కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం.. సాగర్‌

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలోని 16 అవుట్‌లెట్‌ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తీర్మానం చేసింది. గెజిట్‌ అమలుకు అనుగుణంగా 14వ తేదీలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానాన్ని పంపేందుకు

Updated : 13 Oct 2021 10:03 IST

 మొదటిదశలో బోర్డు కిందకు 16 అవుట్‌లెట్లు!

జల విద్యుత్‌ కేంద్రాలు అప్పగించబోమన్న తెలంగాణ

ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలోని 16 అవుట్‌లెట్‌ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తీర్మానం చేసింది. గెజిట్‌ అమలుకు అనుగుణంగా 14వ తేదీలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానాన్ని పంపేందుకు నిర్ణయించింది. రాష్ట్రాలు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తే గానీ గెజిట్‌ అమల్లోకి రాదు. ఈ ఉత్తర్వుల విడుదలకు ఏపీ సానుకూలత వ్యక్తం చేసింది.  జల విద్యుత్‌ కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి తెలంగాణ నిరాకరించింది. దీంతో గడువులోపు గెజిట్‌ అమలుపై అనిశ్చితి నెలకొంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన బోర్డు 15వ సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, బోర్డు సభ్యులు రవికుమార్‌ పిళ్లై, ముతాంగ్‌, రాయ్‌పురే పాల్గొన్నారు. ఉప సంఘం 30 కేంద్రాలకు సంబంధించి రూపొందించిన నివేదికపై బోర్డు సమావేశంలో చర్చించారు.

రాష్ట్రాలు ఆమోదించాల్సిన ప్రాజెక్టులివే...

కేంద్ర గెజిట్‌లోని షెడ్యూల్‌-2లో పేర్కొన్న ప్రాజెక్టుల్లో మొదటి విడతగా కొన్నిటిని బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు కేఆర్‌ఎంబీ నిర్ణయించింది. తీర్మానంలో వాటిని పొందుపరిచింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద మొత్తం 16 డైరెక్ట్‌ అవుట్‌లెట్లను ప్రతిపాదించవచ్చని సమాచారం. గడువులోపు గెజిట్‌ అమలుకు వీలుగా శ్రీశైలం, సాగర్‌ల పరిధిలో ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను రాష్ట్రాలు అప్పగించాలని కోరుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బోర్డు పేర్కొంది.

తెలంగాణ ససేమిరా.. ఏపీ సమ్మతి

బోర్డు జాబితాలో జల విద్యుత్‌ కేంద్రాలు కూడా ఉండటంతో తెలంగాణ అంగీకరించలేదని తెలిసింది. కృష్ణా జలాల కేటాయింపుల అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఇప్పుడు గెజిట్‌ అమలు చేయడం సరికాదని పేర్కొన్నట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కోసమే నిర్మించిందని పేర్కొన్నట్లు తెలిసింది. హంద్రీ నీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను కూడా చేర్చాలని తెలంగాణ సూచించగా, ఏపీ అంగీకరించలేదని సమాచారం. గెజిట్‌ అమలుకు ఉత్తర్వులిచ్చేందుకు తాము అనుకూలంగా ఉన్నామని ఏపీ స్పష్టం చేసినట్లు తెలిసింది. తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రాలను చేర్చితేనే ఏపీ పరిధిలోని రెండు కేంద్రాలను బోర్డు అధీనంలోకి వెళ్లడానికి అంగీకరిస్తామని కూడా పేర్కొన్నట్లు సమాచారం. సీడ్‌మనీపైనా రెండు రాష్ట్రాలు బోర్డు నుంచి స్పష్టత కోరినట్లు తెలిసింది.

రాష్ట్రాల ఉత్తర్వులు కీలకం

ప్రాజెక్టుల పరిధిలోని సిబ్బంది, నిధులు, భద్రత, ఆస్తుల (అసెట్స్‌) వివరాలు కూడా రాష్ట్రాలు అప్పగించాల్సి ఉండగా ఏపీ పూర్తిస్థాయిలో అందజేసినట్లు పేర్కొంది. మరోవైపు ప్రాజెక్టుల నిర్వహణ (ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌) మాత్రమే బోర్డు చేపడుతుంది. ప్రాజెక్టు యాజమాన్య (ఓనర్‌షిప్‌) హక్కులు ప్రభుత్వాల పరిధిలోనే ఉండనున్నాయి. ప్రాజెక్టులపై రుణాలు పొందడానికి రాష్ట్రాలకు ఆటంకాలేవీ ఉండవని తెలిసింది.


పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం: తెలంగాణ

కృష్ణా బోర్డు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ తెలిపారు. బోర్డు సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ లేవనెత్తుతున్న సమస్యను కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌కు పంపేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సమయంలో గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు వద్దని తెలంగాణ కోరుతోంది. శ్రీశైలం నిర్మించిందే జల విద్యుత్‌ కోసం. తెలంగాణ అధికారికంగానే ఉత్పత్తి చేస్తోంది. విద్యుదుత్పత్తి ఆపాలని ఏపీ అంటోంది. రాయలసీమ అవసరాలకు అనుగుణంగా సాగునీటిని తీసుకువెళ్లడం ఆ రాష్ట్రానికి అలవాటుగా మారింది. ప్రాజెక్టులు విస్తరిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండా ప్రాజెక్టులను బోర్డు తీసుకోదు. నిర్వహణ నిధుల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని సమావేశంలో సూచించాం’ అని రజత్‌కుమార్‌ వివరించారు.


అనధికారిక విద్యుదుత్పత్తే కారణం: ఏపీ

శ్రీశైలం నుంచి తెలంగాణ అనధికారికంగా జల విద్యుదుత్పత్తి చేపట్టడంతో కేంద్రం గెజిట్‌ జారీ చేయాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. సమావేశానంతరం ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జల విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ నిర్దేశించినా, వారు పట్టించుకోలేదు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేంద్రం వెంటనే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జల విద్యుదుత్పత్తి కేంద్రాలు మినహా ప్రాజెక్టులను తీసుకోవాలని బోర్డును తెలంగాణ కోరింది. ఇది ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. శ్రీశైలం కేవలం విద్యుదుత్పత్తికే అయితే తెలంగాణ సాగునీటిని ఎలా తీసుకుంటోంది? బోర్డుకు ప్రాజెక్టుల సమాచారం అంతా అందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఉత్తర్వులు జారీ చేస్తుంది’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని