PM Modi Cabinet: భారీ ప్రక్షాళన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు. ఇదివరకున్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. ఏడుగురికి పదోన్నతి కల్పించారు. కొత్తగా 36 మందిని కొలువులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది. ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన 2019 మే 31న 57 మంది మంత్రులతో కేబినెట్‌ ఏర్పాటు చేశారు. ...

Updated : 08 Jul 2021 08:12 IST

రెండేళ్ల తర్వాత కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు
పాత మంత్రుల్లో డజను మందికి ఉద్వాసన
ఏడుగురికి పదోన్నతి..
కొత్తగా మరో 36 మంది
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు
ప్రతిభ, పనితీరు, సామాజిక వర్గాల ఆధారంగా అవకాశాలు
విద్యావంతులకు ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్‌ తప్ప అన్ని దక్షిణాది రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం
మంత్రివర్గంలో 25 రాష్ట్రాలకు చోటు
ఈనాడు - దిల్లీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు. ఇదివరకున్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. ఏడుగురికి పదోన్నతి కల్పించారు. కొత్తగా 36 మందిని కొలువులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది. ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన 2019 మే 31న 57 మంది మంత్రులతో కేబినెట్‌ ఏర్పాటు చేశారు. రాజీనామాలు, మరణాల కారణంగా ఆ సంఖ్య 53కి తగ్గిపోయింది. గత రెండేళ్లలో మంత్రుల పనితీరు, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం భారీ మార్పులు చేశారు. పనితీరు సరిగా లేని, క్రియాశీలకంగా వ్యవహరించని డజను మంది మంత్రులను పక్కనపెట్టారు. సహాయ మంత్రులుగా ఉంటూనే పనితీరుతో మెప్పించినందుకు నలుగురు స్వతంత్ర మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులకు కేబినెట్‌లో స్థానం కల్పించి వారి శ్రమను గౌరవించారు. వీరిలో జి.కిషన్‌రెడ్డి, కిరణ్‌ రిజీజు, ఆర్‌.కె.సింగ్‌, హర్‌దీప్‌సింగ్‌ పురి, మన్సుఖ్‌ మాండవీయ, పురుషోత్తం రూపాలా, అనురాగ్‌ ఠాకుర్‌ ఉన్నారు.  బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ 43 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం.. కొవిడ్‌ నిబంధనల వల్ల పరిమిత అతిథుల మధ్య సుమారు గంటన్నరపాటు సాగింది. ఎక్కువ మంది మంత్రులు హిందీలో, కొద్దిమంది ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

రవిశంకర్‌, జావడేకర్‌, నిశాంక్‌లకు నిరాశ

మంత్రివర్గ విస్తరణ వేళ పలువురు మంత్రులకు ప్రధాని ఉద్వాసన పలికారు. మొత్తం 12 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. ప్రధాని సిఫార్సు మేరకు వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాజీనామాలు చేసినవారిలో నలుగురు సీనియర్‌ మంత్రులు- రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, హర్షవర్ధన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌లతో పాటు సదానందగౌడ, సంతోష్‌ గంగ్వార్‌, దేబశ్రీ చౌధురి, బాబుల్‌ సుప్రియో, విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే, జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా, ఉన్నారు. కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది.

పక్కాగా పనితీరు అంచనా

మంత్రుల పనితీరు అంచనాకు పక్కా చర్యలు చేపట్టారు. ప్రధాని కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక యూనిట్‌ ద్వారా అమాత్యుల కదలికలు, మాటలు, వాటి ద్వారా ఎదురైన పరిణామాలను అంచనావేశారని తెలిసింది. అతి దూకుడుగా వ్యవహరించినవారిని, అతి నెమ్మదిని ప్రదర్శించినవారిని బయటికి పంపించేశారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రులు స్పందించిన తీరుకు ఎక్కువ మార్కులు వేసినట్లు ప్రస్తుత కూర్పును బట్టి అర్థమవుతోంది. దక్షిణాదిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకూ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, బిహార్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ లాంటి రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలనూ దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ కూర్పు పూర్తిచేశారు. ముందునుంచి వినిపిస్తున్న రీతిలోనే మధ్యప్రదేశ్‌ నేత జ్యోతిరాదిత్యకు కేబినెట్‌ బెర్తు లభించింది. కొత్తగా మంత్రివర్గంలోకి ఏడుగురు మహిళలను తీసుకున్నారు.

ఓబీసీలే 27 మంది

మొత్తం 77 మంది మంత్రుల్లో ఓబీసీల సంఖ్య 27. ఎస్సీలు 12, ఎస్టీలు 8, మైనార్టీలు ఐదుగురు ఉన్నారు. మిగిలిన 25 మంది విభిన్న సామాజిక వర్గాలవారు. నలుగురికి సీఎంలుగా పనిచేసిన నేపథ్యం ఉంది. కేబినెట్‌లో 25 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించినట్లయింది.

15 మంది కేబినెట్‌.. 28 మంది సహాయ మంత్రులు

ప్రమాణ స్వీకారం చేసినవారిలో 15 మందికి కేబినెట్‌ హోదా, మిగిలిన 28 మందికి సహాయ మంత్రుల హోదా అప్పగించారు. పాత, కొత్త కలిపితే మొత్తం కేబినెట్‌ మంత్రుల సంఖ్య 30కి చేరింది. కొత్త మంత్రుల్లో 33మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, 8మంది రాజ్యసభ నుంచి వచ్చారు. అస్సాం మాజీ సీఎం సోనోవాల్‌, తమిళనాడు భాజపా అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ ఇంకా ఏ సభలోనూ సభ్యులుగా లేరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని