YS Sharmila: నేటి నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం

చేవెళ్ల మరో పాదయాత్రకు వేదికైంది. బుధవారం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు.

Updated : 30 Sep 2022 15:24 IST

16 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పాదయాత్ర

చేవెళ్లలో మొదలై అక్కడే ముగింపు

ఈనాడు- హైదరాబాద్‌, చేవెళ్ల- న్యూస్‌టుడే: చేవెళ్ల మరో పాదయాత్రకు వేదికైంది. బుధవారం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. 2003లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర చేపట్టారు. 2012లో షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. 230 రోజులపాటు 116 నియోజకవర్గాల్లో 3,112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. వైతెపాను స్థాపించిన ఆమె తాజాగా మరోమారు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం చేవెళ్ల నుంచి ప్రారంభించి 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి.. తిరిగి అక్కడే ముగించనున్నారు. ఈ ఏడాది జులై 8న పార్టీ ఆవిర్భవించగా.. పాదయాత్ర చేపడతామని ఆ రోజే షర్మిల ప్రకటించారు. మరోవైపు నిర్మాణపరంగా ఇతర పార్టీలు జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటే... వైతెపా పార్లమెంట్‌ స్థానాలను ఎంచుకుని.., వాటికి కన్వీనర్లు, కోకన్వీనర్లను ప్రకటించింది. ప్రస్తుతం పాదయాత్ర కూడా హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది. తొలిరోజు కార్యక్రమాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఆర్‌.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ, కంచె ఐలయ్యతో పాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను వైతెపా ఆహ్వానించింది. మొదటి పది రోజులు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో యాత్ర సాగనుంది. ఇదే మాదిరి రాష్ట్రంలోని దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్‌మ్యాప్‌ను పార్టీ శ్రేణులు రూపొందించాయి. మొత్తం 26 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాయి. అన్ని మండలాల్లోని మున్సిపాలిటీలు, పెద్ద గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుందని పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తెలిపారు.

తొలిరోజు ఇలా...

ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలిరోజు చేవెళ్ల.. వికారాబాద్‌ రోడ్డులోని కేజీఆర్‌ గార్డెన్‌ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులను తరలించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ.., అనంతరం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది. వైఎస్‌ విజయమ్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చేవెళ్ల పట్టణం మీదుగా పాదయాత్ర ప్రారంభించి కందవాడ-నక్కలపల్లి శివారుకు షర్మిల చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. నిత్యం సగటున 12 కి.మీ.లు నడిచేలా షెడ్యూలు రూపొందించినట్లు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వెల్లడించారు.


వైఎస్‌ పాలన తెచ్చేందుకే తెలంగాణలో పాదయాత్ర

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు షర్మిల ఘన నివాళి

వేంపల్లె, న్యూస్‌టుడే: తెలంగాణలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన తెచ్చేందుకే పాదయాత్ర చేపడుతున్నానని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. తన తల్లి, వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో కలసి మంగళవారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ను సందర్శించారు. అరగంట పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో విజయమ్మ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాలన్న లక్ష్యంతోనే చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపడుతున్నానన్నారు. రాష్ట్రమంతా తిరిగి ప్రతి గడప తొక్కి ప్రజలతో మమేకమై వారి కష్టాలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన పోరాడతామన్నారు. తెలంగాణ ప్రజలు, వైఎస్సార్‌ అభిమానులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆమె కోరారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని