: హుజూరాబాద్‌లో పోలింగ్‌ అనంతరం అభ్యర్థుల విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్షేత్రస్థాయి నుంచి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్న వివరాలతో మండలాల వారీగా ఓటరు నాడిని అంచనా వేస్తూ నేతలు లెక్కల్లో మునిగిపోయారు. పలువురు నేతలు లోపల ఆందోళన ఉన్నా బయటకు మాత్రం గెలుపు ధీమా కనబరుస్తున్నారు. గతానికి భిన్నంగా పెరిగిన పోలింగ్‌ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుందనే చర్చ సాగుతోంది.  18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారే 1,15,873 మంది ఉండగా.. వీరిలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని