Medicine: కలల చదువు కోసం ఖండాంతరాలకు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతీయ విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ కల్లోలం రేపుతోంది. వైద్యవిద్య అభ్యసించడమే లక్ష్యంగా మన విద్యార్థులు ఖండాంతరాలు దాటుతున్నారు.
విదేశాల్లో వైద్యవిద్యపై ఆసక్తి
తెలుగు రాష్ట్రాల నుంచే ఏటా 3 వేల మందికి పైగా పయనం
ఎఫ్ఎంజీఈలో మాత్రం 80 శాతం మంది వైఫల్యం
ఈనాడు, హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతీయ విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ కల్లోలం రేపుతోంది. వైద్యవిద్య అభ్యసించడమే లక్ష్యంగా మన విద్యార్థులు ఖండాంతరాలు దాటుతున్నారు. ఒక్క ఉక్రెయిన్లోనే వేల మంది చదువుతున్నారు. తమ కలలను యుద్ధం కల్లలు చేస్తుందేమోనని వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మన దేశంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అయిదేళ్లకయ్యే రుసుములో మూడో వంతుతోనే చదివే వెసులుబాటు ఉండడం.. విదేశీ వైద్యవిద్యకు ప్రాధాన్యమివ్వడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఏటా మన దేశం నుంచి చైనా, ఉక్రెయిన్, నేపాల్, ఫిలిప్పీన్స్, రష్యా, హంగరీ, బల్గేరియా, కరేబియన్ దీవులు, కిర్గిస్థాన్ తదితర దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 20వేలకు పైగానే ఉంటోందని అంచనా. వీరిలో తెలుగు రాష్ట్రాలవారు 3,000 మంది వరకూ ఉంటారని తెలుస్తోంది. అంతకుముందుతో పోలిస్తే రెండేళ్లుగా కొవిడ్ కారణంగా విదేశాల్లో వైద్యవిద్య కోసం కన్సల్టెన్సీలను సంప్రదించేవారి సంఖ్య దాదాపు 70 శాతానికి పైగా తగ్గిందని తెలుస్తోంది. ఈ ఏడాది(2021-22) మాత్రం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో గతంలోలానే విద్యార్థులు విదేశాలకు వెళ్లారని కన్సల్టెన్సీ నిర్వాహకులు డా.సతీశ్ తెలిపారు.
ఖర్చు తక్కువే..
మన దేశంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయడానికి కనీసం రూ.75-85 లక్షలకు పైగానే ఖర్చవుతోంది. తెలంగాణలో 23 ప్రైవేట్ వైద్య కళాశాలలుండగా.. ఏడు మినహా మిగిలిన వాటిలో యాజమాన్య కోటాకు ఏడాదికి రూ.11.55 లక్షలు, ప్రవాస భారతీయ కోటాకు రూ.23.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఏడు కళాశాలల్లో ఇటీవల రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ పెంచారు. దీంతో అయిదేళ్ల వైద్యవిద్య కోర్సుకు అదనపు ఖర్చులతో కలిపి రూ.కోటికి పైగా వెచ్చించాల్సి వస్తోంది. విదేశాల్లో గరిష్ఠంగా రూ.25-30 లక్షల్లోపే అవుతోంది. చైనాలో రూ.25 లక్షలు, ఫిలిప్పీన్స్లో రూ.25-30 లక్షలు, ఉక్రెయిన్లో రూ.25 లక్షలు, కిర్గిస్థాన్లో రూ.20 లక్షలు, రష్యాలో రూ.25-30 లక్షల చొప్పున ఖర్చవుతోంది.
అర్హత పరీక్షలో 20 శాతానికి మించని ఉత్తీర్ణత
విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసిన విద్యార్థులు భారత్లో సేవలందించాలంటే నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) నిర్వహించే ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ)లో తప్పక ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రాష్ట్ర వైద్య మండలి(ఎస్ఎంసీ)లో తమ అర్హతను నమోదు చేసుకుని వైద్య సేవలందించడానికి, పీజీ నీట్ రాసేందుకు అర్హత లభిస్తుంది. ఎఫ్ఎంజీఈలో ఏటా ఉత్తీర్ణులవుతున్నవారి సంఖ్య 20 శాతానికి మించడం లేదు. చైనాలోని దాదాపు 100 కళాశాలల్లో మన విద్యార్థులు వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. వాటిలో 100 మంది కంటే ఎక్కువగా చేరుతున్న కళాశాలలు సుమారు 50 ఉన్నాయి. 2019లో వాటిలో ఒక్క కళాశాల నుంచీ ఎఫ్ఎంజీఈలో 20 శాతాన్ని మించి ఉత్తీర్ణత సాధించలేదు. కొన్ని దేశాల్లోని కళాశాలల్లో చదివినవారెవరూ ఉత్తీర్ణత సాధించలేదు. కాగా, ఎఫ్ఎంజీఈ స్థానంలో త్వరలో ‘నెక్స్ట్’(నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్) అందుబాటులోకి రానుంది.
విద్యార్థుల వైఫల్యానికి కారణాలు..
* మన దేశ వైద్యవిద్య నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా కొన్ని విదేశాల్లో ఉండకపోవడం
* కళాశాల ఎంపికలో పొరపాటు
* వైద్యవిద్య అభ్యసన కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం
* అనుభవపూర్వక పరిజ్ఞానం కోసం రోగులతో మాట్లాడాల్సి ఉండగా.. స్థానిక భాష అర్థం కాకపోవడం
* కేవలం విద్యాపరంగా ఉత్తీర్ణత సాధిస్తే చాలనే ధోరణితో పాఠ్యాంశాలపైనే దృష్టిపెట్టడం
* విదేశాల్లో వైద్యవిద్య చదివి తిరిగొచ్చాక.. ఏదో ఒక ఆసుపత్రిలో అనధికారికంగా పనిచేస్తూ అర్హత పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం
ఆచితూచి వ్యవహరించాలి
విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పలు సూచనలు చేసింది.
* దేశాన్ని, కళాశాలను విద్యార్థులు ఆచితూచి ఎంచుకోవాలి.
* ఎన్ఎంసీ అనుమతించిన విదేశాలను, కళాశాలలనే ఎంపిక చేసుకోవాలి.
* విదేశీ వైద్య కళాశాలలో చేరడానికి ముందే.. ఎన్ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రాన్ని(ఈసీ) పొందాలి.
* ఆంగ్లంలో బోధించే కళాశాలను ఎంచు కోవడం ఉత్తమం.
* విదేశాల్లో వైద్యవిద్య చదివేందుకు వెళ్లాలనుకునే ప్రతి విద్యార్థీ ఎన్ఎంసీ వెబ్సైట్ను తప్పక చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం