YS Viveka Murder Case: వివేకా హత్యకు పథక రచన జగన్‌దేనేమో!

ఎన్నికల్లో గెలిచేందుకు జగనే... వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘2018లో జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది.

Updated : 01 Mar 2022 05:35 IST

 ఎన్నికల్లో గెలుపు కోసం కోడికత్తి కేసులానే దీన్నీ చేసుంటారు
అప్పట్లో జగన్‌కు చికిత్స చేసిన వైద్యులకు అధికారంలోకి వచ్చాక కీలక పదవులు
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి

ఈనాడు, అమరావతి-ఈనాడు డిజిటల్‌, కడప: ఎన్నికల్లో గెలిచేందుకు జగనే... వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘2018లో జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది. జగన్‌ భుజానికి గాయమైంది. అది తన మెడపై తగలాల్సిందని, తాను వేగంగా స్పందించి చేయి అడ్డుపెట్టడం వల్ల చేతికి గాయమైందని జగన్‌ అప్పట్లో చెప్పారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకుని, హైదరాబాద్‌ వెళ్లి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తనకు చికిత్స చేసిన ఇద్దరు ప్రైవేటు వైద్యులకు అధికారంలోకి వచ్చాక కీలక పదవులు (డాక్టర్‌ సాంబశివారెడ్డిని మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా, డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డిని ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించారు) ఇచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవహారాల్ని పర్యవేక్షించే బాధ్యతల్ని వారికి అప్పగించారు. ఆ దాడి లాగే, ఎన్నికల్లో గెలవడం కోసం మా మామ హత్యకూ జగనే పథక రచన చేసి ఉంటారు’ అని రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.వివేకా హత్యలో కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని అప్పట్లోనే సందేహించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్‌, అవినాష్‌రెడ్డి ఓడిపోయేవారని అని అన్నారు.‘వివేకా చనిపోయాక ఆయన వ్యక్తిగత జీవితం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేయడానికి 2019 మార్చి 23న నేను, సునీత సైబరాబాద్‌ పోలీసుస్టేషన్‌కు బయల్దేరాం. అంతలో వైఎస్‌ భారతి, విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి మా ఇంటికి వచ్చారు. వివేకా హత్యకు సంబంధించి మేం ఏ చేసినా సజ్జలకు చెప్పాలని భారతి సూచించారు. అప్పటికి మాకు కుటుంబ సభ్యులెవరిపైనా సందేహాల్లేవు. అప్పట్లోనే సందేహం వ్యక్తంచేస్తే జగన్‌, అవినాష్‌రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బంది పడేవారు’ అని పేర్కొన్నారు. ‘వివేకా హత్య జరిగిన రోజు.. జగన్‌ హైదరాబాద్‌ నుంచి సాయంత్రానికి పులివెందుల చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడాలో సజ్జలతో చర్చించారు. అప్పటికి వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ, అందులో డ్రైవర్‌ ప్రసాద్‌ పేరు ఉన్నట్లుగానీ నాకు, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే జగన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆ లేఖ గురించి ప్రస్తావించారు. వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్‌ మాట్లాడటం మాకు నచ్చలేదు. అదే విషయాన్ని ఆ తర్వాత ఆయనకు చెప్పాను’ అని రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు
‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వివేకాకు అసలు ఇష్టం లేదు. ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. జగన్‌ ఒత్తిడి మేరకే పోటీ చేశారు. అమెరికాలో ఉన్న నాకు ఎర్ర గంగిరెడ్డి ఫోన్‌ చేసి... వివేకాను పోటీకి ఒప్పించాలని కోరారు. తెదేపా నాయకులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి చేతులు కలిపారని, వివేకా అయితేనే గెలవగలరని చెప్పారు. ఆ ఎన్నికల్లో తనకంటే బలహీన అభ్యర్థి అయిన బీటెక్‌ రవిపై కేవలం 30 ఓట్ల తేడాతో వివేకా ఓడిపోయారు. అవినాష్‌రెడ్డి కుటుంబానికి ఎర్ర గంగిరెడ్డి దగ్గరయ్యాడని తెలిసింది. ఆ ఎన్నికల తర్వాత ప్రొద్దుటూరులో తన సోదరుడి పేరు మీద ఎర్ర గంగిరెడ్డి రూ.కోటి విలువైన వ్యవసాయ భూములు కొన్నాడు. ఆ ఎన్నికల్లో వివేకా కోసం కాకుండా, తన కోసం పనిచేసేందుకు శివశంకర్‌రెడ్డికి రూ.70 లక్షలిచ్చానని బీటెక్‌ రవి నాకు చెప్పారు. మా బంధువులైన భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలతో పాటు, శివశంకర్‌రెడ్డి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని ఓట్లు వివేకాకు పడకుండా చేయడం వల్లే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చడానికి మేం హైదరాబాద్‌లోని రెండు ఇళ్లు, ఒక ఫ్లాటు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని జల విద్యుత్‌ కేంద్రంలో 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చింది’ అని వాంగ్మూలంలో రాజశేఖర్‌రెడ్డి వివరించారు.

వివేకాతో వారికి ఎప్పటి నుంచో విభేదాలు
‘వివేకానందరెడ్డికి, భాస్కర్‌రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. 2017లో ప్రభుత్వ భూమిని స్థానిక శ్రీకృష్ణ ఆలయ కమిటీకి కేటాయించేలా వివేకా ప్రయత్నించారు. అది అవినాష్‌రెడ్డికి ఇష్టం లేదు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు.  తాను కుటుంబసభ్యుల కోసం ఎన్ని త్యాగాలు చేసినా వారు తనంటే అసూయతోనే ఉంటున్నారని చనిపోవడానికి 2, 3 నెలల ముందు వివేకా నాతో చెప్పి బాధపడ్డారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు... ఆయన, వివేకా ఒకరికి ఒకరు బాసటగా నిలిచేవారు. ఒకరు ఎంపీగా పోటీ చేస్తే, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అవసరాన్ని బట్టి అటూ ఇటూ మారేవారు. రాజశేఖర్‌రెడ్డి మరణించాక... ఆ స్థానం నుంచి పోటీకి భాస్కర్‌రెడ్డి పేరును జగన్‌ ప్రతిపాదించారు. కానీ వివేకాకు అది ఇష్టంలేదు. భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిల అభిమతానికి విరుద్ధంగా వివేకా ఒక భూ వివాదం సెటిల్‌మెంట్‌లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వారు మరింత కక్ష పెంచుకున్నారు’ అని తెలిపారు.  

రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు
‘వివేకా హత్య జరిగిన రోజు కడప మాజీ మేయర్‌ సురేష్‌, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఒక కంప్లెయింట్‌ రాసుకుని వచ్చి, నా భార్య సునీతను సంతకం పెట్టాలన్నారు. దానిలో తెదేపా నాయకులు సతీష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారు. ఆ ముగ్గురూ తెదేపా నాయకులు కావడంతో ఈ నేరం వారే చేశారనడానికి నిర్ధిష్టమైన ఆధారమేదీ లేకపోయినా, కేసును రాజకీయ కోణంలో మలుపు తిప్పుతున్నారని గుర్తించడంతో ఆమె సంతకం చేయలేదు’ అని రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

గుండెపోటు అని నేనెప్పుడూ చెప్పలేదు
‘2019 మార్చి 15న నేను సీఐ శంకరయ్యకు ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లుగా తెలుగులో రాసి ఉన్న ఒక కాగితాన్ని నాకు సీబీఐ అధికారులు చూపించారు. ఆ రోజు నేను ఎలాంటి స్టేట్‌మెంటూ ఇవ్వలేదు. ఆ రోజు హైదరాబాద్‌ నుంచి వేకువజామునే బయల్దేరామని, వివేకా హత్య గురించి కృష్ణారెడ్డి ఫోన్‌ చేసే సమయానికే మేం కర్నూలుకు చేరుకున్నామని రాసి ఉంది. ఆ రోజు ఉదయం 6.15కి కృష్ణారెడ్డి నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పటికి హైదరాబాద్‌లోనే ఉన్నాం. 7.30కి హైదరాబాద్‌ నుంచి బయల్దేరాం. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని, మంచం మీద నుంచి కింద పడటం వల్లే దెబ్బలు తగిలి ఉంటాయని నేను అన్నట్టుగా రాశారు. అదీ నిజం కాదు. నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2019 మార్చి 29న పులివెందుల ఎస్‌డీపీవో డి.నాగరాజాకి నేను మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అదీ నిజం కాదు. దాన్నీ సృష్టించారు. 2019 మార్చి 15న సీఐ శంకరయ్య నాకు నోటీసు ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. నాకు పోలీసులు ఎలాంటి నోటీసూ ఇవ్వలేదు. కేసును తప్పుదారి పట్టించేందుకే పోలీసులే ఆ తప్పుడు స్టేట్‌మెంట్‌లన్నీ సృష్టించారు’ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని