Viveka Murder Case: ఆ 3 రోజుల్లోనే వివేకాను హత్య చేయాలన్నారు

‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఇంటివద్ద నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేసే పి.రాజశేఖర్‌ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఎర్ర గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారు.

Updated : 17 Mar 2022 05:04 IST

నైట్‌వాచ్‌మన్‌ మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నాడు..
సమాచారమిచ్చిన వివేకా పీఏ కృష్ణారెడ్డి  
అతను తిరిగొచ్చేలోగానే హత్య చేయాలని గంగిరెడ్డి మాకు చెప్పారు
పులివెందుల కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో షేక్‌ దస్తగిరి వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఇంటివద్ద నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేసే పి.రాజశేఖర్‌ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఎర్ర గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆ మూడు రోజుల్లోనే వివేకాను చంపేయాలని, అందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని గంగిరెడ్డి నాతోనూ, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలతోనూ చెప్పారు’ అని ఈ కేసులో నిందితుడు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించారు. వివేకా హత్యకు 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ప్రణాళిక రూపొందిందని చెప్పారు. వివేకా ఇంట్లోకి వెళ్లటానికి నైట్‌వాచ్‌మన్‌ రాజశేఖర్‌, జిమ్మి అనే కుక్కే అడ్డంకిగా ఉంటాయని తాను ఎర్ర గంగిరెడ్డితో చెప్పానని పేర్కొన్నారు. అయితే వివేకా పీఏ కృష్ణారెడ్డితో మాట్లాడి, వాచ్‌మన్‌ను అక్కడ లేకుండా చేస్తానని గంగిరెడ్డి చెప్పారన్నారు. తర్వాత 2019 మార్చి 1 నుంచి గంగిరెడ్డి వివేకా వెంటే ఉంటూ.. ఆయన ఆనుపానుల్ని సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలతో పాటు తనకూ చెప్పేవాడని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 306(4)(ఏ) కింద పులివెందుల ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ ప్రతులు తాజాగా వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివీ..

మళ్లీ అనుమానం ఎందుకు?
వివేకాను చంపాలని గంగిరెడ్డి చెప్పిన రెండు, మూడు రోజుల తర్వాత సునీల్‌యాదవ్‌ ఓ రోజు నాకు రూ.కోటి ఇచ్చారు. ఇంత డబ్బెవరిచ్చారని అడిగాను. ‘దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డికి ఇస్తే ఆయన నాకు ఇచ్చాడు’ అని సునీల్‌ చెప్పాడు.తర్వాత వివేకానందరెడ్డిని హత్య చేయాలా?వద్దా? అనేది నిర్ధారించుకోవడానికి సునీల్‌ను సంప్రదించాను. అతను నన్ను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లి, శివశంకర్‌రెడ్డికి ఫోన్‌ చేశాడు. ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘గంగిరెడ్డి చెప్పింది చేయండి. మేం ఉన్నామని చెప్పాం కదా. మళ్లీ అనుమానం ఎందుకు?’ అని ప్రశ్నించారు.

డబ్బులు కావాలంటే అడగమన్నారు..
వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లాక నేను, సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి.. ఈశ్వరయ్యతోటలో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని కలిశాం. సీబీఐకి కేసు అప్పగించారు కదా.. మా పరిస్థితి ఏంటని అడిగాం. ‘మేం చూసుకుంటాం లే. ఇబ్బంది లేదు. డబ్బులేవైనా కావాలంటే అడగండి ఇస్తాం’ అని మాతో అన్నారు.

* 2020 మార్చి 3న దిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నాకు నోటీసిచ్చింది. దాన్ని పట్టుకుని బయపురెడ్డి ఇంట్లో శివశంకర్‌రెడ్డిని కలిశాను. ‘సీబీఐ వాళ్లు ఎంత కొట్టినా మా పేర్లు బయటపెట్టకు. నీకు కావాల్సినంత డబ్బిస్తాం. జీవితం సెటిల్‌ చేస్తాం. నీతోపాటు భరత్‌యాదవ్‌ కూడా దిల్లీ వస్తాడు. సీబీఐ వాళ్లు నిన్ను ఏం అడుగుతున్నారో ఆ వివరాలు మాకు చెబుతాడు’ అని శివశంకర్‌రెడ్డి, బయపురెడ్డి, విద్యారెడ్డి నాతో చెప్పారు. నాలుగైదు రోజులపాటు భరత్‌ నాతో దిల్లీలోనే ఉన్నాడు.తర్వాత సీబీఐకి అనుమానం వస్తుందేమోనని పులివెందులకు వచ్చేశాడు. నేను దిల్లీలో రెండున్నర నెలలున్నా సీబీఐ అధికారులకు నిజం చెప్పలేదు. పులివెందులకు తిరిగొచ్చాక భరత్‌యాదవ్‌, బయపురెడ్డి నన్ను కలిసి సీబీఐ అధికారులతో ఏం చెప్పావు? అని ఆరా తీశారు. ఏమీ చెప్పలేదన్నాను.

వాంగ్మూలం ఏమిచ్చావని అడిగారు..
కడపలో సీబీఐ అధికారుల విచారణలో వారితో నిజం చెప్పాను. ప్రొద్దుటూరు కోర్టులో జడ్జి ఎదుట అదే విషయమై వాంగ్మూలం ఇచ్చాను. ఆ తర్వాత భరత్‌యాదవ్‌, శివశంకరెడ్డి నన్ను కలిశారు. వాంగ్మూలంలో ఏం చెప్పావని అడిగారు. ప్రాణభయంతో నిజం చెప్పలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి తప్ప ఇంకేమీ చెప్పలేదన్నాను. 

అవినాష్‌రెడ్డి రమ్మంటున్నారని పిలిచారు
కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి.. తోట దగ్గరకు రమ్మంటున్నారంటూ ఓరోజు భరత్‌ యాదవ్‌ నన్ను పిలిచాడు. నేను వెళ్లలేదు. తర్వాత భరత్‌, పులివెందులకు చెందిన న్యాయవాది ఓబుల్‌రెడ్డి నన్ను హెలిప్యాడ్‌ వద్దకు పిలిచారు. ఓబుల్‌రెడ్డి నాతో మాట్లాడుతూ.. ‘జడ్జి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం యథాతథంగా నాతో చెప్పు’ అని అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చెప్పానన్నాను.‘జాగ్రత్త. అనవసరపు మాటలు మాట్లాడకు’’ అని ఓబుల్‌రెడ్డి నన్ను హెచ్చరించారు. తర్వాత పులివెందులలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు నా వాంగ్మూలాన్ని బహిర్గతం చేశారు. అప్పుడు భరత్‌ నా ఇంటికొచ్చి ‘నువ్వు వాళ్ల మీద చెప్పి.. చాలా పెద్ద తప్పుచేశావ్‌. వాళ్లు నిన్ను చంపేస్తారు. ప్రెస్‌మీట్‌ పెట్టి ఇప్పటి వరకూ చెప్పిందంతా అబద్ధమని చెప్పు. నీకు డబ్బు, ఇంకేం కావాలన్నా చేయిస్తాను’ అన్నాడు. నన్ను చంపేస్తామని ఈ రోజుకీ బెదిరిస్తున్నారు. భద్రత కల్పించాలని సీబీఐ ఎస్పీ, కడప ఎస్పీకి లేఖ రాశాను. అయినా  పట్టించుకోవట్లేదు.

ఎన్నికల్లో గెలిస్తే నీకు డబ్బులిస్తానన్నారు
వివేకాను హత్య చేసిన రోజు రాత్రి గంగిరెడ్డి బెంగళూరు భూ వివాదం సెటిల్‌మెంట్‌కు సంబంధించిన డబ్బులివ్వాలని వివేకాను అడిగారు. ‘ఆ డబ్బులు ఎందుకు అడుగుతావ్‌. నీకు ఇచ్చేవైతే ఇచ్చేస్తాను కదా! ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. దానిలో పెడితే ఎక్కువ వస్తాయి. అందులో గెలిస్తే నీకు డబ్బులిస్తా’’ అని వివేకా గంగిరెడ్డితో అన్నారు. వివేకాను అంతమొందించాక వై.ఎస్‌.రాజారెడ్డి ఆసుపత్రిలోని బాత్‌రూమ్‌లోకి వెళ్లి నా దుస్తులపై పడిన రక్తపు మరకల్ని, ముఖం, కాళ్లూ, చేతులూ కడుక్కున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని