అందరికీ ఆసుపత్రుల అవసరం లేదు

దేశంలో కరోనా బాధితులందరికీ ఆసుపత్రుల అవసరం లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. 85% మందికి సాధారణ మందులతోనే వైరస్‌ తగ్గిపోతుందని, మిగతా 15% మంది వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆసుపత్రులకు రావడం మేలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం సాధ్యం కాదన్నారు.

Updated : 27 Apr 2021 09:19 IST

అది ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదు
85% మందికి సాధారణ మందులతోనే తగ్గిపోతుంది
ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా బాధితులందరికీ ఆసుపత్రుల అవసరం లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. 85% మందికి సాధారణ మందులతోనే వైరస్‌ తగ్గిపోతుందని, మిగతా 15% మంది వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆసుపత్రులకు రావడం మేలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం సాధ్యం కాదన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘చాలామందిలో అనవసర భయాందోళనలు నెలకొన్నాయి. పాజిటివ్‌ వచ్చినా లక్షణాలు లేనివారు, ఆక్సిజన్‌ స్థాయులు సక్రమంగానే ఉన్నవారు మున్ముందు ఇబ్బంది పడకూడదని ఆసుపత్రులకు వెళ్తే... అక్కడ రద్దీ పెరుగుతుంది. చికిత్స అవసరమైనవారు ఇబ్బందిపడాల్సి వస్తుంది. భయాందోళనలతో ఇంట్లో మందులు నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్లో కొరత ఏర్పడుతుంది. తొలిరోజు నుంచే మందులన్నీ వాడితే మున్ముందు సీరియస్‌ కాదనుకుంటారు. దానివల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. మొదటిరోజు నుంచే ఆక్సిజన్‌ పెట్టుకుంటే మున్ముందు దాని అవసరం రాదన్న ఉద్దేశంతో కొందరు ఇంట్లోనే సిలిండర్లు పెట్టుకొని అనవసరంగా వాడుతున్నారు. ఇదేమీ మంచి అలవాటు కాదు. 94పైన ఆక్సిజన్‌ స్థాయి ఉంటే అన్ని అవయవాలకూ ప్రాణవాయువు అందుతోందని లెక్క. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 94-95 స్థాయిలో ఆక్సిజన్‌ ఉన్నవారు కృత్రిమంగా ఆక్సిజన్‌ పెట్టుకొని దాన్ని 97-98 స్థాయికి తీసుకెళ్లాలనుకోవడం సరికాదు. ప్రాణవాయువును దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఆక్సిజన్‌ స్థాయిని నిత్యం 95పైన ఉంచాలనుకోవద్దు. 92, 93 స్థాయిలో ఉన్నా, ఇబ్బందులేమీ రావు.

వృథా అవుతోంది...
సిలిండర్లు పెట్టుకున్నవారు భోజన సమయంలో మాస్కు పక్కనపెట్టి, అలాగే వదిలేస్తున్నారు. ఆ సమయంలో ఆక్సిజన్‌ను బంద్‌ చేయకపోవడం వల్ల వృథా అవుతోంది. ప్రాణవాయువును న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఉన్నవాళ్లు ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉందని అనిపించినప్పుడు బోర్లా పడుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ప్రాణవాయువు స్థాయి పెరుగుతుంది.

రెమ్‌డిసివిర్‌తో ప్రయోజనాలు లేవు...
రెమ్‌డెసివిర్‌ వల్ల పెద్దగా ప్రయోజనాలేమీ లేవు. చైనా, అమెరికా, డబ్ల్యూహెచ్‌వోలు నిర్వహించిన అధ్యయనాల్లో సానుకూల ఫలితాలు రాలేదు. రెమ్‌డెసివిర్‌ దొరక్కపోతే భయాందోళనలు అక్కర్లేదు. కరోనా సోకిన 85% మందిలో తేలికపాటి లక్షణాలే ఉంటున్నాయి. దగ్గు, జర్వం, జలుబుకే లక్షణాలు పరిమితమవుతాయి. సాధారణ మందులతో అవి క్రమంగా తగ్గిపోతాయి. ఆక్సిజన్‌ స్థాయి తగ్గి, జ్వరం తీవ్రమై... నీరసం, మగత, తీవ్రంగా వాంతులు అవుతుంటే అప్పుడు ఆసుపత్రిలో చేరే విషయమై నిర్ణయం తీసుకోండి. భయాందోళనల కారణంగా ఇంట్లో ఉండకుండా అందరూ ఆసుపత్రుల్లో చేరతామంటే అంతమందికి సేవలందించే స్థాయి ప్రపంచంలోని ఏ మౌలిక వసతుల వ్యవస్థకూ లేదు. కేసులు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలి’’ అని గులేరియా పేర్కొన్నారు.

ఇంట్లో ఉన్నా మాస్కు ధరించాలి: వీకే పాల్‌
మహిళలు నెలసరి సమయంలోనూ టీకా తీసుకోవచ్చని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. ‘‘రెండు వ్యాక్సిన్లు చాలా బాగా పనిచేస్తున్నాయి. అందువల్ల దొరికింది తీసుకోవాలి. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నవారు ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఐదు రోజులకు మించి దగ్గు ఉంటే బ్యుడెనెసైట్‌ తీసుకోవచ్చు. అవసరమైన వారికి మాత్రమే పడకలు ఉపయోగపడేలా చూడాలి. లేకపోతే డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో ఉన్నా, అందరూ మాస్కులు ధరించడం మేలు. పాజిటివ్‌ వచ్చినవారిని ఇంట్లో ఏకాంతంగా ఉంచే పరిస్థితి లేకుంటే బయట కేంద్రాలకు పంపండి. ఆసుపత్రుల కోసం చూడొద్దు’’ అని ఆయన సూచించారు.

 

మాస్కులు ధరించకుంటే 90% ముప్పు: లవ్‌ అగర్వాల్‌
మాస్కు ధరించకుండా ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా మాట్లాడుకుంటే... వైరస్‌ సోకే ముప్పు 90% ఉంటుందని వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ హెచ్చరించారు. ఇద్దరూ మాస్కులను సక్రమంగా ధరిస్తే వైరస్‌ నుంచి చాలామటుకు రక్షణ లభిస్తుందన్నారు. ‘‘భౌతికదూరం పాటించకుంటే... ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఒక్క వ్యక్తి నుంచి నెలలో 406 మందికి వైరస్‌ సోకుతుంది. అదే 50% భౌతిక దూరం పాటిస్తే... 15కి, 75% భౌతిక దూరంతో 2.5కి బాధితుల సంఖ్య పరిమితమవుతుంది’’ అని ఆయన వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని